ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విద్యకు, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తారు. తన హయాంలో ఈ రెండు విభాగాలు బాగుంటే ప్రజలు ఆరోగ్యపరంగా బాగుండటమే కాకుండా, ఉన్నత చదువులు చదువుకుని సొంత కాళ్ల మీద నిలబడతారన్న ధ్యేయంతో రెండింటికి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందంటారు. అందులో భాగంగా పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి కుటుంబ సభ్యులు జగన్ తమకు అందించిన సాయాన్ని ఆయనతోనే పంచుకున్నారు. జాహ్నవిని జగన్ ఈ సందర్భంగా అభినందించారు.
గతంలో యాభై లక్షలు…
జాహ్నవి నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారత విద్యార్థిగా పేరు తెచ్చుకుంది. గతంలో జాహ్నవి ఏవియేషన్ రంగంలో శిక్షణ పొందేందుకు జగన్ ప్రభుత్వం యాభై లక్షల సాయం అందించింది. అయితే ఆమె అమెరికాలోని ఫ్లోరిడాలోని కమర్షియల్ పైలట్ శిక్షణ నిమిత్తం వెళ్లాలనుకుంటుంది. కానీ జాహ్నవి తల్లిదండ్రులకు అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు రాజమండ్రి వచ్చిన జగన్ గెస్ట్హౌస్లో బస చేశారని తెలుసుకుని అక్కడకు వెళ్లారు.
అమెరికాలో శిక్షణ పొందేందుకు…
తమ మనసులో మాటను జగన్ ముందుంచారు. అమెరికాలో పైలట్ గా శిక్షణ పొందేందుకు ప్రభుత్వం నుంచి సాయం అందించాలని జాహ్నవి కుటుంబ సభ్యులు కోరారు. అందుకు ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారని జాహ్నవి కుటుంబ సభ్యులు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి నుంచి సానుకూల ప్రకటన వస్తుందని వారు విశ్వసిస్తున్నారు. జాహ్నవి కుటుంబ సభ్యులను సాదరంగా ఆహ్వానించిన జగన్ వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకోవడంతో వారిలో సాయం అందిస్తారన్న నమ్మకం ఏర్పడింది.