Green Peace
ఎన్నో తర్జన భర్జనల తర్వాత జపాన్ దేశం అణు వ్యర్ధాలను సముద్రంలోనే కలిపేయాలని నిర్ణయించింది.అయితే ఈ విడుదల ఆందోళన రేపుతోంది. ఇదేమీ అంత ఆషామాషీగా జరిగే వ్యవహారం కాదు.. ఇవాళ మొదలైన ఈ డిశ్చార్జింగ్ ప్రక్రియ దాదాపు 30 ఏళ్ల పాటూ కొనసాగుతుంది. అంటే అన్నేళ్ల పాటూ రేడియో ధార్మిక వ్యర్ధాలు అటు సముద్రాన్ని, ఇటు పర్యావరణాన్ని కలుషితం చేస్తూనే ఉంటాయి..అణు విద్యుత్ ప్లాంట్లకు పెట్టింది పేరైన జపాన్ ఇప్పుడు వాటి విధ్వంసాన్ని చవిచూస్తోంది.
సునామీ కొట్టిన దెబ్బ
రోజుకు5 లక్షల లీటర్ల వ్యర్ధాల విడుదల Green Peace
2011లో ప్రపంచాన్ని కుదిపేసిన భయంకర సునామీ జపాన్ ను బాగా దెబ్బతీసింది. సునామీ ధాటికి జపాన్ లోని అణు విద్యుత్ కేంద్రాలన్నీ నీట మునిగాయి. అసలే రేడియో యాక్టివ్ వ్యర్ధాలతో ఉన్న ఆ జలాలను సముద్రంలోకి విడుదల చేసేందుకు ప్రపంచ దేశాలు ఒప్పుకోలేదు.. దాదాపు 12 ఏళ్ల తర్వాత అగ్ర దేశాలనుంచి అభ్యంతరాలున్నా… అణు విద్యుత్ కేంద్రంలోని వ్యర్థ జలాలను ఎట్టకేలకు పసిఫిక్ సముద్రంలోకి వదలాలని నిర్ణయించి వాటిని విడుదల చేయడం మొదలు పెట్టింది. దాదాపు 5 లక్షల లీటర్ల అణు వ్యర్ధాల జలాలను ఫుకుషిమా-దాయిచి అణు ప్లాంట్ నుంచి పసిఫిక్ సముద్రంలో వదిలేస్తోంది.
జపాన్ అణు వ్యర్ద జలాలను సముద్రంలో వదిలేయడం పట్ల ప్రపంచ దేశాలనుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జపాన్ లో దెబ్బ తిన్న మూడు అణు రియాక్టర్లనుంచి రోజుకు లక్ష లీటర్లు (26,500గ్యాలన్లు)చొప్పున వ్యర్ధ జలాలను స్టోరేజ్ ట్యాంకులలోకి సేకరిస్తున్నారు. అణు ప్లాంట్ రియాక్టర్లను చల్లబరచడానికి వాడే నీరు, ప్లాంట్ వల్ల కలుషితమైన భూ గర్భ జలాలను, ఆ ప్రాంతంలో చేరిన వాన నీటిని అణు ప్లాంట్ ఈశాన్య ప్రాంతం స్టోరేజ్ లోకి చేరుస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 1.34 మిలియన్ టన్నుల నీటిని ( దాదాపు 540ఒలింపిక్ పూల్స్ కి సమానం) సముద్ర తీరానికి దగ్గరలో వెయ్యి ఉన్న కంటైనర్లలోకి చేర్చి నిల్వ చేశారు. ఈ అణు వ్యర్ధ జలాలను ఎలా డిస్పోజ్ చేయాలన్న అంశంపై ఎన్నో తర్జన భర్జనలు జరిగాయి.
30 ఏళ్లు పట్టొచ్చు… Green Peace
2021లో ఎట్టకేలకు ఆ నీటిని శుద్ధి చేసి సముద్రంలోకి వదలాలని నిర్ణయించింది. ఆ మేరకు రోజుకు5 లక్షల లీటర్ల నీటిని సముద్రానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ప్లాంట్ల నుంచి పైప్ లైన్ ద్వారా పసిఫిక్ సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇలా రోజుకు 5 లక్షల లీటర్ల నీటిని వదిలినా.. ఈ వ్యర్ధ జలాలను డిస్పోజ్ చేయడానికి దాదాపు 30 ఏళ్లు పట్టొచ్చు.
ALPS అనే స్పెషల్ ఫిల్టరింగ్ మెకానిజం ద్వారా ఒక్క ట్రిటియం తప్ప కేసియం స్ట్రోన్షియం లాంటి అణు ధార్మిక పదార్ధాలను తొలగించారు.. ట్రిటియం వ్యర్ధాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన తాగు నీటి ప్రమాణాలకు లోబడి ఉన్నాయని జపాన్ చెబుతోంది.
