New Delhi: భారతీయ రైల్వే నెట్వర్క్ విస్తరణకు ఊతమిస్తూ మొత్తం 2,339 కి.మీ మేర ఏడు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదం తెలిపింది. దాదాపుగా రూ. 32,500 కోట్లు విలువైన ఈ ప్రాజెక్టులను దేశంలోని 9 రాష్ట్రాల్లోని 35 జిల్లాలలో రైల్వే శాఖ చేపట్టనుంది.
ఈ సందర్బంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ, ప్రతిపాదిత మల్టీ ట్రాకింగ్ పనులు పూర్తయితే దేశవ్యాప్తంగా దాదాపుగా 200 మిలియన్ టన్నుల మేర కార్గో రవాణా (CARGO Transport) సామర్ధ్యం పెరగడంతో పాటుగా కీలకమైన రూట్ లలో మరిన్ని పాసెంజర్ రైళ్లను నడపడానికి వీలు అవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశంలోనే అత్యంత రద్దీ అయిన రైల్వే రూట్లలో రైళ్ల వేగం పెరగటం తో పాటుగా వివిధ రూట్లలో కీలకమైన మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చెందుతాయని రైల్వే మంత్రి తెలిపారు.
ఈ మెగా ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో దాదాపుగా 7.06 కోట్ల పనిదినాల ప్రత్యక్ష ఉపాధిని కల్పించనుందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాలకు భారీగా నిధులు
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఈ మెగా ప్రాజెక్టులో తెలుగు రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించారు. విజయనగరం నుండి ఒరిస్సా రాష్ట్రంలోని ఖుర్దా రోడ్ (Khurda Road Junction) మరియు నెర్గున్డి నుండి బారంగ్ (Nergundi – Baarang) వరకు దాదాపుగా 417.6 కిలో మీటర్ల మేర ఉన్న రెండు రైల్వే లైన్లకు అదనంగా మూడవ రైల్వే లైన్ నిర్మాణం చేయనున్నారు. ఈ మూడవ లైన్ కోసం దాదాపుగా రూ.5,618 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.
అలాగే 272.69 కి.మీ మేర దాదాపుగా రూ.3,238 కోట్ల రూపాయల వ్యయంతో ఆంధ్రలోని గుంటూరు నుండి తెలంగాణ లోని బీబీ నగర్ (Guntur – Bibi Nagar) వరకు రెండవ లైన్(డబ్లింగ్) పనులు చేపట్టనున్నారు. వీటితో పాటుగా దాదాపుగా రూ.5,655 కోట్ల అంచనా వ్యయంతో మేడ్చల్ – ముద్ఖేడ్ (Medchal – Mudkhed) మరియు మహబూబ్ నగర్ – ధోన్ జంక్షన్ (Mahabub Nagar – Dhone) మధ్య మొత్తంగా 502.34 కి.మీ మేర ట్రాక్ డబ్లింగ్ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కలిసిన కేంద్ర కాబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది.