అట్టహాసంగా ప్రారంభమైన జీ-20 రెండు రోజుల సదస్సు ముగిసింది. తదుపరి జీ-20 సమావేశాలను బ్రెజిల్ లో నిర్వహించాలని నిర్ణయించారు.ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవాలని, దురాక్రమణలకు పాల్పడే ధోరణిని విడనాడాలని రూపొందించిన ఢిల్లీ డిక్లరేషన్ను జీ-20 సభ్య దేశాలు ఆమోదించాయి. భారత్ చక్కని అంశాలను చర్చకు పెట్టిందంటూ బ్రెజిల్ అధ్యక్షుడు లులాదా సిల్వా మెచ్చుకున్నారు. తదుపరి సమావేశాల వారసత్వాన్ని అందించేందుకు గుర్తుగా ప్రధాని మోడీ ఒక పచ్చని మొక్కను బ్రెజిల్ అధ్యక్షుడికి అందచేశారు. ఒకే భూమి ఒకే కుటుంబం అన్న కాన్సెప్ట్ పై మంచి ఫలవంతమైన చర్చలు జరిగాయని చర్చకు వచ్చిన అంశాలపై సభ్య దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని మోడీ ముగింపు సందేశం ఇచ్చారు.
ప్రపంచ ఇంధన కూటమి
జీ-20 ప్రాధాన్యతాంశాలుగా ఆకలి, ఇంధనబదిలీ, సుస్థిర ఆర్ధిక పురోగతి అంశాలను చర్చించడం బాగుందని బ్రెజిల్ అధ్యక్షుడు ప్రస్తుతించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎం ఎఫ్ లలో మరిన్ని వర్ధమాన దేశాలకు ప్రాధాన్యత పెరగాలన్నారు. సభ్యదేశాలు విశ్వాస ఘాతుక చర్యలకు ఒడిగట్టకుండా ప్రపంచ ఇంధనకూటమిని ఏర్పాటు చేసుకోవాలని, అమెరికా, భారత్, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల మధ్య నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవాలని సదస్సులో దేశాధినేతలు అంగీకరించారు.
జీ-20 సదస్సుపై ఉక్రెయిన్ పెదవి విరుపు
ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సుస్థిరత ఏర్పాటు కోసం ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుంటూ, అంతర్జాతీయ మానవ చట్టాలను ఉల్లంఘించకుండా అడుగులేయాలని జీ-20 దేశాలకు ఢిల్లీ డిక్లరేషన్ సూచించింది. సదస్సుకు చైనా, రష్యాదేశాల నేతలు హాజరు కాకపోయినప్పటికీ ఈ ఒడంబడికపై ఆ దేశాల నేతలు సంతకాలు చేశారు. దురాక్రమణలు, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే విధంగా దాడులు చేసుకోరాదని డిక్లరేషన్ చేసినప్పటికీ ఉక్రేయిన్ పై దాడి విషయాన్ని మాత్రం సదస్సులో లేవనెత్తేదు. జీ-20 సదస్సుపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ పెదవి విరిచింది. ఇది రొటీన్ గా జరిగేదేనని, ఉక్రేయిన్ కూడా సదస్సులో భాగస్వామిగా ఉండి ఉంటే పరిస్థితిని మరింతగా అందరూ అర్ధం చేసుకునే వీలు ఉండేదని ఆదేశం వ్యాఖ్యానించింది. సంప్రదాయ ఇంధనవనరుల సామర్ధ్యాన్ని 2030 కల్లా మూడింతలు పెంచాలని సదస్సుతీర్మానించింది. దశల వారీగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తొలగించేయాలని కూడా తీర్మానించింది. అదే సమయంలో కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాలు, చమురు, వాయువుల తగ్గింపు విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.ప్రపంచ జీడీపీలో జీ -20 దేశాలకు 85 శాతం భాగస్వామ్యం ఉంది.
అలాగే 80 శాతం కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్నాయి. శిలాజ ఇంధన వినియోగాన్ని హేతుబద్దీకరించడం, దశలవారీగా తొలగించడం అన్న 2009 పిట్స్ బర్గ్ తీర్మానాన్ని కొనసాగిస్తామని సభ్యదేశాలు ప్రకటించాయి.
200గంటలు.. 300 మీటింగులు..15 డ్రాఫ్ట్స్ తయారీ
ఆఫ్రికన్ యూనియన్ ను జీ 20 శాశ్వత సభ్యదేశంగా గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్ణయాధికారంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా భాగస్వామ్యం కల్పించడం సదస్సు ప్రత్యేకత. సదస్సులో రెండు వందల గంటల పాటు నాన్ స్టాప్ గా చర్చలు జరిగాయని, 300 ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయని, ఉక్రెయిన్ వివాదంపై ఏకాభిప్రాయం సాధన కోసం 15 డ్రాఫ్ట్స్ తయారు చేశారని సదస్సు సమన్వయ కర్త అమితాబ్ కాంత్ తెలిపారు. క్లైమేట్ ఛేంజ్ పైనా, ఉక్రెయిన్ యుద్ధ వివాదంపైనా ఏకాభిప్రాయ సాధనలో ఎదురైన సవాళ్లను అధిగమించినట్లు న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టం చేస్తోందన్నారు. అమితాబ్ కాంత కృషిని పనితీరును కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసించారు.