JD Laxminarayana
సిబీఐ మాజీ జేడి ,ప్రజా ఉద్యమాలలో మమేకమవుతున్న వి.వి. లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెడతారట.. విశాఖలో రెండు రోజుల క్రితం ఓ మీడియా మీట్ లో ఆయన తాత్కాలికంగా చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారుతోంది. అవసరమైతే కొత్తపార్టీ పెట్టేందుకైనా వెనకాడబోను అన్న జేడీ ఆ పనిలో ఉన్నారా? కొంత కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా?అనే అనుమానాలు కలుగుతున్నాయ్. ఏపీ రాజకీయాల్లో కొత్త ఒరవడి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
బర్రెలక్క స్ఫూర్తి… అందరికీ రావాలి JD Laxminarayana
నవభారత నిర్మాణంలో యువత పాత్ర ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్న వారిలో జేడీ ఒకరు. తాను పెట్టబొయే కొత్త పార్టీలో యువతరానికి ప్రాధాన్యత ఇస్తానని కూడా అన్నారు. రాజకీయాల ధోరణి మారేందుకు యువకులు, విద్యావంతులు దేశం కోసం ఆలోచించే వారు ముందుకు రావాలని ఆయన ఇటీవల జరిగిన ఓ విద్యార్ధి సమావేశంలో కోరారు.. ఇక తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్న బర్రెలక్కకు ఆయన ప్రచారం కూడా చేశారు. కేవలం ఆరువేల రూపాయలు ఆస్తికలిగిన బర్రెలక్క తనలాంటి నిరుద్యోగులకు అండగా ఉండేందుకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ఆయనను ఆశ్చర్యంతో పాటు, స్ఫూర్తి దాయకంగా ఆలోచించేలా చేసింది. అందుకే ఆమెకు ప్రచారానికి జేడీ వెళ్లారు.
నిస్సార రాజకీయాలు
ఇది ఆలోచించే వరకూ బానే ఉంది.కానీ నేటి యువతలో ఈ దిశగా ఆసక్తి కనిపించడం లేదు. సమాజంలో విద్యావంతులు, దేశం కోసం ఆలోచించాలన్న తపన ఉన్న వాళ్లు కనిపించడం లేదు.. అంతా ఎవరి ఉద్యోగం వారిది, ఎవరి సంపాదన వారిది, ఎవరి ప్రైవేట్ లైఫ్ వారిది. పక్కోడి గురించి గానీ, దేశం గురించి గానీ ఆలోచించే సహనం, ఓపిక లేవు. అందుకే ఈ రాజకీయాలు ఇంత నిస్సారంగా సాగుతున్నాయ్.. వేసిందే వేస్తే వెర్రివాడే గెలిచాడన్న చందంగా రాజకీయ బ్రోకర్లు, నేరమయ నాయకులు అందరూ రాజకీయాల్లోకి చొరబడి అంకిన కాటికి దండుకుంటున్నారు.
మరోవైపు ఇవాల్టి తరం రాజకీయాల్లో డబ్బే ప్రధానం.. అభ్యర్ధుల క్ర్లీన్ ట్రాక్ రికార్డుతో సంబంధం లేదు. అందుకే ప్రతీ నేరస్తుడు పొలిటీషియన్ అయిపోతున్నాడు. నీతిమంతమైన రాజకీయాలకు తావే లేకుండా పోయింది. పార్టీలు అవసరార్ధం పెట్టుకునే పొత్తులు, ఎత్తులు , జిత్తులు అన్నీ డబ్బు సంపాదన ధ్యేయంగా జరిగేవే.. అంతేకానీ ప్రజలకు సేవ చేద్దామనే సదుద్దేశం ఉన్నవారు లేరు.
