హైదరాబాద్: సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి ఆదివారం లష్కర్ బోనాల సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్దఎత్తున బోనం ఎత్తుకుని ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రద్దీని నియంత్రించేందుకు ఆలయ అధికారులు రెండు క్యూలు ఏర్పాటు చేశారు. బోనాలు జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలిచే శివసత్తులు, పోతరాజులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆలయానికి రావడం ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. పలువురు వీఐపీలు ఆ రోజు తర్వాత ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంది.
ట్రాఫిక్ మళ్లీంపు…
నేటి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరగనున్నాయి. కాగా.. జాతర సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తులతో ఆలయ సమీపంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాలను దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణం చేసేవారు త్వరగా ఇంట్లో నుంచి బయలుదేరాలని సూచించారు. అదేవిధంగా ప్లాట్ ఫామ్ నంబర్.1 నుంచి వెళ్లే వారు రద్దీ ఎక్కువ ఉండడంతో చిలకలగూడ వైపు నుంచి వచ్చి ప్లాట్ ఫామ్ నంబర్.10ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఏయే రూట్లలో అంటే..
కర్బాల మైదాన్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులను రాణిగంజ్ ఎక్స్ రోడ్డులో మినిస్టర్ రోడ్డు వైపు దారి మళ్లిస్తారు. రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ క్రాస్రోడ్స్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్ క్రాస్ రోడ్, కవాడిగూడ, మ్యారెట్ హోటల్ ట్యాంక్బండ్ రూట్లో వెళ్లాలి.
తాడ్బన్ వైపు వెళ్లే బస్సులు క్లాక్టవర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్డు, వైఎంసీఏ, ఎస్బీహెచ్ ఎక్స్ రోడ్స్ మీదుగా వెళ్లాలి.
ఘాస్మండి క్రాస్ రోడ్స్: బైబుల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, తిరుమలగిరి వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్ ఘాస్మండి ఎక్స్ రోడ్స్ నుంచి సజ్జనాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హిల్ స్ట్రీట్, రాణిగంజ్ వైపు వెళ్లాలి.
ప్యాట్నీ ఎక్స్ రోడ్స్ : ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్స్లో ప్యారడైజ్, మినిస్టర్ రోడ్డు లేదా క్లాక్ టవర్, సంగీత్ క్రాస్రోడ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ, ముషీరాబాద్, కవాడిగూడ, మ్యారెట్ హోటల్, ట్యాంక్బండ్ వైపు వెళ్లాలి.
ప్యారడైజ్ ఎక్స్ రోడ్స్: సీటీఓ జంక్షన్ నుంచి ఎంజీ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ ఎక్స్ రోడ్డులో సింధికాలనీ, మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్, కర్బాల మైదాన్ మళ్లిస్తారు, ప్యాట్నీ క్రాస్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్ను ప్యారడైజ్ ఎక్స్ రోడ్స్ వద్ద సీటీఓ జంక్షన్ వైపు మళ్లిస్తారు. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్, ఐమ్యాక్స్ రోటరీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్బండ్, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, గాంధీ హాస్పిటల్, చిలకలగూడ క్రాస్ రోడ్డు, ప్లాట్ ఫామ్ నంబర్ 10కు రాకపోకలు సాగించాలి.
ఉప్పల్ నుంచి పంజాగుట్ట వైపు రాకపోకలు సాగించే వారు ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట్, హిమాయత్నగర్, ఖైరతాబాద్ జంక్షన్, పంజాగుట్ట రూట్లను ఉపయోగించాలి. అయితే ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ రూట్లల్లో భారీగా ట్రాఫిక్ ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సెయింట్ మేరీ రూట్ మార్గాలను మూసేస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హకీంపేట, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్పేట వెళ్లే వాహనాలు క్లాక్ టవర్ నుంచి వయా ప్యాట్నీ, ఎస్బీహెచ్ వైపు నుంచి వెళ్లాలి.