ఏపీ (AP) రాజకీయాలు మరీ పద్ధతి , పాడు లేకుండా సాగుతున్నాయ్.. తెలంగాణలో మామూలు తిట్లు… మహా అయితే జంతువుల పేర్లు ఉపయోగించి రాజకీయ నేతలు తిట్టుకుంటుంటే.. ఏపీలో ఈ స్థాయి, ఈ ప్రమాణాలు కూడా పడిపోయి అధ్వాన్న స్థితికి దిగజారాయి. పచ్చి బూతులతో, సభ్య సమాజం వినడానికి వీల్లేని భాషలో చెలరేగిపోతున్నారు అక్కడి రాజకీయ నేతలు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీలు ఇలాగే ఏడిశాయ్. ఎవరో ఒకరు ముందు నోరుజారడం, దానికి ప్రతిగా ఇవతలి వాళ్లు మరింత నీచంగా నోరుపారేసు కోవడం కామన్ అయ్యింది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన సోషల్ మీడియాలో బట్టలిప్పేసి మరీ రెచ్చిపోతున్నాయ్.. ఈ బూతు పురాణంలో అందరికీ తేరగా దొరికేది ఆడవాళ్లే.. ఆడవాళ్లంటే చాలు ఇష్టాను సారం నోరుపారేసు కోవడం, కనీస మర్యాద, మన్నన లేకుండా దిగజారి మాట్లాడటం ఎక్కువైపోయింది. ఏదో వాళ్లలో వాళ్లు తిట్టుకుంటున్నారులే అని ఇన్నాళ్లూ సరి పెట్టుకున్న జనానికి ఆ వ్యవహారం హద్దులు దాటి ఆడవాళ్ల దాకా వచ్చేసింది. ఇది అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది. ఆడవాళ్లని తిడితే వెంటనే నోర్లు మూసేస్తారనే ఉద్దేశంతో సులభంగా బూతు పురాణం మొదలు పెట్టేస్తున్నారు. ఇదొక అస్త్రంలా వాడేస్తున్నారు.
బండారుకు టీడీపీ నైతిక మద్దతు
ఇటీవల మంత్రి రోజాపై మాజీ మంత్రి, టిడిపి నేత బండారు సత్యానారాయణ మూర్తి వాగుడు చూస్తుంటే అసహ్యం కలుగుతోంది. సినిమా వాళ్లంటే ఎంత చులకన లేకపోతే, ఆడవాళ్లంటే ఎంత చీప్ ఒపీనియన్ లేకపోతే బండారు అలా పశువు కన్నా హీనంగా మాట్లాడాడు. ఆయన ఇంట్లో ఆడవారు లేరా? తన భార్యతో, తల్లినో, చెల్లినో అలా అనగలడా? పైగా బండారు మాట్లాడిన మాటలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ సమర్ధించడం వింతల్లోకే వింత. వివాదాస్పద మాజీ ఎమ్మెల్యే, చింతమనేని కి కూడా ఆ మాటలు తప్పుగా అనిపించలేదట.. ఎప్పుడో వాళ్లన్నారు.. ఇప్పుడు మేం అన్నాం.. అంతే..చెల్లుకు చెల్లు అన్నట్లుగా ఉంది టీడీపీనేతల ధోరణి.
అక్కడ సభ్యతను, ఉచితానుచితాలను మరచి అవతలి పార్టీ వాడైతే ఏమైనా వాగేయ్.. ఏదైనా చేసేయ్ అన్న చందంగా టీడీపీ నేతలున్నారంటే ఏమనుకోవాలి? దీనికి కాస్త వెనక్కి వెళితే ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు తన భార్యను అవమానించారంటూ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. దానికి వైసీపీ మద్దతు దారుడైన వల్లభనేని వంశీ వెర్షన్ మరోలా ఉంది. తనను, తన భార్యను ఐటీడీపీ అనే ఓ సోషల్ మీడియా సంస్థ ద్వారా తిట్టించినప్పుడు , రాయడానికి వీల్లేని భాషలో జుగుప్సాకరంగా తనను అపఖ్యాతి పాల్చేసి మానసిక క్షోభకు గురి చేసినప్పుడు తన కుటుంబం కూడా ఇలాగే బాధపడిందని చంద్రబాబు అది తెలుసుకుంటే మంచిదనీ గట్టిగా బదులిచ్చారు. ఈ సోషల్ మీడియా విదేశాలనుంచి ఆపరేట్ అవుతోందని దీనికి కర్త కర్మక్రియ అన్నీ చంద్రబాబేనని అప్పట్లో వంశీ చెప్పారు.
చర్యకు ప్రతిచర్య.. (AP)
అసలు ఒక మనిషిని మరో మనిషి విమర్శించేటప్పుడు వ్యక్తిగతంగా ఎందుకు వెళతారో అర్ధం కాదు.. పార్టీ విధానాలపైనా, వారి పనితీరు పైనా, వ్యవహార శైలి పైనా విమర్శించొచ్చు.. కానీ వ్యక్తిగతంగా నిందించడం, బాడీ షేమింగ్ చేయడం, నోరుంది కదాని ఇష్టానుసారం నిందలేసేయడం పరిపాటిగా మారింది. ఇందులో ఇరుపార్టీల మహిళా నేతలు తక్కువ తినలేదు. మంత్రి రోజాపై బండారు నోరుపారేసు కోడాన్ని టీడీపీ నేత వంగలపూడి అనిత సమర్ధించారు. రోజా గతంలో పీతల సుజాతను బాడీ షేమింగ్ చేసిందని,తనదాకా వస్తే తెలిసిందా అనీ అనిత రియాక్ట్ అయ్యారు. చర్యకు ప్రతిచర్య మాత్రమేనని చెప్పడం ఆమె ఉద్దేశం కాబోలు.. అంటే ఇక్కడ సాటి మహిళగా దీన్నొక అభ్యంతరకర అంశంగా ఆమె చూడకపోవడం ఏపీ రాజకీయాల దివాళా కోరుతనానికి నిదర్శనం. సాటి మహిళలపట్ల కనీస మర్యాద, ఐక్య భావం కూడా లేదు. మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నప్పుడు దెబ్బకు దెబ్బఅనే ధోరణిలో, కక్ష పూరితంగా ఆలోచంచడమే పార్టీ నేతల బుర్రలు ఎంతలా పొల్యూట్ అయిపోయాయో తెలియచేస్తుంది.
రెండు పార్టీల నేతలూ అంతే!! (AP)
ఆవేశకావేశాలు చెలరేగుతున్నప్పుడు తమ నేతలను, సభ్యులను అధినేతలు కంట్రోల్ చేయాలి. దురదృష్టమేమంటే ఇటు టీడీపీలోగానీ, అటు వైసీపీలోగానీ ఈ సంప్రదాయమే కనిపించదు. ఇద్దరు నేతలు తమ బలగాన్ని ఎప్పుడూ వారించినట్లు కనపడరు. వారి ప్రైవేటు సమావేశాలు, పార్టీ సమావేశాల్లోనైనా కనీసం మందలించడం లాంటిది ఎప్పుడూ కనిపించలేదు. కొద్దో గొప్పో జనసేనాని పవన్ పార్టీ మీటింగుల్లో కొన్ని మంచి మాటలు చెబుతుంటారు..వాటిని జనసైనికులు ఏ మేరకు ఆచరిస్తారన్నది వేరే సంగతి.
మహిళల్లోనే స్పందన కరువు
మంత్రి రోజాకు మద్దతుగా మహిళా సంఘాలు రంగంలోకి దిగి ఖండన ప్రకటనలిచ్చాయి. సినీ ఇండస్ట్రీలోనే ఈ ఘటనపై స్పందన కరువైంది. తమిళ నటి ఖుష్బు మాత్రమే రోజాకు మద్దతుగా చాలా గట్టిగా నిలబడ్డారు. బండారును పశువుకన్నా హీనమని తిట్టిపోశారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా సాధికారత కోసం చర్చ జరుగుతున్న తరుణంలో మహిళలపై ఇంతలా దిగజారుడు రాజకీయాలా అని మండిపడ్డారు… అటు జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశంపై రియాక్టయ్యింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంది. దురదృష్ఠకర పోకడలేమంటే ఈ దిగజారుడు రాజకీయాలు వృత్తులలోకి కూడా పాకిపోయాయి. లాయర్లు, పోలీసులు, డాక్టర్లు సైతం పార్టీల వారీగా చీలిపోయిన దౌర్భాగ్యకర పరిస్థితుల్లోకి ఏపీ (AP) రాజకీయాలు జారిపోయాయి. ఇంగితం మరచి అసభ్యంగా మాట్లాడిన బండారు సత్య నారాయణను బెజవాడ బార్ అసోసియేషన్ కు చెందిన ఓ సామాజిక వర్గం లాయర్లు సన్మానించాలనుకున్నారంటే అసలు ఏపీ రాజకీయాలు ఎటు వెళుతున్నాయన్న ఆందోళన కలుగుతోంది.