గోదావరికి వరద పెరిగింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతుంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. భద్రాచలం వద్ద 54.30 అడుగులకు గోదావరి చేరుకుంది. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వరద పోటెత్తుతుండటంతో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
మూడో ప్రమాద హెచ్చరిక…
జలదిగ్భంధనంలో చిక్కుకున్న 25 లంక గ్రామాలు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. లంక గ్రామాలు భయం గుప్పిట్లో బతుకుతున్నాయి. పునరావాస కేంద్రాలకు తరలి రావాలని లంక గ్రామాల్లో ప్రభుత్వం చాటింపు వేయిస్తుంది.
గ్రామాలను ఖాళీ చేయిస్తూ…
కూనవరం దగ్గర 52.7 అడుగులకు గోదావరి చేరుకుంది. గోదావరి పోటెత్తుతుండటంతో అధికారులు గ్రామాలను ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. తమ ఇళ్లను వదిలి వచ్చేందుకు కొందరు మొరాయిస్తున్నప్పటికీ వారిని ఒప్పించి కేంద్రాలకు తరలిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మరికొన్ని రోజులు వర్షాలు పడితే గోదావరి మరింత ఉగ్రరూపం చూపే అవకాశముందని, నష్టం కూడా అంతే స్థాయిలో ఉంటుందని ప్రజలు ఆందోళనలో ఉన్నారు.