వామపక్ష పార్టీలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు ఎర్రజెండా ఊసు లేని గ్రామం లేదు. కానీ నేడు ఆ జెండా కనిపించ కుండా పోయింది. గ్రామాల్లో సయితం వామపక్ష వాసనలు ఎక్కడా చిక్కడం లేదు. లెఫ్ట్ పార్టీల ఆశయాలు, సిద్ధాంతాలు యువతలో కూడా కానరావడం లేదు. దీంతో దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారనుంది.
నాడు దేశమంతా….
ఒకప్పుడు వామపక్ష పార్టీలు అంటే… దేశమంతా విస్తరించి ఉండేవి. అధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవి. వామపక్ష భావాజాలం ఎక్కువగా ఉన్న నాటి రోజుల్లో ప్రజలు కూడా ఆ పార్టీని ఆశీర్వదించారు. అధికారాన్ని అందించారు. కేంద్రంలో అధికారంలో లేకపోయినా.. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే విధంగా వామపక్ష పార్టీలు ఉండేవి. రాజకీయాల్లో లెఫ్ట్ పార్టీలకు ఒక గౌరవం ఉండేది. వారికి ప్రత్యేక గుర్తింపూ… ఉండేది. కమ్మునిస్టు పార్టీ సీపీఐ, సీపీఎంలుగా విడిపోయిన తర్వాత కూడా రెండు పార్టీలు ప్రజాదరణను పొందాయి. ప్రజా సమస్యలు… ప్రధానంగా పేదల పక్షాన పోరాడే పార్టీలుగా ముద్రపడటంతో అట్టడుగు వర్గాలు సయితం ఆ జెండాకు అండగా నిలిచేవి.
ఇందిర హయాం నుంచి…
ఇందిరాగాంధీ హయాం నుంచి కమ్యునిస్టులు క్రమంగా బలహీనపడుతూ వచ్చారు. ఇందిర అమలు చేసిన పథకాలతో పేద, బడుగు వర్గాలు కాంగ్రెస్ వైపు చూడటం ప్రారంభించాయి. అప్పటి నుంచి కామ్రేడ్లకు కష్టాలు ప్రారంభమయ్యాయనే చెప్పాలి. అయితే ఆ తర్వాత కూడా సీపీఐ, సీపీఎం పార్టీలు అనేక రాష్ట్రాల్లో ప్రజల చేత జై కొట్టించుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని అక్కడి శాసనసభలో తమ గళం విప్పేలా వ్యూహాన్ని మార్చుకున్నాయి. ప్రధానంగా వామపక్ష పార్టీల ఓటు బ్యాంకు బడుగు, బలహీన, దళిత వర్గాలు కావడంతో ఇతర పార్టీలు ఆ ఓటు బ్యాంకుపై కన్నేయడం ప్రారంభించాయి. అప్పటి నుంచి కామ్రేడ్లు క్రమంగా ప్రజలకు దూరం అవుతూ వచ్చారు.
క్రమంగా కనుమరుగు…
1980వ దశకం వరకూ వామపక్ష పార్టీలు ఒకింత ఊపు మీద ఉండేవి. కానీ ఆ తర్వాత నుంచి క్రమంగా క్షీణ దశకు చేరుకున్నాయి. ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు బదిలీ అయింది. తాము చేసే పోరాటాలకు ప్రభుత్వాలు కూడా పెద్దగా విలువ ఇవ్వకపోవడం నాటి నుంచి ప్రారంభమయింది. ఏం చేసినా క్రెడిట్ తమకే దక్కాలన్న పాలకులు రాష్ట్రాలలో అధికారాంలోకి రావడంతో కమ్మునిస్టు పార్టీలకు కాలం చెల్లడం ప్రారంభమయింది. ఇక ఎన్నికల తంతు కూడా మారడం వామపక్షాల ఎదుగుదలకు ఆటంకంగా మారింది. నిజాయితీ.. సేవా భావం రాజకీయాల్లో కొరవడటం ప్రారంభం అయిన నాటి నుంచి లెఫ్ట్ పార్టీలను ప్రజలు కూడా ఆదరించడం మానేశారు.
డబ్బు.. మారుతున్న జీవనశైలి…
తొలి నాళ్లలో రాజకీయాల్లో పార్టీలకు ప్రాధాన్యత ఉండేది. పోటీ చేసే నేతలకంటే పార్టీలకు, గుర్తులకు జనం గౌరవించేవారు. కానీ కాలక్రమేణా … పార్టీలు… గుర్తులు… పోయి… వ్యక్తులు వచ్చారు. సేవాభావం స్థానంలో కరెన్సీ నోట్లు ఎన్నికల్లో చెలామణి కావడం ప్రారంభిచాయి. 1990వ దశకం నుంచి ఈ మార్పు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కనిపించింది. డబ్బులిచ్చి ఓట్లు వేయించుకోవడం ప్రారంభం కావడంతో కమ్యునిస్టుల పతనం ప్రారంభమయిందనే చెప్పాలి. జనం డబ్బుకు అమ్ముడు పోయారని చెప్పలేం కాని… పెరుగుతున్న ధరలు.. మారుతున్న జీవన విధానం…. ప్రజల ఆలోచనల్లో మార్పును తెచ్చాయి. దీంతో ఎన్నికలంటే డబ్బు అనే చందంగా తయారైంది. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఓటు వేయడం ప్రారంభమయింది. దీంతో
గతంలో ఈ రాష్ట్రాల్లో….
పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాల్లో వామపక్షాలకు తిరుగులేకుండా ఉండేది. అక్కడి ప్రజల సమస్యలపై పోరాటం వల్ల కానివ్వండి… ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం… వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులు… ఉపాధి కల్పన… వంటి వాటితో ప్రజల ప్రాధాన్యం కూడా మారింది. జనం ఆలోచనల్లో మార్పు వచ్చింది. పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసు వంటి నేతలు దశాబ్దాల కాలం పాటు అధికారాన్ని ఏలారు. ఆయన పేరుతోనే కామ్రేడ్లు అక్కడ అధికారంలోకి వచ్చేవారు. అలాంటి ఆ రాష్ట్రాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కమ్యునిస్టులు అన్ని పార్టీల కంటే వెనుకంజలో ఉన్నారు. త్రిపురలోనూ అంతే. ఇక కేరళ ఒక్క రాష్ట్రంలోనే అధికారంలో ఉన్నారంటే వామపక్ష పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పనవసరం లేదు.
జాతీయ హోదా సయితం…
వాస్తవానికి మొన్నటి వరకూ సీపీఐ, సీపీఎం పార్టీలు జాతీయ పార్టీలు. అయితే సీపీఐకి ఎన్నికల కమిషన్ జాతీయ పార్టీ హోదాను కూడా తొలగించింది. ఆ పార్టీ ఎక్కడా అధికారంలో లేదు. సీపీఎం మాత్రం కేరళలో అధికారంలో ఉండి ఎంతో కొంత నయం అనిపించుకుంటుంది. ఇక వామపక్ష పార్టీలు ఇలా తయారవ్వడానికి ఆ పార్టీల అగ్రనాయకత్వం వైఖరి కారణమని చెప్పక తప్పదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారి భావజాలాన్ని మార్చుకోలేదు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పు చెందలేదు. అంతేకాదు… నాట ిసిద్ధాంతాలు.. ఆశయాలను మాత్రమే నమ్ముకుని జనంలోకి వెళ్లి నవ్వుల పాలు అవుతున్నా కూడా వారి వ్యవహారశైలిలో మార్పు కన్పించలేదు.
జనానికి దూరమయి…
వామపక్ష పార్టీలు ఇప్పుడు జనానికి దూరమయ్యాయా?… ప్రజలే ఆ పార్టీలను పక్కన పెట్టాయా? అన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కునే కంటే… దేశంలో మాత్రం వాటి నామరూపాలు క్రమంగా కనుమరుగవుతున్నాయని చెప్పాల్సిందే. రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలేనంటారు. వామపక్షాల విషయంలో అది నిజమేనని పిస్తుంది. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా అప్డేట్ కాకపోవడం కూడా జనం దూరం పెట్టడానికి కారణంగా చూడాలి. ఎన్నికల్లో డబ్బులు పంచలేక పోవచ్చు. పెద్దయెత్తున ప్రచారం కోసం ఖర్చు చేయలేకపోవచ్చు. కానీ ప్రజలకు చేరువయ్యేందుకు అనేక మార్గాలున్నాయి. ఆ మార్గాలను అన్వేషించడంలో లెఫ్ట్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయి.
తోక పార్టీలుగా….
ప్రస్తుతం కామ్రేడ్ల పరిస్థితి ఎలా ఉందంటే… ఏదో ఒక పార్టీతో అంటకాగడం తప్ప మరో దారి లేకుండా పోయింది. అదీ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎలాగైనా శాసనసభల్లో తమకు ప్రాతినిధ్యం లభిస్తే చాలు అని కోరుకుంటున్నారు. అందుకే ప్రతి రాష్ట్రంలో తోక పార్టీలుగా మారిపోయాయి. లోక్సభలోనూ క్రమంగా ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తుంది. ఒకరకంగా లెఫ్ట్ పార్టీల గళం వినిపించక పోతే చట్ట సభల్లో కూడా ప్రజావాణి వినిపించిందన్న అభిప్రాయం కొందరిలో ఉన్నప్పటికీ… దానిని అందిపుచ్చుకునే విధంగా కమ్యునిస్టు పార్టీల అగ్రనాయకత్వం వ్యవహరించకపోవడం వల్లనే అసలు సమస్య తలెత్తుతుంది. పేద ప్రజల గొంతు లోక్సభ నుంచి శాసనసభ వరకూ వినిపించాలంటే వారి అవసరం జనం గుర్తించాలి. అలా జనం దృష్టిలో పడేలా తమ విధానాలను మార్చుకుంటే ఎంతో కొంత మనుగడ సాధ్యమవుతుంది. లేకుంటే.. రానున్న కాలంలో ఎర్రజెండాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి రావడం ఖాయంగా కనిపిస్తుంది.
Follow Us On : YouTube , Google News