TS
బలం లేని చోట ఏం చేస్తాం. పొత్తులతో కలసి మరింత బలపడాలని ప్రయత్నిస్తాం. అధికారంలోకి రావాలని భావించే వారెవరైనా పొత్తులు కుదుర్చుకుని సీట్లను త్యాగం చేసి మరీ తన వాళ్లను దూరం పెట్టైనా సరే అధికారంలోకి రావాలనుకుంటారు. కానీ తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ మాత్రం ఒంటరి పోరుకే సిద్ధమయింది. ఎవరితో పొత్తుకు బీజేపీ సిద్ధపడటం లేదు. అలాగని రాష్ట్రంలో బలంగా ఉందా? అంటే.. అదీ చెప్పలేం. ఎక్కడో కొన్ని నియోజకవర్గాలు తప్పించి 119 నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేరన్నది వాస్తవం. తిప్పి కొడితే ముఖ్యమైన నేతలు రాష్ట్రంలో ముప్ఫయి మందికి మించి లేరు. మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటన్నది ఇప్పటి వరకూ సీనియర్ నేతలకు కూడా అర్థం కావడం లేదు.
చేరికలేవీ?
భారతీయ జనతా పార్టీకి నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో ఒక ఊపు ఉండేది. అయితే క్రమంగా అది కాంగ్రెస్ వైపు మరలింది. దీంతో బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన అమిత్ షా సభలోనైనా పెద్దయెత్తున చేరికలుంటాయని అందరూ భావించారు. ఈ మేరకు భారీగా ప్రచారం కూడా జరిగింది. అయితే స్థాయి కలిగిన నేతలెవ్వరూ బీజపేీ వైపు చూడటం లేదు. ప్రత్యేకంగా చేరికల కమిటీని పెట్టినా, అనేక మంది నేతలను పార్టీలోకి ఆహ్వానించినా కమలం కండువా కప్పుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక మూడు నెలలు మాత్రమే సమయం ఉన్నప్పటికీ ఆ పార్టీలో చేరేందుకు ఇష్టపడటం లేదు. ఉన్న నేతలు పోకపోతే బెటర్ అన్న ధోరణి పార్టీలో కనిపిస్తుంది. ఉన్న నేతలను కాపాడుకోవడానికి పదవులిచ్చి మరీ పార్టీని వీడకుండా జాగ్రత్త పడాల్సి వస్తుందని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతుంది.
అందుకే దూరం… TS
తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటారని అందరూ భావించారు. ఆపార్టీ అధినేత చంద్రబాబు కూడా పొత్తుకు రెడీగా ఉన్నారు. కానీ పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని భావించి ఆ ఊసే ఎత్తడానికి నేతలు భయపడిపోతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని నష్టపోయిన విషయాన్నిగుర్తు చేసుకుని టీడీపీని దూరం పెట్టారు. ఇక జనసేన ఏపీలో పొత్తులోనే ఉంది. అయినా తెలంగాణలో మాత్రం పొత్తు పెట్టుకునేందుకు పార్టీ నేతలు ఇష్టపడటం లేదు. పవన్ కల్యాణ్ కు తెలంగాణలోనూ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆయన సామాజికవర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినా సరే జనసేనతో తెలంగాణలో పొత్తుకు కమలం పార్టీ సిద్ధపడకపోవడం దేనికి సంకేతమన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.
బలోపేతం కావాలంటే…
ఒంటరిగా పోటీ చేస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం చాలా కష్టం. ఆ సంగతి నేతలందరికీ తెలుసు. అయినా పొత్తులకు మాత్రం సిద్ధపడకుండా ఒంటరిగానే బరిలోకి దిగి తమ బలం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. ఏపీలో ఇలా పొత్తులు పెట్టుకుని ఇంత వరకూ కమలం పార్టీ అక్కడ కోలుకోలేదు. అందుకే ఇక్కడ పొత్తులతో నిమిత్తం లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగి గత ఎన్నికలంటే మెరుగైన స్థానాలను సంపాదించేందుకే ప్రయత్నమని అనేవారు కూడా లేకపోలేదు. గత శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ ఈసారి అంతకు మించి స్థానాలను గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నదన్నది మాత్రం వాస్తవం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు చూపడంతో ఒంటరిపోరు బెటరని భావించి పొత్తులతో నిమిత్తం లేకుండా ఎన్నికలకు వెళుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. TS