భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. ఈరోజు సాయంత్రం గచ్చిబౌలిలో జరగనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. హకీంపేట విమానాశ్రయంలో దిగిన రాష్ట్రపతి నేరుగా బొల్లారం లోని రాష్ట్రపతి విడిది కేంద్రానికి వెళ్లారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రాష్ట్రపతి అక్కడి నుంచి హెలికాప్టర్ లో గచ్చిబౌలి స్టేడియానికి చేరుకోనున్నారు.
పోలీసు ఆంక్షలు…
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలికి వచ్చే ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. నగర ప్రజలు తమ ప్రయాణానికి అనువుగా ప్లాన్ చేసుకోవాలని పోలీసులు కోరారు.