వంగవీటి (Vangaveeti) రాధా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఆ ఇంటి పేరు వింటేనే ఒక వైబ్రేషన్. వంగవీటి రంగా, రత్నకుమారిల తనయుడు వంగవీటి రాధా. ఆయన పెళ్లి కొడుకుగా మారబోతున్నాడు. ఇన్నాళ్లు వ్యక్తిగత జీవితాన్ని పెద్దగా పట్టించుకోని వంగవీటి రాధా ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ మేరకు పెద్దలు నిర్ణయించారని తెలిసింది. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన యువతినే వంగవీటి రాధా వివాహం చేసుకుంటున్నారని తెలిసింది. ఈ మేరకు ఆయన ముఖ్య అనుచరు లకు, సన్నిహితులకు స్వయంగా రాధా ఈ విషయాన్ని వెల్లడించారని చెబుతున్నారు. త్వరలోనే రాధా పెళ్లి జరగబోతుంది.
వచ్చే నెల 6న…
సెప్టెంబరు 6వ తేదీన వంగవీటి రాధా వివాహం విజయవాడలో జరుగుతుందని, పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికే ఈ వివాహం జరుగుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వంగవీటి రాధా వివాహం చేసుకోబోయేది ఎవరన్న ఆసక్తి సర్వత్రా ఉంటుంది. అయితే పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురానికి చెందిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ జక్కం అమ్మాణీ, బాబ్జీల కుమార్తె పుష్పవల్లిని రాధా వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు మాట్లాడుకుని వివాహం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలియవచ్చింది. ఒక్కసారిగా వంగవీటి రాధా వివాహం చేసుకుంటున్నారన్న వార్త తెలియడంతో ఆయన అనుచరుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా టాపిక్ గా మారింది.
రంగా, రత్నకుమారి దంపతులకు… (Vangaveeti)
వంగవీటి రాధా 1968లో వంగవీటి రంగా, రత్నకుమారి దంపతులకు జన్మించారు. ఆయన వయసు ప్రస్తుతం యాభై ఐదు సంవత్సరాలు. అయితే ఇప్పటి వరకూ ఆయన వివాహం దిశగా ఆలోచించలేదు. సన్నిహితులు, పెద్దలు చెబుతున్నా ఎప్పటికప్పుడు పెళ్లిపై అనాసక్తిని కనపర్చిన రాధా చివరకు అంగీకరించారని చెబుతున్నారు. రాజకీయంగా ఎదగడమే ఆయన లక్ష్యంగా పనిచేశారు. తొలిసారి వంగవీటి రాధా 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అదే ఆయనకు మొదటి, చివరి ఎన్నికగా మారింది. ఆ తర్వాత అనేక పార్టీలు మారినా ఆయనకు విజయం దక్కలేదు. కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం లోకి, ఆ తర్వాత వైసీపీలోకి అనంతరం తెలుగుదేశం పార్టీలోకి మారినా వంగవీటి రాధా మాత్రం అసెంబ్లీ మెట్టు ఎక్కలేకపోయారు. పార్టీలు మారినా ఆయన విజయానికి చేరువ కాలేకపోయారు. గత ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు.
రాజకీయంగా…
ప్రస్తుతం వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? లేదా? అన్నది ఇంకా తెలియకున్నా రంగా అభిమానులు, అనుచరుల్లో మాత్రం రాధా పెళ్లి వార్త నిజంగా శుభవార్త అనే చెప్పాలి. వంగవీటి రంగాకు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికీ ఆయన గ్రామాల్లో రంగా అభిమానులున్నారు. వారంతా కోరుకునేది ఒక్కటే. రంగా వారసత్వం కొనసాగాలని. కానీ ఇన్నాళ్లూ పెళ్లికి దూరంగా ఉన్న వంగవీటి రాధా పెద్దల నిర్ణయంతో మనసు మార్చుకుని కల్యాణ తిలకం దిద్దుకోనున్నారు. దీంతో రంగా అభిమానుల్లోనూ ఆనందం పెల్లుబుకుతుంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. (Vangaveeti)