తనను పార్టీ అధ్యక్షుడిగా నియమించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమిస్తూ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కిషన్ రెడ్డి ఫోన్ స్విచాఫ్ అయింది. అంతేకాదు కేంద్ర కేబినెట్ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు.
గుర్రుగా ఉన్నారంటూ…
దీంతో కిషన్ రెడ్డి తనను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నందుకు గుర్రుగా ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అందుకే అలకబూని బయటకు రాలేదని, ఎవరికి అందుబాటులోకి రాలేదంటూ పెద్దయెత్తున మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈరోజు మీడియా ముందుకు వచ్చిన కిషన్ రెడ్డి తన నియామకంపై స్పందించారు. కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.
ప్రధాని సభ తర్వాతే…
ఈరోజు సాయంత్రం ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. రాత్రి 8 గంటలకు పార్టీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈనెల 8వ తేదీ ప్రధాని మోదీ వరంగల్ పర్యటనపై నేతలతో సమీక్షిస్తారు. మోదీ సభ తర్వాత తాను అధ్యక్ష బాధ్యతలను తీసుకుంటానని ఆయన మీడియాకు వెల్లడించారు. బీజేపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం మేరకు నడుచుంటానని, అందరినీ కలుపుకుని వచ్చేఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు.