రాజకీయాలు.. పేరును సంపాదించి పెడతాయి. వ్యాపారాలు డబ్బును సమకూర్చి పెడతాయి. అయితే నేటి రాజకీయ నేతలు ఇటు డబ్బు, అటు పేరును సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయని భావిస్తారు. అందుకే పాలిటిక్స్ కు యమ గిరాకీ పెరిగింది. గతంలో చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకూ రాజకీయంగా ఎదిగేవారు. కానీ ఇప్పుడదేమీ లేదు. డబ్బులుంటే చాలు పాలిటిక్స్ లో ఒక అర్హతగా భావించి రాజకీయ పార్టీలు కూడా వారిని ప్రోత్సహిస్తుంటాయి. టిక్కెట్లు ఇస్తుంటాయి. కానీ రాజకీయాలు, వ్యాపారాలు మాత్రం ముడిపెట్టకూడదు. దేనికదే ఉండాలి. అలా కలగలిసిన వాళ్లు ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారిలో గల్లా జయదేవ్ ఒకరు.
రాజకీయంగా…
గల్లా జయదేవ్ కుటుంబం తొలి నుంచి రాజకీయంగా పట్టున్నది. అలాగే వ్యాపార పరంగా గల్లా ఫ్యామిలీ ప్రసిద్ధి. చిత్తూరు జిల్లాలో గల్లా కుటుంబం ఇటు రాజకీయంగానూ, అటు వ్యాపారపరంగానూ కొన్ని దశాబ్దాల పాటు బాగానే ఏలింది.గల్లా అరుణకుమారి కాంగ్రెస్ హయాంలో మంత్రిగాపనిచేశారు. గల్లా అరుణకుమారి భర్త, కుమారుడు జయదేవ్ మాత్రం వ్యాపారాలను చూసుకునే వారు. అరుణకుమారి వయసు మీద పడటం, రాష్ట్ర విభజన జరిగిన కారణంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన గల్లా అరుణకుమారి కొంతకాలం క్రియాశీలకంగా ఉన్నా ఓటమి తర్వాత మానుకున్నారు. తల్లి పాత్రను కుమారుడు జయదేవ్ అందుకున్నారు. ఆయన రెండు దఫాలు తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకున్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక…
2014 నుంచి 2019 వరకూ టీడీపీ అధికారంలో ఉండటంతో గల్లా జయదేవ్ వ్యాపారపరంగా పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ 2019 లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వ్యాపార పరంగా సమస్యలను ఎదుర్కొనాల్సి వచ్చింది. అమరరాజా కంపెనీ కాలుష్యానికి కారకమవుతుందని చెప్పి జరిమానా కూడా విధించారు. గతంలో ఆ సంస్థకు ఇచ్చిన భూములను కూడా వైసీపీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. దీంతో అమరరాజా కంపెనీని ఏపీలో విస్తరించకుండా తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు జయదేవ్. అయితే రాజకీయాల్లో కొనసాగితే వ్యాపారాల్లో నష్టాలు చవిచూడక తప్పదని భావించిన గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు.
వచ్చేఎన్నికలలో…
గల్లా జయదేవ్ గుంటూరు ప్రజలకే కాదు.. పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండరన్న విమర్శలున్నాయి. ఆయన ఎక్కువ సమయం వ్యాపారాలకే కేటాయిస్తుండటంతో పార్టీ నేతలు కూడా హైకమాండ్ కు ఆయనపై ఫిర్యాదు చేశారు. అయితే గల్లా విషయం తెలిసిన చంద్రబాబు పలుమార్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. నెలలో కొద్ది రోజులైనా ప్రజల కోసం కేటాయించాలని కోరారు. కానీ గల్లా జయదేవ్ గత కొంతకాలంగా క్రియాశీలకంగా లేరు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయడానికి కూడా ఆయన సుముఖత చూపడం లేదని తెలుస్తోంది. వ్యాపార బాధ్యతలను చూసుకోవాల్సి ఉన్నందున రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గల్లా గుంటూరు నుంచి పోటీ చేయడం అనుమానమే. అనుమానమే కాదు. పోటీ చేయడం ఉండదు కూడా. గల్లా వ్యాపారం తిరిగి పుంజుకునే వరకూ రాజకీయాల నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.