సక్సెస్ రేట్ చాలా తక్కువ
రాజకీయాలను సమూలంగా మార్చి వేస్తానంటూ ముందుకొచ్చిన ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా చివరకు అవినీతి మరక అంటించుకున్నారు. ఓ పదిహేనేళ్ల క్రితం ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టిన చిరంజీవి కూడా రాజకీయాల సమూల ప్రక్షాళన సామాజిక న్యాయం పేరుతో ప్రయత్నించినవారే.. ఇప్పుడున్న జనసేనాని పవన్ కల్యాణ్ కూడా నీతిమంతమైన రాజకీయాలు చేస్తాం.. రాజకీయాలను సమూలంగా మార్చేస్తాం.. ప్రక్షాళన చేస్తాం అంటూ వచ్చిన వారే.. కానీ ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా నిలబడిపోతున్నారు. అంతెందుకు లోక్ సత్తా పేరుతో సంస్కరణయుతమైన రాజకీయాలను నడుపుదాం అని వచ్చిన జేపీ కూడా ఫ్లాప్ షోగానే మిగిలిపోయారు. వీరంతా పేరున్న ప్రముఖులు.. ఇంకా చరిష్మా లేని, వారు ఔత్సాహికులు చాలా మందే చిన్నా చితకా పార్టీలు పెట్టారు కానీ అవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి.
రాజకీయం వంటబట్టాల్సిందే… JD Laxminarayana
కాబట్టి రాజకీయం చేయాలంటే కాస్త లౌక్యం రావాలి. పోల్ మేనేజ్ మెంట్ టెక్నిక్స్ తెలియాలి. అద్భుతమైన ప్రసంగాలు ఇస్తూ, యువతను ఉత్తేజ పరచడం ఒక్కటే చాలదు.. ఒక అజెండా బేస్డ్ రాజకీయాలు చేయాలి. జన సామాన్యాన్ని మెస్మరైజ్ చేయగలగాలి. తన చుట్టూ తిప్పుకోగలగాలి.. ఏదో తప్పక చేస్తారన్న నమ్మకం కలిగించాలి. అందుకు అనుసరిస్తున్న పద్దతులు పారదర్శకంగా ఉండాలి. ప్రజలతో ఒక ఎమోషనల్ అటాచ్ మెంట్ ఏర్పరచుకోవాలి. పూర్తిగా ఇల్లు, సంసారిక బంధాలనూ వదిలేసుకోవాలి. నిత్యం జనంతోనే, జనం వెంటే ఉండాలి.
వారిని చైతన్య పరచాలి. ఇందుకు ఒక వ్యక్తి కష్టపడితే సరిపోదు. వెనక నడిచే నాయకగణం రావాలి. ఫాలోఅప్ ప్రచారాలు చేసే ఒక సైన్యం ఉండాలి. అప్పుడే రాజకీయాలలో ఉనికిని చాటుకోగలం.. ఇప్పటి దాకా వచ్చిన నేతలంతా మంచి ఆలోచనలు , ఆదర్శ భావాలూ ఉన్నా.. రాజకీయం ఎలా చేయాలో మాత్రం గ్రహించలేకపోయారు. జేడీ కూడా ఈ సత్యం తెలుసుకోవాలి. నేరమయ రాజకీయాల్లో మునిగిపోయిన మనం ఆ కుళ్లును కడగాలంటే అడుసులో కాలు పెట్టాల్సిందే. చాలా శ్రమ పడాల్సిందే.
ఇప్పటి వరకూ ఇలా వచ్చిన నేతలెవరూ సక్సెస్ కాలేదు. వారికి కొరుకుడు పడని రాజకీయాలు జేడీ లక్ష్మీ నారాయణకు సాధ్యపడతాయా?కానీ ప్రయత్నిస్తే కదా చేయగలమో లేదో తెలిసేది..
గత ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన లక్ష్మీ నారాయణ మూడు లక్షలకు దగ్గర ఓట్లు సంపాదించుకున్నారు. ఇదంతా ఆయన వ్యక్తిగత ఇమేజ్ తో సాధించుకున్నదే..ఏదేమైనా దేశం కోసం నవభారత నిర్మాణం కోసం తపిస్తున్న జేడీకి ఆల్ ది బెస్ట్ చెబుదాం..