జీవీ హర్షకుమార్.. పరిచయం అక్కరలేని పేరు. రాష్ట్ర విభజనతో ఈయన పొలిటికల్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడంతో ఆ పార్టీకి ఏపీలో ఓట్లు లేకుండా పోయాయి. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ నుంచి విడిపోయి ప్రత్యేక పార్టీ పెట్టుకున్న జగన్ పట్టుకుపోయారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లన్నీ హస్తం గుర్తు ఖాతాలో ఉండాల్సినవి.. ఫ్యాన్ కు బదిలీ అయిపోయాయి. దీంతో కాంగ్రెస్ అనేది ఏపీలో తుడుచుపెట్టుకుపోయింది. ఇందులో భాగంగా హర్షకుమార్ కూడా రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. తన సన్నిహితుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీలోకి వెళ్లి పోటీ చేసినా ఆయనకు రాజకీయంగా కలసి రాలేదు.
రెండు సార్లు ఎంపీగా…
అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా జీవీ హర్షకుమార్ రెండుసార్లు విజయం సాధించారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో ఆయనకు ఇక తిరుగులేదని అంతా భావించారు. కానీ కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేయడంతో ఈయన గ్రాఫ్ కూడా పడిపోయింది. దళితనేతగా ఆయన అందరికీ సుపరిచితుడే. ప్రతి అంశంపై ఆయన స్పందిస్తారు. ఉద్యమిస్తారు. దళితుల పక్షాన నిలుస్తారు. రాజకీయంగా ఇప్పటికీ ఆయన అందరికీ అందుబాటులో ఉంటూ తనకు తోచిన సాయం చేస్తుంటారు.
కాలం కలసి రాక….
అయినా ఆయనకు కాలం కలసి రావడం లేదు. ఆ మధ్య టీడీపీలోకి వెళ్లినా టిక్కెట్ కూడా దక్కలేదు. చివరకు ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికే చేరిపోయారు. పొలిటికల్ ఫైటర్ గా ఆయనకు పేరుంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంపీగా ఉండి ఆయనను విభేదించారు. తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టుకున్నారు. పదేళ్లు గడిచిపోయినా గెలుపు ఆయన ఇంటి తలుపు తట్టలేదు. ఈసారి అమలాపురం పార్లమెంటు నుంచి పోటీ చేస్తారా? లేదా? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అన్న చర్చ జరుగుతుంది.
దళిత నేతగా…
దళిత సింహగర్జన పేరుతో ఒక సామాజికవర్గాన్ని దరిచేర్చే ప్రయత్నం కూడా హర్షకుమార్ చేశారు. కానీ కాంగ్రెస్ ఇప్పటికీ రాష్ట్రంలో కోలుకోలేదు. టీడీపీలో ఖాళీ లేదు. జనసేనకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని కొందరు.. లేదు…పార్టీ మారకుండానే అమలాపురం శాసనసభ నుంచి పోటీ చేస్తారని మరికొందరు చెబుతుండటం తప్ప ఆయన నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. అయితే ఈసారి చట్టసభల్లో అడుగుపెట్టాలన్న జీవీ హర్షకుమార్ కోరిక తీరుతుందా? లేదా? అన్నది కాలమే చెప్పాల్సి ఉంది.