ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు తమిళనాడులో వరసగా జరుగుతున్నాయి. ఇటీవల మంత్రి సెంథిల్ బాలాజీ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మంత్రి ఇళ్లు, కార్యాలయాల పై కూడా ఈడీ దాడులు నేడు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి చెన్నైలోని తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి ఇల్లు, కార్యలయంపై కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
మనీ లాండరింగ్ ….
డీఎంకే నేత, మంత్రి పొన్ముడి కుమారుడి ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు గౌతమ్ చెన్నైలోని విల్లుపురంలో ఉంటారు. ఆయన ఇంట్లోనూ తనిఖీలు జరుపుతున్నారు. అయితే వీరిపై మనీలాండరింగ్ ఆరోపణలున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ దాడులపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. కక్షసాధింపు చర్యలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయన్న స్టాలిన్, బెంగళూరులో జరగనున్న విపక్షాల సమావేశాన్ని పక్కదోవ పట్టించేందుకు సోదాలు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు.