తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే భారతీయ రాష్ట్ర సమితి తమ అభ్యర్థులను ప్రకటించింది. బేజీపీ, కాంగ్రెస్ లు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే దరఖాస్తులును కూడా స్వీకరించింది. అనేక మంది నేతలు కాంగ్రెస్ పార్టీ తరుపును పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ టిక్కెట్లకు డిమాండ్ పెరిగింది.ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు మందికి పైగానే నేతలు తమ దరఖాస్తులను చేసుకున్నారు. వాటి వడపోత కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఈసారి కాంగ్రెస్ టిక్కెట్ వస్తే గెలిచినట్లేనని నేతలు భావించడమే ఇందుకు కారణం. అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ వరసగా రెండుసార్లు విజయం సాధించడంతో కాంగ్రెస్ టిక్కెట్లకు డిమాండ్ మామూలుగా లేదు. (Hot Seat)
వడబోత తర్వాత…
సరైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అన్ని రకాల కసరత్తులు చేస్తుంది. ఎవరిని ఎంపిక చేస్తారన్నది పక్కన పెడితే ఆర్థికంగా, సామాజికవర్గంగా కూడా ఈసారి అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. బలమైన అభ్యర్థులతో పాటు గెలుపునకు అవకాశాలున్న వారినే ఎంపిక చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించడంతో కాంగ్రెస్ టిక్కెట్ దొరకడం ఈసారి ఆషామాషీ కాదు. అన్ని రకాలుగా వడబోతలు చేసిన అనంతరమే అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెబుతున్నారు. వచ్చే నెలలో తొలి విడత జాబితాను సిద్ధం చేసి విడుదల చేయాలన్న ఉద్దేశ్యంతో పార్టీ హైకమాండ్ ఉంది. దీంతో పాటు అభ్యర్థులపై ప్రత్యేకంగా సర్వేలు చేయించిన తర్వాతనే ఎంపిక చేస్తారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. (Hot Seat)
సెటిలర్లు ఎక్కువగా…
ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలోని ఎల్.బి.నగర్ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. ఎక్కువ మంది దీనికి దరఖాస్తులు చేసుకున్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ కూడా ఎల్.బి.నగర్ నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. పేరుకు ఇది నగరంలో ఉన్నప్పటికీ తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు ఎక్కువ. అందుకే నేతలు లెక్కలు వేసుకుని మరీ బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం నేతలు కూడా అధికంగానే దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ఇక్కడి నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయాలని కూడా భావించారని, తర్వాత మనసు మార్చుకుని కొడంగల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ కు మాత్రం… (Hot Seat)
2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ అధికార బీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయింది. 2009 లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయనను ఆ ఎన్నికల్లో పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి గెలవలేకపోయారు. అక్కడి నుంచి మరలా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గెలుపొందారు. తర్వాత ఆయన బీఆర్ఎస్ లోకి చేరిపోయారు. ప్రస్తుతం సుధీర్ రెడ్డికి బీఆర్ఎస్ హైకమాండ్ టిక్కెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. బీసీలు, రెడ్డి సామాజికవర్గం నేతలు ఎక్కువ మంది ఈ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మరి చివరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఎవరు పోటీ చేసినా అందరు కలసి కట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని హైకమాండ్ చెబుతుంది. మరి ఇది ఎంత వరకూ జరుగుతుందన్నది చూడాల్సి ఉంది. (Hot Seat)