IND vs ENG
వన్డే ప్రపంచకప్లో భాగంగా ఈ రోజు ఇండియా ఇంగ్లండ్తో తలపడనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే భారత జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. అయితే ఈ కీలక మ్యాచ్కు ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలేలా ఉంది. శనివారం ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ మణికట్టుకు గాయమైనట్లు సమాచారం. వేగంగా దూసుకువచ్చిన బంతి రోహిత్ కుడిచేతి మణికట్టును బలంగా తాకగా, హిట్ మ్యాన్ బాధతో విలవిల్లాడి పోయాడట. దీంతో టీమ్ ఇండియా ఫిజియో వెంటనే అక్కడకు చేరుకుని చికిత్స చేసినట్లు తెలిసింది. అయితే రోహిత్ గాయం విషయంపై అటు బీసీసీఐ కానీ, ఇటు టీమిండియా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ప్రపంచకప్లో సూపర్ ఫామ్లో ఉన్న హిట్ మ్యాన్ దూరమైతే టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పుకోవచ్చు.
కెప్టెన్ గా రోహీత్ కు వందో మ్యాచ్…… IND vs ENG
మరోవైపు ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు హిట్మ్యాన్ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ వాటిని బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్గా వంద మ్యాచ్లు పూర్తి చేసుకోనున్నాడు రోహిత్. ఈ నేపథ్యంలో వందో మ్యాచ్లో గెలిచి దీనిని తీపి జ్ఞాపకంగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు బ్యాటర్గానూ రోహిత్ ముందు అనేక రికార్డులు ఊరిస్తున్నాయి.
ఈ టోర్నీలో ఫుల్లు ఫామ్లో ప్రత్యర్థి బౌలర్లకు రోహిత్ చెమటలు పట్టిస్తున్నాడు. ఫుల్ ఫామ్ లో మనోడి పవర్ హిట్టింగ్కు అవతల బౌలర్లు బిత్తరచూపులు చూస్తున్నారు. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 62 సగటుతో 311 పరుగులు సాధించాడు. స్ట్రెయిక్ రేట్ 133.48గా ఉందంటే హిట్ మ్యాన్ దూకుడు ఏ రేంజులో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
పాండ్యా అందుబాటులోకి వస్తాడా రాడా…..
గాయంతో దూరమైన హార్దిక్ పాండ్యా లీగ్ మ్యాచ్లలో అందుబాటులోకి వస్తాడా రాడా అనే విషయంపై స్పష్టత లేదు. ఐదుగురు బౌలర్లతో ఆడే సమయంలో రిస్కు తీసుకోవడం ఎందుకనే ఉద్ధేశంతో ముందు జాగ్రత్తగా విరాట్, గిల్, సూర్యలతో బౌలింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. మ్యాచ్లో ఒకవేళ ఏ బౌలరైనా భారీగా పరుగులు సమర్పించుకుంటే వీరి ముగ్గురితో లేదా వీరిలో ఒకరితో ఆ బౌలర్ కోటాను పూర్తి చేయించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
బ్యాటింగ్ పరిస్థితి ఎమిటి మరి……..
అయితే ఈ మ్యాచ్తో పాటు నవంబర్ రెండో తేదీన శ్రీలంకతో జరిగే మ్యాచ్కు సైతం ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవటం టీమిండియాకు కాస్త ప్రతికూలంగా మారింది. పాండ్యా దూరం కావటంతో జట్టులో బ్యాలెన్స్ తేవడం ఇబ్బందిగా మారింది. పాండ్యా స్థానంలో జట్టుతో చేరిన షమీ బౌలింగ్లో మెరుపులు మెరిపించినా బ్యాటింగ్ మరియు ఆరో బౌలర్ కోటాను పూర్తిచేసే పాండ్యా దూరమవ్వటం టీమ్ మేనేజ్మెంట్కు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో మ్యాచ్లో హార్దిక్ స్థానాన్నిముగ్గురు ప్లేయర్లతో భర్తీచేసేలా టీమిండియా త్రిశూల వ్యూహాన్ని రెడీ చేస్తోంది.
సెమీస్ ఆశలు వదులుకున్నాం…. IND vs ENG
పరువు కోసమే ఆడాలి అంటూ ఇంగ్లండ్ కోచ్ మాథ్యూ మాట్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. శ్రీలంక చేతుల్లో ఓటమి తర్వాత మాట్ ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. వరల్డ్ కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ లలో నాలుగు ఓడింది. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, సౌతాఫ్రికా, శ్రీలంక చేతుల్లో ఓడిన ఆ టీమ్ సెమీఫైనల్ చేరడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇంగ్లండ్ కోచ్ మాథ్యూ మాట్ కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ఇదే విషయాన్ని చెప్పాడు. మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధిస్తేనే ఇంగ్లడ్ జట్టు సెమీస్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, అదంత తేలికేం కాదు. ఎందుకంటే ఆ నాలుగు మ్యాచ్ల్లో భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్ జట్లతో ఇంగ్లాండ్ తలపడాల్సి ఉంది.
మాజీ క్రికెటర్స్ మైకెల్ వాన్, కాలింగ్ వుడ్…….
వరల్డ్ కప్ చరిత్రలో మా జట్టుకు ఇదే చెత్త ప్రదర్శన అంటూ ఇంగ్లాండ్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ విమర్శలు గుప్పించాడు. అయితే, ఒక్క 2019లో మినహా వరల్డ్ కప్ టోర్నీల్లో ఇంగ్లాండ్ ఆటతీరు ఎప్పుడూ ఇలాగే దారుణంగా ఉందంటూ మైకెల్ వాన్ ట్వీట్ చేశాడు. మ్యాచ్ చూడటానికే కష్టంగా ఉంది మరీ దూకుడుగా ఆడటం ద్వారా శ్రీలంకను ఒత్తిడిలోకి నెట్టాలని భావించారు. కానీ, అది కుదర్లేదు. వారు ప్రయత్నించింది వర్కౌట్ కాలేదు. బ్యాటర్లు కొట్టిన షాట్లు ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లాయి. శ్రీలంక అద్భుతంగా ఆడింది. ఇంగ్లాండ్ను ఒత్తిడిలోకి నెట్టి ఉక్కిరి బిక్కిరి చేసింది’ అని కాలింగ్ వుడ్ అభిప్రాయపడ్డాడు.IND vs ENG