Clarity
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చారు. కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంగోలు ఎమ్మెల్యేగానే తాను మరోసారి అంటే వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనేక మంది అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారని వాటిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రకరకాలుగా మాట్లాడుతున్న వాటిని ఎవరూ నమ్మాల్సిన పనిలేదని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టత ఇచ్చారు.
ప్రచారమే…
గత కొంతకాలంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసారి పోటీ చేయరని, ఆయన కుమారుడు బరిలో ఉంటారని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఆయన పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. అలాగే ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా చెప్పారు. ఇందులో ఎటువంటి అనుమానాలు లేవని కూడా కార్యకర్తలకు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టత ఇచ్చారు.
ఎంపీగా కూడా.. Clarity
మాగుంట శ్రీనివాసరెడ్డి సయితం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని, ఆయన కుమారుడు రాఘవరెడ్డి బరిలో ఉంటారని గత కొద్దికాలంగా జరుగుతున్న ప్రచారానికి బాలినేని తెరదించారు. ఎమ్మెల్యేగా తాను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తామని, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నా తమ విజయానికి మాత్రం ఢోకా లేదని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యకర్తలు ఎలాంటి కన్ఫ్యూజన్కు గురికావద్దని, అందరం కలసి పార్టీ విజయానికి పాటుపడుదామని ఆయన పిలుపునిచ్చారు.
ఐదుసార్లు గెలిచి…
బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు శాసనసభ నియోజకవర్గం నుంచి వరసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాలుగు సాధారణ ఎన్నికలతో పాటు ఒక ఉప ఎన్నికను కూడా ఆయన విజయవంతంగా ఎదుర్కొన్నారు. 1999, 2004, 2009, 2012 ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 2012 లో వైసీపీ ఆవిర్భావంతో ఏర్పడిన ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసి జనామోదం పొందారు. 2014లో మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఒక టర్మ్ తర్వాత తిరిగి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ జగన్ తొలి మంత్రివర్గంలో చోటు సంపాదించగలిగారు.
మాగుంట కూడా…
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం కూడా అంతే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండుసార్లు మాత్రమే గెలిచింది. అన్ని సార్లు కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బెజవాడ పాపిరెడ్డి, 1999 ఎన్నికల్లో కరణం బలరామ కృష్ణమూర్తి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991 నుంచి మాగుంట కుటుంబం ఒంగోలు పార్లమెంటును తమ పరం చేసుకుంది. అప్పటి నుంచి ఆ కుటుంబాన్ని అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు వైసీపీలో చేరినా వారిని ఆదరిస్తూ వస్తున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి 2004, 2009, 2019 ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంంలో ఇరుక్కోవడంతో ఆయన మరోసారి పోటీకి సిద్ధమయ్యారన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. Clarity