కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ఇంటి వద్ద సందర్శకుల రాక ఎక్కువ కావడం, సెక్యూరిటీ ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు అవస్థలు పడుతున్నారు. సహజంగా ముఖ్యమంత్రి అంటేనే సందర్శకులు ఎక్కువ. సెక్కూరిటీ కూడా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఆ వీధిలోకి ఎవరు రావాలన్నా సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే పంపుతారు. ప్రశ్నలతో వేధించి చంపుతారు. చివరకు వారు దయదలచి వదిలపెడితే తమ వారి ఇంటికి వెళ్లొచ్చు. లేదంటే అటు నుంచి అటే వెళ్లాల్సిందే.
పార్కింగ్ సమస్య…
అలాగే పార్కింగ్ సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. వచ్చే సందర్శకులందరూ వచ్చే వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. తమ సొంత ఇళ్లకు పనులపై వెళ్లాలన్నా, ఉదయం నడకకు వెళ్లాలన్నా కూడా స్థానికులకు ఇబ్బంది తప్పదు. అలాంటి సమస్యనే ఇప్పుడు బెంగళూరులో సిద్ధరామయ్య నివాసం సమీపంలోని స్థానికులు ఎదుర్కొంటున్నారు. తమ సొంత వాహనాలను కూడా నిలుపుకునేందుకు వీలులేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ముఖ్యమంత్రి కావడంతో ఏమీ అనలేని పరిస్థితి.
నిలదీసిన పెద్దాయన…
కానీ సిద్ధరామయ్యను ఇంటి ఎదురుగా ఉన్న ఒక పెద్దాయన నిలదీశాడు. ఆయన వాహనాన్ని అడ్డుకుని తన బాధను చెప్పుకున్నాడు. “మీ ఇంటికి వస్తున్న సందర్శకుల కారణంగా వీధిలో పార్కింగ్ సమస్య ఏర్పడుతుందని, కొన్నేళ్ల నుంచి ఇదే సమస్యను తాము ఎదుర్కొంటున్నామని, ముందు దీనిని పరిష్కరించండి” అంటూ మొర పెట్టుకున్నారు. తమ ఇంటి గేట్ వద్ద కూడా బ్లాక్ అవుతుందని, ఇంట్లోకి వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా మారిందని ఆ పెద్దాయన సిద్ధరామయ్యకు తన బాధను వినిపించారు.
అధికారిక నివాసానికి…
ఇక భరించలేమని, దీనిపై వెంటనే స్పందించాలని ఆయన సీఎంను అక్కడే కోరారు. అయితే వెంటనే సిద్ధరామయ్య తన భద్రతసిబ్బందిని పిలిచి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అంతవరకూ ఓకే. కానీ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టినా ఇంకా సొంత ఇంట్లోనే ఉంటున్నారు. అక్కడే ఉదయం ఫైళ్లను చూస్తుండటంతో అధికారులు, సందర్శకులు ఆయన కోసం ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి ఆయన మారలేదు. అక్కడ ఇంకా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉంటున్నారు. త్వరగా సిద్ధరామయ్య అధికారిక నివాసంలోకి మారితే తమకు ఈ తలనొప్పి తగ్గుతుందని స్థానికులు ఆశిస్తున్నారు.