KCR-MODI
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ప్రధాని మోడీ తెలంగాణ టూర్ బీఆర్ ఎస్ మీద ఎదురు దాడితో అందరి దృష్టిలోనూ పడుతోంది. వంశపారంపర్య పాలనను, ఏక కుటుంబ పాలన అంతాన్నే ఈసారి ఎన్నికల ఎజెండాగా ప్రకటించిన మోడీ నిజామాబాద్ ఇందూరు సభలో కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఇక జాతీయ పార్టీ అని ప్రకటించుకున్న కేసీఆర్ పరువు గంగలో కలిపేశారు. కేసీఆర్ కు సంబంధించిన అనేక సీక్రెట్స్ ఇవాల్టి బహిరంగ సభలో బయటపెట్టారు. కేసీఆర్ ఎన్డీఏలో చేరేందుకు తన దగ్గరకు గతంలో వచ్చారన్నారు.
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపి గెలిచాక కేసీఆర్ ఢిల్లీ వచ్చారని పార్టీ గెలిచినందుకు అభినందనలు తెలిపి శాలువా కప్పి సన్మానించారనీ అన్నారు.. తాను ఎన్డీలో చేరాలనుకుంటున్నట్లు మనసులో కోరిక వెల్లడించారన్నారు.. అంతేకాదు గతంలో ఎప్పుడూ ఒలకబోయనంత ప్రేమ ఒలకబోసి, వినయ విధేయతలు ప్రదర్శించారని నిజానికి ఈ ప్రవర్తన అతని రక్తంలోనే లేదనీ మోడీ విమర్శించారు. తన కుమారుడికి ఇక సీఎం పగ్గాలు అప్పగిస్తానని చెప్పారని, తాను అలిసిపోయినందున ఇకపై విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాననీ అన్నారని చెప్పారు. కేటీఆర్ ను మీ దగ్గరకు పంపుతాను ఆశీర్వదించండి అని కూడా కేసీఆర్ అడిగారట.అయితే అందుకు మోడీ ఒప్పుకోలేదట. బిడ్డలకు వారసత్వంగా పదవి పంచడం వారసత్వం కాదని, ఇవి రాజకీయాలనీ తాను కేసీఆర్ ను వారించినట్లు మోడీ తెలిపారు.ఎన్డీఏలో చేరుతానన్నా తాను ఒప్పుకోలేదన్నారు మోడీ.
డైనాస్టీ పాలిటిక్స్ ఎజెండా అందుకేనా?
మొత్తానికి మోడీకి ఆల్టర్ నేటివ్ ని తానేనని చెప్పుకునే కేసీఆర్ ను సొంత గడ్డపైనే గాలి తీసేశారు ప్రధాని. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి మాటలు ఊరికే చెప్పరని, కచ్చితంగా కేసీఆర్ ఈ మాటలు అనే ఉంటారని రాజకీయ పరిశీలకులు ఇప్పుడు ఎనాలిసిస్ చేస్తున్నారు. అసలు డైనాస్టీ పాలిటిక్స్ అన్న ట్రిగర్ పాయింట్ బీజేపీకి అప్పుడే తట్టిందని అప్పటినుంచే ఇటు కాంగ్రెస్ ను, అటు బీఆర్ ఎస్ ను ఒకే దెబ్బతో ఎదుర్కొనాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ నినాదాలను ఎత్తుకుందని ఇప్పుడు విశ్లేషణలు బయటకొస్తున్నాయి.
పచ్చి అబద్ధాలు… నీటి మూటలు
అయితే బీఆర్ ఎస్ మాత్రం ఈ కామెంట్లను ఖండిస్తోంది. అవ్వన్నీ పచ్చి అబద్ధాలని, మోడీ మాటలు నీటి మూటలని ఎదురు దాడికి దిగింది. తెలంగాణ వచ్చాక అసలు టీఆర్ ఎస్ పార్టీ ఎవరితోనూ పొత్తుల గురించి మాట్లాడలేదని ఖండించింది. మోడీ మాటలు నిజమే అయితే ఇన్నాళ్లూ ఈ విషయం ఎందుకు దాచారని? ఇప్పుడే ఎందుకు చెబుతున్నారనీ అడుగుతున్నారు బీఆర్ ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్. ఏదేమైనా టీఆర్ ఎస్ బీఆర్ ఎస్ గా మారాక, కవిత మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చాక బీఆర్ ఎస్ మోడీనే నేరుగా టార్గెట్ చేసి విమర్శల జోరు పెంచింది. అయితే ఈ మధ్య కాలంలో మోడీని కేసీఆర్ నేరుగా, ఘాటుగా విమర్శించడం మాత్రం ఎప్పుడూ చూడలేదు.. కేవలం కేటీఆర్, కవిత మాత్రమే మోడీ పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు.
యుద్ధం షురూ… KCR-MODI
ఇప్పటి వరకూ కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్య అమీ తుమీ అనుకుంటున్న ఎన్నికలను మోడీ వచ్చి ట్రయాంగిల్ ఎన్నికలుగా మార్చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రానికి రావడం, ఎన్నికల ఏర్పాట్ల కసరత్తు కోసమే కాబట్టి తెలంగాణలో యుద్ధం షురూ అయినట్లే.. మోడీ కామెంట్స్ తో ఇప్పుడది పతాక స్థాయికి చేరింది. KCR-MODI