ISRO
చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ తమకు అప్పగించిన పనులను చేసుకుంటూ పోతున్నాయి.. చంద్రుడిపై బుడి బుడి అడుగులు వేస్తున్న ప్రగ్యాన్ రోవర్ తన టాస్క్ ను పకడ్బందీగా నిర్వహిస్తోంది. మొన్నటివరకూ విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలం ఫోటోలను తీయగా, తొలిసారిగా ప్రగ్యాన్ రోవర్ ల్యాండర్ ను ఫోకస్ చేసి ఓ ఫోటోను క్లిక్ మనిపించింది. చంద్రునిపై చేరాక రోవర్ తీసిన తొలి ఫొటో ఇదే.. రోవర్ తీసిన ఈ ఇమేజ్ ను ఇస్రో తన వెబ్ సైట్ లో షేర్ చేసింది.
రోవర్ లో ఉన్న నేవిగేషన్ కెమెరాలను బెంగళూరులోని ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ లేబరేటరీ తయారు చేసింది.చంద్రుని ఉపరితలంపై రోబో అల్యూమినియం, క్యాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మ్యాంగనీస్, సిలికాన్, ఖనిజాలతోపాటు ప్రాణవాయువు కూడా ఉందని కనుగొంది. ఈఅన్వేషణల తర్వాత రోవర్ తీసిన ఈఫొటోయే మొదటిది. చంద్రుని దక్షిణధ్రువంపై ఉపరితలం వ్యాసార్ధం, లోతు ప్రాధమిక సమాచారాన్ని లేజర్ ఆధారిత స్పెక్ట్రోస్కోపి పరికరం గుర్తించింది. ఆర్బిటార్ పై ఉన్న పరికరాలేవీ గుర్తించని సల్ఫర్ నిక్షేపాలను ఈ స్పెక్ట్రో స్కోపీ పరికరం గుర్తించగలిగింది.
అంతరిక్ష రంగంలో మేలి మలుపు
130 కోట్ల మంది ఆకాంక్షలను నిజం చేస్తూ చంద్రయాన్ -3 చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది.
ఆ తర్వాత నాలుగు గంటల తర్వాత బయటకు వచ్చిన రోవర్ చంద్రునిపై నెమ్మదిగా కాలు మోపింది.అప్పటినుంచి దానికి అప్పగించిన పనులను చేస్తూ మధ్యమధ్యలో రెస్ట్ తీసుకుంటోంది. బుధవారం ఉదయం రోవర్ కు అమర్చిన నేవిగేషన్ కెమెరా తొలిసారిగా విక్రమ్ ల్యాండర్ ను ఫోటోతీసి పంపింది. చంద్రుని ఉపరితలం అంటేనే భారీగా గుంతలు, గుట్టలు ఉండే ప్రాంతం. రోవర్ ప్రగ్యాన్ చంద్రమండలంపై సంచరిస్తు న్నప్పుడు నిన్న భారీ గుంత ఎదురుపడింది. అప్రమత్తమై రోవర్ దిశను మార్చడంతో మరోవైపు అడుగులేసి ఆ గుంతలో పడకుండా తప్పించుకుంది. అదే గుంతలో రోవర్ పడి ఉంటే మాత్రం చంద్రయాన్ ప్రాజెక్ట్ అంతా వ్రుథా అయ్యేది. చంద్రుడిపై ఉన్న ఖనిజాలను, కొండలు, గుట్టలు, మట్టి ప్రాంతాలను రోవర్ అన్వేషించి ఆ వివరాలను ల్యాండర్ కు పంపితే ల్యాండర్ భూమిపై ఉన్న ఇస్రో అంతరిక్ష కేంద్రానికి అందిస్తోంది. ఇప్పటికే చంద్రుడు చల్లగా ఉంటాడన్న భావన తప్పని రోవర్ తన పరి శోధనల్లో తేల్చింది. చంద్రునిపై 50 నుంచి 70 డిగ్రీల ఉష్ణోగ్ర తలు నమోదయినట్లు రోవర్ కు అమర్చిన థెర్మల్ పేలోడ్స్ రికార్డు చేశాయి.
14 రోజుల తర్వాత జరిగేదేంటి? ISRO
చంద్రునిపై సేఫ్ గా ల్యాండ్ అవడం, రోవర్ చంద్రమండలంపై సంచరించడం, అక్కడి రసాయనిక, నిక్షేపాలను పరీక్షించి వాటి నమూనాలను సేకరించడం, ఇతర భౌతిక లక్షణాలను కూడా రికార్డు చేసి సమాచారం సేకరించడమే లక్ష్యంగా రోవర్ పనిచేస్తోంది. ఇప్పటికే తనకు అప్పగించిన లక్ష్యాలను సగం వరకూ పూర్తి చేసింది. తనకున్న 14 రోజుల్లో రోవర్ సాధ్యమైనంత ఎక్కువ సమాచారం సేకరించగలిగితే మన పరిశోధనలకు ఒక విలువ ఉంటుంది. సాధారణంగా వీటి జీవిత కాలం 14 రోజులే అయినప్పటికీ వాటిని సోలార్ ఆధారిత పరికరాలుగా ఇస్రో రూపొందించడంతో 14రోజుల తర్వాత మళ్లీ సూర్యుని కాంతి వచ్చినప్పుడు ఛార్జ్ అయి పనిచేసే అవకాశం ఉంది. అయితే అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. చంద్రయాన్ ప్రాజెక్ట్ కనక సక్సెస్ అయితే అగ్రరాజ్యాల సరసన భారత్ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది. అంతరిక్ష రంగంలో భారత్ ఒక గేమ్ ఛేంజర్ గా నిలబడుతుంది.