యమునా తీరంలో అలనాటి కృష్ణుని మోహనమురళీ రవం.!గోదావరి(Godhavari) తీరంలో ఈనాటి వంశీ సమ్మోహన కథా రవం.ఆ కృష్ణుని మురళీ రవానికి గోపికలు మురిసి పరవశిస్తే..,ఈ వంశీ కథా రవానికి పాఠకులు తడిసి ముద్దవుతున్నారు.
తెలుగు కధ పుట్టు పూర్వోత్తరాల్ని పక్కన బెడితే, వంశీ’ కథ మాత్రం 1975 లో గోదారి తీరం
లో పుట్టి ఇప్పటికినాలుగు పదులు దాటింది.
’నల్ల సుశీల’ కధతో మొదలైన వంశీ కథాప్రస్ధానం. ‘ఆ నాటివానచినుకుల్లోతడిసి,’పసలపూడి
కథలతోపరవశించి , ఆ తర్వాత”ఆకుపచ్చనిజ్ఞాపకాలతో’ “దిగువ గోదారికి దిగివచ్చింది.
గోదారి…
గోదారి (Godhavari) అలల గలలు ఎలావుంటాయో వంశీ కథలు అలా వుంటాయి.గోదారి నేపథ్యంలో అక్కడి యాస,భాష ముఖానికింత పసుపు రాసుకొని నుదుట బొట్టుపెట్టుకొని,బుగ్గన చుక్కా,జైల్లో గుండు మల్లెల చెండెట్టుకొని, ముక్కున మెరిసిపోయే ముక్కెరతో సింగారించుకొని అచ్చ తెలుగింటి అమ్మాయిలా నిండుగా కనిపిస్తాయి.అందుకే ఆధునిక కథాపర్వంలో వంశీకథలు ప్రత్యేకంగా కనబడతాయి. ఇంతకూ..ఎవరీ వంశీ?సినిమాలు చూసేవారికి డైరెక్టర్ వంశీగా తెలిసినా,కథ,నవలా రచయితగా సాహిత్యాభి మానులకు ‘వంశీ’ గా చిరపరిచితుడు. వంశీ పూర్తి పేరు..నల్లమిల్లి వంశీ.
తూర్పుగోదావరి జిల్లా (Godhavari) బలభద్రపురంలో పుట్టి 1975 దాకా ఆవూరికి 15 మైళ్లదూరంలోవున్న పసలపూడి గ్రామంలో పెరిగాడు. తీసినవి ఇరవై అయిదు సినిమాలు.అన్వేషణ,లేడీస్ టైలర్, మంచుపల్లకి,శ్రీ కనకమహాలక్ష్మీ డాన్స్ ట్రూప్, ఏ ప్రిల్ 1 విడుదల, ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు,గోపి గోపిక గోదావరి “సితార”లాంటి మంచి సినిమాల దర్శకుడాయన. నవలల్లోనూ ప్రత్యేక శైలి వంశీ రాసిన నవలల్లో ‘మహల్లో కోకిల ‘అత్యుత్తమమైంది.దీన్నే సితార సినిమాగా తీశాడు.పసలపూడి కథలతో వంశీ ఇంటిపేరు మారిపోయి నల్లమిల్లి వంశీ కాస్తా’ పసలపూడి వంశీ అయ్యాడు.తెలుగు కథకు పసలపూడి కథలు గోదారి అందాల్ని పులిమాయి.
వంశీ బహుముఖ ప్రజ్ఞావంతుడు.సినిమా దర్శకుడిగా,కథ,మాటలు,స్క్రీన్ ప్లే రచయిత
గానేగాక సంగీత దర్శకుడిగా, గాయకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. సాహిత్యవేత్తగా రాసిన కథలు,నవలలు, ఫీచర్లు ఇప్పటికే జనామోదం పొందాయి. కవిత్వం రాయలేదుగానీ ఆయన కథల నిండా కవిత్వమే కనబడుతుంది.గోదారి అందాల వర్ణనల్లో,వెన్నెల,వర్షం,పచ్చని చెట్లు,కొండ కోనల ప్రస్తావనల్లో వంశీలోని భావుకత ఏ కవి
భావుకత కంటే తక్కువకాదు.గోదారి తీరంలో ఎలాగైతే కొబ్బరి తోటలూ,మామిడి తోపులూ,పచ్చని పంటపొలాలు కనిపిస్తాయో…వంశీ కథల్లో కూడా పంట కాలువలు,కాలువలు,రామచిలుకలు,ఏటిగట్లు,పడవలు,లంకలు,లంకతోటలూ…కనులపండగ్గా కనిపిస్తాయి.కథలు అందరూ రాస్తారు.కానీ మంచి కథలు కొందరే రాస్తారు.అలాంటి వారిలో వంశీ ముందువరసలో వుంటాడు.కథ రాయడానికి రచయితకు ఒక్క భాషే కాదు….దమ్మూ, నిజాయితీవుండాలి.అధారిటీ,అనుభవం, తగినంత స్పందనా వుండాలి. ఇవన్నీ వంశీ లో గంప గుత్తగా కనిపిస్తాయి. వంశీ కథలు చదువుతుంటే..మనం కూడా గోదావరి తీరంలో విహరించినట్లే వుంటుంది. ఆ ప్రాంత ప్రజల జీవన విధానం,వారి వృత్తులు,ప్రవృత్తులు,ఆచారాలూ,అలవాట్లూ అక్కడి వంటలు,పిండివంటలూ ఒకటేమిటి?
గోదారమ్మ కడుపులో దాచుకున్న నాగరికత, సంస్కృతులతో పాఠకులు తడిసి ముద్దవ్వాల్సిందే.ఆగోదారమ్మ తల్లి ఒళ్లో సేదతీరాల్సిందే. వంశీ కథ.!బాపు బొమ్మ …!
అన్నట్లు వంశీ కథకు బాపు బొమ్మ మరో అలంకారం.బాపూ గారు వంశీ కథలకు వేసినన్ని రంగులబొమ్మలు మరొకరికి వేయలేదు..
వంశీ కథ షడ్రషోపేత విందు భోజనం!
ఆరగించాల్సిందేకానీ..
ముందుగా రుచి అడక్కూడదు.!!
వంశీ కథ గోదారి (Godhavari) పై వీచే చల్లని గాలి
అనుభవించాల్సిందే కానీ….
ఆరా తీయకూడదు.!!
వంశీ కథ మురళీ గానరవం
వినాల్సిందే కానీ..
చెవులు మూసుకో కూడదు!
చివరాఖరుకు చెప్పొచ్చేదేమంటే…
వంశీ కథ చదవడం ఓ ప్రివిలేజ్!!!!
వంశీ కథ ‘తలుచుకుంటేనే
తన్మయత్వం’
వంశీ గారు అప్పుడే మీకు అరవయ్యేళ్ళేమిటండీ…..మీరు ఇంకా కుర్రాడే…మీ కథలు చదివినవారికి,చదువుతున్న వారికి మీరంటే ఏమిటో తెలిసిన వారికి మీరెప్పుడూ నవ వసంతులే..!!
పుట్టినరోజు సందర్భంగా… హృదయపూర్వక శుభాకాంక్షలు !!
ఆయ్….మరింక
వుంటానండీ…!!
( దర్శకుడు వంశీ పుట్టిన రోజు సందర్భంగా వాట్సాప్ లో వచ్చిన వ్యాసం ఆధారంగా)