Green Peace సంస్థ అభ్యంతరాలు
ఇక ప్రతీ అణు విద్యుత్ ప్లాంట్ లోనూ ట్రిటియం వ్యర్ధాలు కామన్ గానే ఉంటాయని వాటిని వదిలేస్తూనే ఉంటారని జపాన్ వాదిస్తోంది. జపాన్ చేస్తున్న ఈ పని సురక్షితమైన ప్రక్రియేనని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నా గ్రీన్ పీస్ సంస్థ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ఫిల్టరింగ్ ప్రక్రియ సరిగా లేదని అత్యంత ప్రమాదకరమైన అణు ధార్మిక వ్యర్ధాలను జపాన్ వదిలేస్తోందని దీనివల్ల భూ గర్భ జలాలు కలుషితమవుతున్నాయనీ గ్రీన్ పీస్ సంస్థ అంటోంది.
డంప్ యార్డ్ లా పసిఫిక్ మహా సముద్రం..
అసలు పసిఫిక్ మహా సముద్రాన్ని జపాన్ ఓ వేస్టేజ్ డంప్ యార్డ్ క్రింద ట్రీట్ చేస్తోందని చైనా ఆరోపించింది. జపాన్ అత్యంత స్వార్ధపూరితంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. అణు విద్యుత్ ప్లాంట్ల పరిసరాల్లోని పది జిల్లాలనుంచి రేడియేషన్ టెస్టులు జరిపాకే దిగుమతులు అనుమతించాలని చైనా నిర్ణయించింది. ఇప్పటికే ఆ దేశం నుంచి ఆహార దిగుమతులను బాగా కుదించుకుంది. మరోవైపు దక్షిణ కొరియా లో జపాన్ చర్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వారు సముద్ర ఉప్పును కొనాలంటేనే భయపడుతున్నారు. జపాన్ సీ ఫుడ్ కి పెద్ద దెబ్బే పడేలా కనిపిస్తోంది. దాంతో జపాన్ ఫిషింగ్ ఇండస్ట్రీ కలవరపడుతోంది. తమ వాణిజ్య మనుగడకు దెబ్బగా పరిణమించే ఈ పరిణామాలు ఎదుర్కొనడానికి జపాన్ కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. సముద్రతీరంలో చేపల ఉనికికి ఏమాత్రం ఇబ్బందిలేదని, పర్యావరణం దెబ్బతినలేదని చెప్పేందుకు అవగాహనా కార్యక్రమాలు, స్టడీ టూర్లు నిర్వహిస్తోంది. కొన్ని సార్లు లైవ్ వీడియో డిమానిస్ట్రేషన్లు కూడా చేసింది.
అదే అసలు సమస్య…
ఈ విషయం ఇలా ఉండగా.. 2011లో సునామీ వల్ల దారుణంగా దెబ్బతిన్న మూడు రియాక్టర్లు అణు ధార్మిక తీవ్రతకు కరిగిపోయాయి. ఇప్పుడా వ్యర్ధాలను తొలగించడమే జపాన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. అణు వ్యర్ధాల కుప్పలను ఎక్కడకి తరలించాలో తెలీక సతమతమవుతోంది. రోబోల ద్వారా ఈ వ్యర్ధాలను తరలించే ఆలోచన చేస్తోంది. అయితే వీటిని ఒకసారి కదిపితే వెలువడే రేడియేషన్ చాలా చాలా ఎక్కువగా ఉంటుందని, ఆ ధాటికి మెషిన్లు సైతం చెడిపోయే ప్రమాదముందని తెలుస్తోంది. ఈమొత్తం ప్రక్రియ పూర్తయ్యే సరికి కనీసం 30నుంచి, 40 ఏళ్లు పట్టొచ్చు. దీని వ్యయం అంచనా8ట్రిలియన్ యన్ లు. ( దాదాపు55 బిలియన్ల డాలర్లు).
అభివ్రుద్ధికి ఆవల కోణం?
అణు విద్యుత్ ప్లాంట్లతో అభివ్రుద్ధి, విస్త్రుత ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఒకసారి విధ్వంసం జరిగితే తలెత్తే పరిణామాలను ఎదుర్కొనడం కష్టం.. శాస్త్ర,సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉన్న జపాన్ ఇప్పుడు వాటి మరో కోణమైన విధ్వంసాన్ని భరించలేక ఆపసోపాలు పడుతోంది.అణు విద్యుత్ వల్ల జపాన్ ఆర్థికంగా అందరి కన్నా అభివ్రుద్ధి సాధించే ఉండొచ్చు.. కానీ ఇప్పుడు ఆ ప్లాంట్ల వ్యర్ధాలను డిస్పోజ్ చేయడానికి అవుతున్న ఖర్చు చూస్తుంటే ఒలకబోసి ఎత్తుకుంటున్నట్లుగా ఉంది.. జపాన్ వదులుతున్న ఈ వ్యర్ధాల వల్ల ప్రపంచ దేశాలన్నింటికీ ముప్పే..