ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో గ్రూపు గొడవలు ప్రారంభమయ్యాయి. బండి సంజయ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు బహిరంగ విమర్శలకు దిగుతున్నాయి. ఎన్నికల వేళ జరుగుతున్న ఈ పరిణామాలు పార్టీకి నష్టం కలిగించేవేనంటూ పార్టీ సానుభూతిపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఐక్యతగా వెళ్లి ఎన్నికలు సమీపించే సమయానికి ఈ రచ్చ ఏంటంటూ కొందరు నేతలు చికాకు పడుతున్నారు.
జితేందర్ రెడ్డి ట్వీట్పై….
మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి ట్వీట్పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎవరి గౌరవానికి భంగం కలిగే విధంగా ఎవరూ వ్యవహరించకూడదని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజా జీవితంలో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. ఏది పడితే అది మాట్లాడకూడదు అని అన్నారు. ఎవరినీ బాధపెట్టే విధంగా ఏ నేతా వ్యవహరించడం సరికాదని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.
కేంద్ర నాయకత్వానికి…
తెలంగాణ బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారి గురించి పరోక్షంగా జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇది పార్టీలో చర్చనీయాంశమైంది. జితేందర్ రెడ్డి పోస్టు చేసిన ట్వీట్లో దున్నపోతును కాలితో తన్నే వీడియోను షేర్ చేశారు. కొందరు బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని జితేందర్ రెడ్డి ఈ ట్వీట్ చేయడంతో బీజేపీలోని ముఖ్య నేతలు ఆయన ట్వీట్ను తప్పు పడుతున్నారు. ఆ ట్వీట్ విషయం ఇప్పటికే కొందరునేతలు పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలియజేశారు. జితేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. బీజేపీలో నేతల మధ్య పెరుగుతున్న విభేదాలను తొలగించేందుకు అధినాయకత్వం రంగంలోకి దిగినట్లు తెలిసింది. మరి ఈ విభేదాలు ఎంత వరకూ వెళతాయన్నది వేచి చూడాలి.
Follow Us On : YouTube , Google News