దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఏసీ వంటి రిజర్వ్ డ్ బోగీల్లో ప్రయాణించే వారికే రైల్వే శాఖ భోజన సదుపాయం కల్పిస్తుంది. అయితే ఇప్పుడు జనరల్ బోగీలో ప్రయాణించే వారికి కూడా రుచికరమైన భోజనాన్ని అందించాలని దక్షిణ మధ్యరైల్వే శాఖ నిర్ణయించింది. భోజనం, తాగునీరు తక్కువ ధరకే ప్రయాణికులకు అందేలా అన్ని చర్యలు తీసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే శాఖ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
నాలుగు స్టేషన్లలో…
మొత్తం నాలుగు స్టేషన్లలో ఈ సేవలను ఇప్పటికే ప్రారంభించినట్లు రైల్వే శాఖ తెలిపింది. హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, రేణిగుంట రైల్వేస్టేషన్ లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇరవై నుంచి యాభై రూపాయలకే నాణ్యమైన భోజనం లభిస్తుందదని అధికారులు తెలిపారు. భోజనాన్ని రెండు కేటగిరీలుగా విభజించారు. తొలి కేటగిరిలో ఏడు పూరీలతో పాటు ఆలుకూర, పచ్చడిని ఇరవై రూపాయలకు అందచేస్తారు. రెండో కేటగిరిలో అన్నం,కిచిడీ, చోలే-కుల్చే,భటూరే, పావ్ బాజీ,మసాలా దోశల్లో ఒకదానిని ప్రయాణికులు ఎంచుకునే వీలుంటుంది. వీటి ధర యాభై రూపాయలుగా నిర్ణయించారు. 200 మిల్లీలీటర్ల వాటర్ గ్లాసులు కూడా కౌంటర్ వద్ద అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.