తెలుగుదేశం పార్టీ (Tdp) అధినేత చంద్రబాబునాయుడుకు వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవకుంటే పార్టీ నిలదొక్కుకోవడమూ కష్టమే. వచ్చే ఎన్నికలకు చంద్రబాబు వయసు కూడా మరింత మీద పడుతుంది. దీంతో పాటు నేతలు కూడా చేజారి పోతారు. దీంతో పాటుగా ఆయన అసెంబ్లీ సాక్షిగా శపథం చేశారు. తాను మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని ఆయన చేసిన శపథం నెరవేరాలంటే ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావాల్సిందే. అందుకోసమే ఆయన అలుపెరగకుండా జనం బాట పడుతున్నారు. వివిధ కార్యక్రమాలతో ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచి ప్రజలను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రియల్ పొలిటీషియన్…
చంద్రబాబు రియల్ పొలిటీషియన్. ఆయన వ్యక్తిగత జీవితం కూడా రాజకీయం తర్వాతే. ఫుల్ టైం పొలిటీషియన్గా తొలి నుంచి ముద్రపడ్డారు. మిగిలిన పార్టీ అధినేతల్లా కాదు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన నిత్యం జనంలో ఉండటానికే ప్రయత్నిస్తారు. 2019లో దారుణ ఓటమి తర్వాత టీడీపీ నేతలంతా ఇంట్లో కూర్చుని ఉన్నారు. మిగిలిన పార్టీ అధినేతలు కూడా కొన్నేళ్లపాటు రాజకీయాలను పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు అలా కాదు. వెనువెంటనే సర్దుకుని పార్టీ నేతలను మోటివేట్ చేసేందుకు జిల్లాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన ఇక సెలవు తీసుకోలేదు. రెస్ట్ లేకుండా జిల్లాల్లో పర్యటనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కరోనా సమయంలో మినహా మిగిలిన సమయమంతా పార్టీ ఎదుగుదలకే ప్రయత్నించారు.
బాబు కష్టం వల్లనే… (Tdp)
అందువల్లనే ఈరోజు పార్టీ ఒక మోడ్లోకి వచ్చిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే ఆయనను తాను అసెంబ్లీలో చేసిన శపథం ఇబ్బంది పెడుతుంది. వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం అధికారంలోకి రాకపోయినా అసెంబ్లీకి హాజరయ్యే అవకాశముండదు. ఆయనంతట ఆయనే అసెంబ్లీ సాక్షిగా శపథం పూని బయటకు వచ్చేశారు. మరి ఆయన సీఎం కావాలంటే టీడీపీ నేతలు కూడా యాక్టివ్ కావాలి కదా? అనేక నియోజకవర్గాల్లో గ్రూపులుగా విడిపోయి టిక్కెట్ కోసం కొట్లాడుకుంటున్నారు. ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నియోజకవర్గాల వారీగా నేతలను కొంత సెట్ చేయాల్సిఉంటుంది. లేకుంటేఎన్నికల సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. చంద్రబాబు స్వయంగా నేతల మధ్య విభేదాలను పరిష్కరించి ఎన్నికల కదనరంగంలోకి దిగాల్సి ఉంటుంది.
ఏం వ్యూహాలు రచించి…
2004 నుంచి 2014 వరకూ తెలుగుదేశం పార్టీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో లేదు. నేతలు అనేకమంది పార్టీని వీడి వెళ్లిపోయారు. అయినా చంద్రబాబు పదేళ్ల పాటు శ్రమించి, పాదయాత్ర చేసి మరీ పార్టీని అధికారంలోకి తేగలిగారు. కానీ ఈసారి ఓడిపోతే మరో ఐదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఆయన ఉండలేరు. నేతలు ఉండబోరు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయనున్నారోనన్నది ఆసక్తికరంగా మారింది.
పొత్తులతో వెళ్లినా అధికార పార్టీని అన్ని రకాలుగా ఎదుర్కొని బయటపడాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుందని విశ్లేషకుల అంచనా. పార్టీని ఈసారి అధికారంలోకి తేగలిగితేనే ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు అవకాశముంటుంది. లేకుంటే మరో ఐదేళ్ల పాటు శాసనసభ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి రావచ్చు. అందుకే చంద్రబాబు నిరంతరం ప్రజల్లో ఉండి అధికార పార్టీని ఎండగడుతున్నారు. తన పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి. (Tdp)