Haryana
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుల్లో కొంతమంది నరరూప రాక్షసులుగా మారుతున్న సంఘటనలు నిత్యం ఏదో ఒక మూల వెలుగుచూస్తూనే ఉంటున్నాయి. పిల్లలకు తల్లితండ్రుల స్థానంలో ఉండాల్సిన ఉపాధ్యాయులు కొందరు కీచకులుగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఒక ఘోరం హర్యానాలో వెలుగులోకి వచ్చింది. ఒక ప్రిన్సిపల్ తమపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారంటూ ఒకళ్లు, ఇద్దరూ కాదు ఏకంగా 142మంది విద్యార్థినులు ఆరోపించారు. గత 6 ఏళ్లగా వారిపై ఆ ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు దిగినట్లు ఫిర్యాదులు అందాయి.
రాష్ట్రపతికి, ప్రధానికి, సీజేఐ కి లేఖ…….
హరియాణాలోని జింద్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలో దాదాపు 390 విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 15 మంది విద్యార్థినులు తమపై ప్రిన్సిపాల్ అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ గత ఆగస్టు 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, మహిళా కమిషన్ లకు లేఖ రాశారు.
ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం….. Haryana
దీంతో ఈ లేఖను హరియాణా మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగా వెంటనే చర్యలు తీసుకోవాలని సెప్టెంబరు 13న జింద్ పోలీసులకు సూచించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.. దీంతో నవంబర్ 4న సదరు స్కూల్ ప్రిన్సిపల్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నవంబర్ 7న కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో తాజాగా ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడానికి మొదట 60 మంది విద్యార్థినులు ముందుకొచ్చారు.. మామూలుగా అయితే ఉపాధ్యాయుడిపై చెప్పేందుకు ధైర్యం చాలక చాలామంది మాట్లాడరు. కానీ 60 మంది చెప్పేసరికి అధికారులు కూడా విషయం ఏదో ఉందని గ్రహించారు. మరింత మందికి ధైర్యం కల్పించడంతో వారు అసలు విషయం చెప్పుకొచ్చారు.
మొత్తం 390 మంది బాలికలను విచారణ చేయగా అందులో 142 మంది బాలికలు తమపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పినట్లు ఆ కమిటీ ప్రతినిధి జింద్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ ఇమ్రాన్ రజా వెల్లడించారు. ఈ 142 మంది బాలికల్లో ఎక్కువ మంది ప్రిన్సిపాల్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారని.. మిగితా వారు తమ ముందే ప్రిన్సిపాల్ ఇలాంటి లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డారని కమిటీకి నివేదించారు. ఈ కేసులో 15 మంది బాలికల ఫిర్యాదుతో హర్యానా మహిళా కమిషన్ మొదట సెప్టెంబర్ 13 వ తేదీన విచారణ చేపట్టింది. ఆ తర్వాత నిందితుడైన ప్రిన్సిపాల్ను అరెస్ట్ చేసిన జైలుకు తరలించారు.
దీంతో ప్రిన్సిపల్ పై త్వరలో ఛార్జ్ షీట్ తెరవనున్నట్లు పోలీసులు తెలిపారు.అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందంను నవంబర్ 16న ఏర్పాటు చేశామని, విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.దీనికి సంబంధించి 10 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఏడిజీపీ సిట్ ను ఆదేశించారు.ఈ వ్యవహారం రాష్ట్రవ్యాపంగా సంచలనంగా మారింది. ఉపాధ్యాయుడి నిర్వాకం విని తల్లి దండ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు.వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.