తెలంగాణాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి వసతి, ఆహార సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
కడెం ప్రాజెక్టు…
ఇక నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. ప్రాజెక్టు పై నుంచి నీరు పారుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు చెందిన నాలుగు గేట్లను మాత్రమే ఎత్తారు. మరో నాలుగు గేట్లు ఎత్తాలనుకున్నా మొరాయించాయి. దీంతో వరద నీరు గ్రామాల్లోకి ప్రవేశించింది. కొందరు ఇళ్లపై చేరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమను కాపాడాలంటూ ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు.
సహాయక బృందాలు…
అధికారులు, మంత్రులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా ప్రజలను రక్షించాలనుకున్నా వాతావరణం సహకరించడం లేదు. దీంతో బోట్లను తెచ్చి మునిగి పోతున్న గ్రామాల నుంచి ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో మోరంచ వాగులో దాదాపు పది లోడు లారీలు మునిగిపోయాయి. డ్రైవర్లు లారీ పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. కొందరు సమీపంలోని చెట్లు ఎక్కి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో సహాయక బృందాలను రెడీగా ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా కొందరిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలోని పలు ప్రాంతాలలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది.