తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లోనే జరగనున్నాయి. డిసెంబరు నాటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. త్వరలో ఐదు రాష్ట్రాల నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అభ్యర్థుల ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఫాం హౌస్ లో ఉండి సర్వే నివేదికలను సరి చూసుకుంటూ ఎవరైతే గెలుపు గుర్రాలని భావిస్తారో వారి పేర్లను ముందుగా ఖరారు చేయనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటంతో కొందరిని పక్కకు తప్పించక తప్పదు. వారికి ఆలర్నేటివ్ పోస్టు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలన్నది కేసీఆర్ లక్ష్యం. ఆ దిశగానే
సమర్థవంతులైన అభ్యర్థులను ఆయన ఖరారు చేసే పనిలో ఉన్నారు.
ఆషాఢం వెళ్లిన తర్వాత…
ఆషాఢ మాసం వెళ్లి పోయిన వెంటనే తొలి జాబితాను కేసీఆర్ విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి జాబితాలో నలభై మంది వరకూ ఉండే అవకాశముంది. ప్రత్యర్థి ఎవరైనా ఖచ్చితంగా గెలుస్తారనుకున్న వారికే తొలి జాబితాలో స్థానం కల్పించనున్నారు. ఏమాత్రం సర్వేల్లో కొంత వెనకబడి ఉన్నప్పటికీ, అవతల పార్టీ అభ్యర్థులను చూసిన తర్వాత మిగిలిన వారి ఎంపిక పూర్తవుతుందని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత కొద్ది రోజులుగా కేసీఆర్ వివిధ సంస్థలతో సర్వేలు చేయిస్తున్నారు. ఇప్పటికే మూడు నాలుగు సార్లు సర్వేలు చేయించిన గులాబీ బాస్ ఈసారి కూడా ఒడ్డున పడే వారికే టిక్
పెట్టనున్నారు.
ముప్ఫయి నుంచి…
సిట్టింగ్ లందరికీ సీట్లు ఇస్తామని కేసీఆర్ పలు సమావేశాల్లో చెప్పినప్పటికీ కొందరి విషయంలో మాత్రం ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. వారిపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉండటం, సంక్షేమ పథకాల్లో ఎమ్మెల్యేలు వారి అనుచరుల చేతివాటం, లబ్దిదారుల ఎంపికలో జరిపిన పొరపాట్ల కారణంగా కొందరికి ఈసారి టిక్కెట్లు రావడం డౌటేనని చెబుతున్నారు. దాదాపు ముప్ఫయి నుంచి నలభై మంది వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలుపు జాబితాలో వెనకబడి ఉన్నట్లు సమాచారం. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయడమా? లేక ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను రప్పించి అక్కడ పోటీ చేయించడమా?
అన్న విషయంపై సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు.
మంత్రులు కూడా…
ఈసారి టిక్కెట్లు దక్కని వారిలో మంత్రులు కూడా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఈసారి టిక్కెట్లు దక్కని వారిలో సీనియర్ మంత్రులు కూడా ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. వారిపై ప్రజల్లో వ్యతిరేకతతో పాటు పనితీరును కూడా బేరీజు వేసుకుని వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులనురంగంలోకి దింపి ఆ పార్టీని 30 లోపు స్థానాలకే పరిమితం చేయాలన్న ఎత్తుగడలో ఉన్నారు. కాంగ్రెస్ ను దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ ఈసారి ఎన్నికల స్ట్రాటజీని చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో
ఓడిపోయిన కొందరికి సానుభూతి పనిచేసి ఈసారి గెలుస్తారన్న నివేదికలతో వారికి అవకాశం ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారంటున్నారు. మరికొద్దిరోజుల్లోనే తొలి జాబితాను కేసీఆర్ మిగిలిన పార్టీల కంటే ముందుగా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
Follow Us On : YouTube , Google News