మహారాష్ట్రలో రైతులు ఎప్పుడూ విన్నూత్న తరహాలో నిరసనకు దిగుతారు. ప్రభుత్వం తమను పట్టించుకునేంత వరకూ రైతులు ఆందోళనను మానరు. వివిధ రూపాల్లో వారి ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది. గిట్టుబాటు ధరలు కల్పించకపోయినా, సాగునీరు విడుదల చేయకపోయినా రైతులు వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం మహారాష్ట్రలో కొత్తేమీ కాదు. ఇక్కడ అనేక రూపాల్లో ఆందోళనలు జరిగితేనే ప్రభుత్వం దిగి వస్తుంది. గతంలోనూ ప్రభుత్వం మెడలు వంచడానికి రైతులు మహా పాదయాత్ర చేసి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డారు. మహారాష్ట్రలో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడేవారు ఎక్కువగా ఉండటంతో వారి డిమాండ్లను పరిష్కరించకుంటే పాలకులకు కూడా ఇబ్బందిగా మారుతుంది. అందుకే ప్రభుత్వం రైతుల సమస్యల విషయంలో ఎప్పటికప్పుడు తక్షణమే స్పందిస్తుంది. (Farmers)
రైతుల ఆందోళనతో…
మహారాష్ట్ర ధనిక రాష్ట్రం అయినప్పటికీ వ్యవసాయ పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. సాగునీటి సమస్యలతో పాటు గిట్టుబాటు ధరల విషయంలోనూ ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన జరగుతూనే ఉంటుంది. తాజాగా ఆనకట్ట నిర్మాణంలో తాము కోల్పోయిన భూములకు నష్ట పరిహారాన్ని ఇప్పించాలంటూ మహారాష్ట్ర రైతులు విన్నూత్న నిరసనకు దిగారు. తాము కోల్పోయిన భూములకు పరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు మహారాష్ట్ర సెక్రటేరియట్ కు చేరుకున్నారు. అక్కడ ఆందోళన నిర్వహించారు. అంతటితో ఆగకుండా సచివాలయం ఆరో అంతస్థు పైకి ఎక్కి కిందకు దూకడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సచివాలయంలోకి…
పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించినా రైతులు మాత్రం తమ నిరసనను మాత్రం ఆపలేదు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మోర్షిలోని అప్పర్ వార్థా ఆనకట్ట నిర్మాణం కోసం ప్రభుత్వం కొన్ని భూములను సేకరించింది. అయితే రైతుల నుంచి సేకరించిన భూములకు ఇచ్చిన పరిహారం తమకు సరిపోదని, వాటిని పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. అంతే కాదు భూములు కోల్పోయిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేశారు. అయితే వీరి డిమాండ్లను ప్రభుత్వం తలవంచక పోవడంతో వారు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనంటూ సచివాలయ ముట్టడికి వచ్చారు. రైతులను కొందరిని అదుపు చేసినా మరికొందరు పోలీసులను తప్పించుకుని సచివాలయంలోకి జొరపడ్డారు. (Farmers)
వైఫల్యం పైన…
రైతులు పెద్ద సంఖ్యలో సచివాలయాన్ని ముట్టడించేందుకు వస్తున్నప్పటికీ పోలీసులు వారిని అక్కడకు రాకుండా నియంత్రించలేకపోయారు. దీంతో కొందరు రైతులు సచివాలయంలోకి ప్రవేశించి ఆరో అంతస్థుకు చేరుకున్నారు. అంతకు ముందే సచివాలయంలో ఎవరూ ఆత్మహత్య చేసుకోకుండా అధికారులు వలలను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో పోలీసులు రైతులను కొందరిని అదుపులోకి తీసుకున్నారు.ప్రభుత్వ కార్యాలయంలోకి ప్రవేశించడమే కాకుండా ఆత్మహత్యకు ప్రయత్నించారని కొందరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే ఇంత మందిరైతులు సచివాలయంలోకి వస్తున్నా భద్రత వైఫల్యంపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలిసింది. ఇంటలిజెన్స్ వైఫల్యంతో పాటు స్థానిక అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ ఘటనలో కొందరు ప్రభుత్వ అధికారులపై వేటు పడే అవకాశముందని తెలిసింది. (Farmers)