ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విచిత్రంగా మారాయి. సినిమాలే కాదు రాజకీయాలు కూడా వినోదాన్ని పంచి పెడుతున్నాయి. టిక్కెట్ లేకుండానే సినిమాలను పొలిటికల్ లీడర్స్ చూపిస్తున్నారు. సినిమాల నుంచి రాజకీయాలు.. రాజకీయాల నుంచి సినిమాల వైపు వేగంగా మరలుతున్నాయి. ప్రధానంగా జనసేన, వైసీపీల మధ్య సినిమా టైటిళ్ల యుద్ధం ప్రారంభమైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన “బ్రో” సినిమా విడుదల తర్వాత ఇది మరింత స్పీడ్ అందుకుంది. బ్రో సినిమాలో ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలినట్లు ఉన్న పాత్రను పెట్టి ఆయన చేసినట్లు డ్యాన్స్ చేయించడంతో వివాదం ప్రారంభమయింది. ఆ సినిమాలో ఆ పాత్ర పేరు శ్యాంబాబుగా పెట్టినా రాంబాబును ఉద్దేశించి మాత్రమేనని చూసేవారందరికీ తెలిసిందే. అయితే దీనిపై అంబటి రాంబాబు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
” బ్రో” సినిమాలో…
మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో మాటల యుద్ధం ఎప్పుడూ జరుగుతుండేదే. గత సంక్రాంతి పండగ సందర్భంగా అంబటి రాంబాబు తన నియోజకవర్గమైన సత్తెనపల్లిలో డ్యాన్స్ వేశారు. ఇది వైరల్ గా మారింది. సేమ్ సీన్ ను బ్రో సినిమాలో వాడారు. ఆ పాత్రకు థర్టీ ఇయర్స్ పృథ్వీ నటించారు. దీంతో అంబటి రాంబాబు సినీ నిర్మాత విశ్వప్రసాద్ పైన కూడా మండి పడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్యాకేజీని విశ్వప్రసాద్ చేత ఫారిన్ మనీ రూపంలో పవన్ కు అందించిందని, ఇందుకు తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. అంతటితో ఆగలేదు… తాము కూడా త్వరలో సినిమా తీస్తున్నామని, అందుకు టైటిళ్ల కోసం వెతుకుతున్నామని అంబటి తెలిపారు.
అంబటి టైటిళ్లు…
బ్రో సినిమాకు ప్రత్యామ్నాయంగా “మ్రో” (MRO) తీస్తున్నట్లు ప్రకటించారు. మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ అనే టైటిల్ పేరు మీద సినిమా తీయడానికి పరిశీలిస్తున్నట్లు అంబటి రాంబాబు తెలిపారు. “మూడు పెళ్లిళ్లు – ఆరు విడాకులు”, “తాళి – ఎగతాళి” వంటి టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లు అంబటి రాంబాబు తెలిపారు. మంచి టైటిల్ ఉంటే చెప్పాలంటూ మీడియాను కూడా అంబటి కోరారు. దీంతో పాటు బ్రో సినిమా పరంగా పెద్దయెత్తున మనీలాండరింగ్ జరిగిందని ఆరోపించిన మంత్రి అంబటి రాంబాబు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. బ్రో సినిమా నిర్మాత విశ్వప్రసాద్ బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కు కజిన్ బ్రదర్ అవుతారని, అందుకోసమే టీడీపీ ఇచ్చిన ప్యాకేజీని నిర్మాత ద్వారా పవన్ కు అందించారని అంబటి ఆరోపించారు.
సేన పేర్లు…
దీనికి ప్రతిగా జనసేన నేతలు కూడా అంబటి రాంబాబుపై సినిమా తీస్తున్నట్లు తిరుపతిలో పూజ కూడా చేశారు. పోస్టర్ ను కూడా విడుదల చేశారు. దీనికి “సందులో సంబరాల రాంబాబు” అని పేరు పెట్టినట్లు జనసేన నేతలు తెలిపారు. “ప్రొడక్షన్ నెంబరు 6093… జగ్గూభాయ్ సమర్పించు సందులో సంబరాల రాంబాబు” అంటూ పూజలు నిర్వహించారు. ఇక విజయవాడ జనసేన నేతలయితే “డాటర్ ఆఫ్ వివేకా”, “కోడికత్తి సమేత శ్రీను”, “డ్రైవర్ డోర్ డెలివరీ”, “అరగంట – అద్దె ఇల్లు”, “ఓ ఖైదీ వదిలిన బాణం” “A X E” అంటూ పోస్టర్లను విడుదల చేశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఇప్పుటు పోస్టర్లు, టైటిళ్లతో రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీ ప్రజలకు మాత్రం ఉచిత వినోదంగానే కనిపిస్తుంది. రాజకీయంగా విమర్శలయినా.. జనం మాత్రం ఆసక్తితో రెండు పార్టీల విమర్శలను చూస్తున్నారు.