ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి విద్యుత్తు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. విద్యుత్తు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలవంతం కాలేదు. తమ దీర్ఘకాలిక డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకుండా మొండి వైఖరితో ముందుకు వెళుతుందని విద్యుత్తు ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాము ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రభుత్వానికి నోటీసులు పంపామని విద్యుత్తు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
ప్రభుత్వం అప్రమత్తం…
రేపు అర్థరాత్రి నుంచి విద్యుత్తు ఉద్యోగులు సమ్మెకు దిగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. మరోసారి వారితో చర్చలు జరిపేందుకు నిర్ణయించింది. వరద బాధితుల పరామర్శలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఈ పనిని మంత్రులకు అప్పగించినట్లు సమాచారం. మరోవైపు విద్యుత్తు సౌధ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు రెండు వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. విజయవాడలో 144వ సెక్షన్ ను విధించారు. అత్యవసర సర్వీసుల కింద ఉన్న విద్యుత్తు ఉద్యోగులు సమ్మెకు దిగడం సరికాదని ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపుతుందా? సమ్మె రేపు అర్థరాత్రి నుంచి ఆగుతుందా? అన్నది చూడాలి.