కర్ణాటకలో అనుసరించిన స్ట్రాటజీని తెలంగాణ ఎన్నికల సమయంలో చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. అక్కడ గెలిచినట్లుగానే తెలంగాణలోనూ కాంగ్రెస్ జెండా ఎగుర వేయాలని భావిస్తుంది. అందుకోసం స్ట్రాటజీ కమిటీ తరహాలో రాహుల్ గాంధీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సీనియర్ నేతలతో పార్టీ పరిస్థితులపై చర్చించారు. కన్నడనాట హిట్ అయిన తరహాలో తెలంగాణలోనూ సూపర్ హిట్ చేయాలన్నది టెన్ జన్పథ్ ఆలోచన. అందుకే ఒంటరిగా పోటీ చేసి తాము ఇచ్చిన రాష్ట్రంలో తమ పాలన ఉండేలా చూసుకోవాలన్న ఉద్దేశ్యం కాంగ్రెస్ అగ్రనేతల్లో కనిపిస్తుంది.
ఆరు నెలలు మాత్రమే…
తెలంగాణలో ఈ ఏడాది డిసెంబరు కంటే ముందుగానే ఎన్నికలు జరగాల్సి ఉంది. డిసెంబరు నెలలో ఎన్నికలు జరిగే అవకాశముందని చెబుతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు కూడా తెలంగాణలో పర్యటించి పరిస్థితులను అంచనా వేసుకుని వెళ్లారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్తో పాటు తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే… ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం మాత్రమే ఉంది. కర్ణాటకలో ముందుగానే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. వారు వేగంగా జనంలోకి వెళ్లగలిగారు. బీజేపీ, జేడీఎస్ కంటే అధిక స్థానాల్లో కాంగ్రెస్ కర్ణాటకలో అభ్యర్థులను ఖరారు చేయగలిగింది. అయితే తెలంగాణలో మాత్రం ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు.
తొలి జాబితా సిద్ధం…
ఆరు నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వరంగల్లో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. అయితే ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు. త్వరగా అభ్యర్థులను ఖరారు చేస్తే వారు అధికార పార్టీ కంటే ముందుగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లను రాబట్టుకునే ప్రయతనం చేస్తారన్నది పార్టీ నేతల ఆలోచన. ఈ మేరకు కసరత్తు జరగాల్సి ఉంది. తెలంగాణలో సునీల్ కనుగోలు కాంగ్రెస్ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన టీం ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేసిందంటున్నారు. ఆ సర్వేల ప్రకారం 119 నియోజకవర్గాల్లో కొన్ని స్థానాలకు అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేసిందన్న వార్తలు గాంధీభవన్లో గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్కు సానుకూల వాతావరణం ఉన్నట్లు కనిపిస్తుండటంతో ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
ప్రకటన ఎప్పుడంటే?
కొన్ని కీలక నియోజకవర్గాల్లో మాత్రం ఇంకా చేరికలు ఉన్నాయంటున్నారు. అందుకే వాటిలో మాత్రం అభ్యర్థుల జాబితాను తయారు చేసినా… దానికి అధికారిక ఆమోదం పొందలేదన్నది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. తొలి జాబితాలో దాదాపు యాభై నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే కొందరి పేర్లను ఏఐసీసీ ఓకే చేసిందని అంటున్నారు. త్వరలోనే అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశముంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా త్వరలోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో కారు పార్టీ కంటే ముందుగానే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు ఢిల్లీలో సమాయత్తమవుతున్నారు. ముఖ్యమైన నియోజకవర్గాలతో తొలి జాబితా విడుదల చేసేందుకు కాంగ్రెస్ రెడీ అయిపోయింది.
Follow Us On : YouTube , Google News