Congress
ఊరంతా తిరిగి మూలన కూర్చున్న ఉలిపికట్టలా తయారైంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి.. ఆయన ఎవరిని వ్యతిరేకించారో, ఎవరితో వైరం పెట్టుకున్నారో , ఎవరిని ఛాలెంజ్ చేశారో, చివరికి వారి చెంతకే చేరారు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు మళ్లీ సొంత గూటికి చేరారు. కొన్నాళ్ల క్రితం కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డిపై చెలరేగిపోయి కాంగ్రెస్ లో ఉండేది లేదంటూ నానా యాగీ చేశారు. రాజగోపాల్ రెడ్డి మరో అడుగు ముందుకేసి బీజేపీలో చేరిపోయారు. కోమటిరెడ్డి చేసిన విమర్శలకు ఇటు రేవంత్ నుంచి కూడా కౌంటర్లు గట్టిగానే పడ్డాయి. ఇద్దరి మధ్యా యుద్ధం తారస్థాయికి చేరింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా కొంత కాలం కొనసాగాయి.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తాను పనిచేయలేనని ఆనాడు రంకెలేశారు. ఇక కోమటిరెడ్డి వెంకట రెడ్డి అయితే కాంగ్రెస్ హై కమాండ్ ను అనేక సార్లు బెదిరించారు. మొత్తానికి నల్లగొండ బ్రదర్స్ మళ్లీ మొదలు పెట్టిన చోటకే చేరారు. మునుగోడులో తన గెలుపు గ్యారంటీ అనీ, కేసీఆర్ ను గద్దె దింపడం తన కర్తవ్యమనీ రేవంత్ ఎందుకూ పనికి రాడని, రేవంత్ వల్ల కాంగ్రెస్ నా మరూపాలు లేకుండా పోయిందనీ,అది టీడీపీ పార్టీగా మారిపోయిందనీ వెళుతూ వెళుతూ రాజగోపాల్ నానా శాపనార్దాలు పెట్టారు. అమిత్ షా అంత మంచి మనసున్న మనిషి లేడని కూడా కీర్తించారు.
అప్పట్లో కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ బీజేపీలో చేరారన్న పుకార్లూ వచ్చాయి. ఏదేమైనా రాజగోపాల్ పార్టీ మారడం మునుగోడు ప్రజలకే నచ్చలేదు. అందుకే ఓడించారు. తీరా ఓడిపోయాక తత్వం బోధపడింది. కేవలం పంతం కోసం ఉప ఎన్నిక తెస్తే జనం తామేంటో చూపించారు. చివరికి ఓడిపోయాక రాజగోపాల్ ప్రాధాన్యత కూడా బీజేపీలో తగ్గిపోయింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎటు వెళ్లాలోతెలీక చాలా రోజులు అసంతృప్తులతో కలసి మంతనాలు సాగించారు. కమలాన్ని వీడబోతున్నారని సంకేతాలు గట్టిగానే వచ్చాయి కానీ కాంగ్రెస్ లో చేరతారా అనే డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుని అందరి అంచనాలకు చెక్ పెట్టారు.
మునుగోడు సీటు కోసం
వాస్తవానికి కాంగ్రెస్ దూకుడు మీదుంది. ఏ సర్వే చూసినా ఈసారి కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉందని అంచనాలు చెబుతున్నాయి. దాంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ మళ్లీ పాత రాగం అందుకున్నారు. తల్లి లాంటి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, సోనియమ్మకి జై అంటూ తమ కారాలు, మిరియాలు నూరే పనికి కాస్త గ్యాప్ ఇచ్చారు. అయితే నిజంగానే కాంగ్రెస్ ది పెద్ద మనసనే చెప్పుకోవాలి. నానా శాపనార్ధాలు పెట్టిన రాజగోపాల్ రెడ్డి వస్తాననగానే వద్దనకుండా చేర్చేసుకుంది. అంతేకాదు ఆయన కోరుకున్న సీటు కూడా ఇచ్చేసింది. మునుగోడు నుంచి తాను గానీ, తన భార్య గానీ పోటీ చేయాలని ఉవ్విళ్లుతున్నట్లు రాజగోపాల్ చెప్పగానే ఆలోచించుకుని చెప్పండంటూ వామపక్షాలకు కూడా ఝలక్ ఇచ్చేసింది కాంగ్రెస్.. మునుగోడు సీటు తమకే ఇవ్వాలని లేకపోతే స్నేహ పూర్వక పోటీ తప్పదని తేల్చి చెప్పేశాయి వామపక్షాలు.అయినా కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డికే ప్రిఫరెన్స్ ఇచ్చింది. దాంతో తన భార్యను కూడా బరిలోకి దింపేందుకు ఆయన ఉత్సాహ పడ్డారు. మునుగోడు సీటు తన భార్యకు కేటాయిస్తే తాను ఎల్ బీ నగర్ నుంచి బరిలోకి దిగేందుకు కూడా సిద్ధపడినట్లు వార్తలొస్తున్నాయి. ఎట్టకేలకు మునుగోడు సీటు ఆయనకే కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలు భరోసా ఇచ్చారు.
గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు కలిసొస్తాయా? (Congress)
ఎలాగైనా ఈసారి అధికారం దక్కించుకోవాలన్న ఆరాటంలో ఉన్న కాంగ్రెస్ పెద్ద మనసు చేసుకుని పార్టీని తిట్టిన వాళ్లని, వెళ్లిపోయిన వాళ్లనీ అందరినీ చేర్చేసుకుంటోంది. నిజానికి కోమటిరెడ్డి బ్రదర్స్ కి కాంగ్రెస్ అంత బెస్ట్ పార్టీ మరోటి లేదు కూడా..ఎందుకంటే ఎన్నిసార్లు అలిగినా, ఇష్టమొచ్చినట్లు నిందించినా జాతీయ నాయకత్వం ఏమీ అనదు.. కనీసం నోటీసు కూడా ఇవ్వదు. కాబట్టి వారి కోప తాపాలను భరించే ఏకైక పార్టీ.. కాంగ్రెస్ నీడలోనే వారిద్దరు కెరీర్ లో అద్భుతంగా ఎదిగారు. ఎన్నో కాంట్రాక్టులు సంపాదించారు. కాలేజీలు పెట్టారు. దాన, ధర్మాలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక సాయమూ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కి మంచి పేరు రావడంలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉన్నట్లే.. మొత్తం మీద ప్రస్తుతానికి ఇద్దరికీ జై రేవంత్ రెడ్డి అనక తప్పలేదు. ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ గెలిస్తే అప్పుడు జరిగే వార్ వేరే ముచ్చట.. కోమటిరెడ్డి బ్రదర్స్ కి అప్పుడు, ఇప్పుడు, ఎఫ్పుడూ కాంగ్రెస్ పార్టీనే బెస్ట్. (Congress)