ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఈసారైనా బోణీ కొడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమ్యునిస్టులతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పోటీ పడుతుంది. గత పదేళ్ల నుంచి శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఒకరు.. అరా.. తప్పించి ఎవరూ కనీస ఓట్లను కూడా సాధించలేకపోయారు. అంటే ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈవీఎంలో హస్తం గుర్తును ఏపీ జనం మర్చిపోయినట్లే కనిపిస్తుంది. నేతలున్నారు. కానీ ఓటేసుందుకు జనమే లేరు. కాంగ్రెస్ ను ఆంధ్రప్రదేశ్ లో జనం పూర్తిగా మర్చిపోయారనే చెప్పాలి. పీసీసీ చీఫ్ లను మార్చినా ప్రయోజనం లేదు.
అధికారంలో ఉన్నప్పుడు…
కాంగ్రెస్ ఒక్కప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉంది. ఎంతో మంది నేతలు పదవులు అనుభవించారు. కేంద్రంలోనూ, రాష్ట్ర్రంలోనూ కేబినెట్ మంత్రులుగా చెలాయించారు. కానీ 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 2014 నుంచి ఇప్పటి వరకూ ముగ్గురు పీసీసీ చీఫ్ లు మారారు. అయినా పార్టీ రాత మాత్రం మారలేదు. తొలినాళ్లలో పీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డి ఉన్నారు. ఈయన బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. 2014లో దారుణ ఓటమితో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాత ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సాకే శైలజానాధ్ ను పీసీసీ చీఫ్ గా నియమించారు. 2019 ఎన్నికల్లోనూ ఏమాత్రం మార్పు లేదు.
పదేళ్ల నుంచి…
పదేళ్లుగా కాంగ్రెస్ నుంచి ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. సాకే శైలజానాధ్ ను తప్పించి గిడుగు రుద్రరాజును నియమించారు. 2024 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు కూడా ఏమాత్రం ఫలించేలా కన్పించడం లేదు. ఓటు బ్యాంకు అంతా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్ పట్టుకుపోవడంతో పార్టీ వైపు చూసే వారే కరువయ్యారు. రాష్ట్రాన్ని విడదీశారన్న ఆగ్రహం ఏపీ ప్రజల్లో ఇంకా చల్లారలేదని స్పష్టమవుతుంది. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ నేతలు పదే పదే చెబుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. నేతలు లేరని కాదు. మాజీ కేంద్రమంత్రులు, మాజీ రాష్ట్ర్రమంత్రులు అనేక మంది ఉన్నారు. కానీ ఎవరికి వారే స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తుంది.
పొత్తు పెట్టుకోవడానికి కూడా..
ఇక కాంగ్రెస్ తో కలిసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. కాంగ్రెస్ తో కలసి నడిస్తే అసలుకే ఎసరు వస్తుందని కావచ్చు. ఆ దిశగా ప్రయత్నాలే చేయడం లేదు. చివరకు కమ్యునిస్టులు సయితం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా, ఏపీలో మాత్రం కలవడానికి సుముఖంగా లేరంటే ఆ పార్టీ పరిస్థితి చెప్పకనే తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి 175 నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు కూడా దొరకడం కాంగ్రెస్ కు కష్టమేనని చెప్పాలి. నాయకత్వం మారినా, రాహుల్ ఏపీలో భారత్ జోడో యాత్ర చేసినా దేశమంతా పుంజుకున్నా ఏపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదన్నది కాదనలేని వాస్తవం. అందుకే నేతలు కూడా పెద్దగా ప్రయాసపడటం లేదు. జాతీయ పార్టీగా పోటీ చేయాలి కాబట్టి కొందరు వచ్చేఎన్నికలలో పోటీ చేస్తారు. అంతే తప్ప ఈసారి కూడా కాంగ్రెస్ కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం దొరుకుతుందని చెప్పలేని పరిస్థితి.