ప్రపంచంలో దొంగిలించిన, దాచిపెట్టిన నిధులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి తెల్సుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ది అంబర్ రూం. 18వ శతాబ్దంలో రష్యాలోని సార్కొసెలో నగరంలో క్యాథరీన్ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా ఓ అంబర్ రూం తీర్చిదిద్దారు. అంబర్ రూం అంటే బంగారంతో నింపిన గది. కాషాయ రంగులో ఉండే ఈ గదిలో శిల్పాలు, గోడలు, తలుపులు, కిటికీలు, టేబుల్స్, పెయింటింగ్స్ అన్నీ బంగారంతో నింపేశారు. కొన్నింటికి వజ్రాలు పొదిగారు. మొత్తం 450 కిలోల బంగారం ఇందుకు వినియోగించారు.
మొత్తం దోచేసి…
ఇంత వరకూ బాగానే ఉన్నా, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సీన్ మారిపోయింది. ఆ యుద్ధంలో రష్యాను జర్మనీ ఆక్రమించింది. అదే సమయంలో క్యాథరీన్ ప్యాలెస్ కొల్లకొట్టారు జర్మనీ సైనికులు. ముఖ్యంగా అంబర్ రూం కొల్లకొట్టి అందులోని బంగారం, వజ్రాలు మొత్తం దోచేశారు. అయితే ఆ మొత్తాన్నీ జర్మనీ పట్టుకెళ్లిన సైనిక అధికారులు, తర్వాత ఏం చేశారో ఇప్పటి దాకా తెలియలేదు. ఎందుకంటే, యుద్ధం చివరిలో జర్మనీ ఓడిపోయింది. ఓ భాగం రష్యా వశమైంది. రష్యా సైన్యం ఎంత వెతికినా అంబర్ రూం బంగారం దొరకలేదు. జర్మనీ సైనిక అధికారులే ఆ బంగారాన్ని కరిగించి ఉంటారని ప్రపంచం ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే ఇప్పటి దాకా అసలు కారణం మాత్రం ఎవ్వరికీ తెలీదు.
ఆనవాలు కూడా..
ఇక మెన్ కరే పిరమిడ్. ఈజిప్టులోని గిజా నగరంలో ఉన్న పిరమిడ్ నిర్మించి దాదాపుగా 4 వేల 500 సంవత్సరాలు అవుతుంది. 1830లో ఇంగ్లీష్ మిలటరీ అధికారి హార్వాడ్ వైసే ఈ పిరమిడ్ కనిపెట్టాడు. ఓ రకంగా శాడిస్ట్ అయిన హార్వార్డ్, పిరమిడ్ మొత్తం ధ్వంసం చేశాడు. అందులోని బంగారం, వజ్రాలు దోచేశాడు. ఆ నిధి మొత్తాన్నీ 1838లో ఇంగ్లాండ్ తరలించాలని డిసైడైన హార్వార్డ్ బెట్రైస్ వ్యాపార నౌకలో ప్రయాణం అయ్యాడు. అయితే ఆ నౌక మార్గమధ్యంలో సముద్రంలో మునిగిపోయింది. ఇప్పటి దాకా దాని ఆనవాలు కూడా దొరకలేదు.
ఆచూకీ ఏదీ?
ఇక ఆర్క్ ఆఫ్ కాన్వెంట్. 1883లో విక్టోరియస్ పుస్తకంలోని ఊహాజనిత చిత్రం ఇది. హెబ్రూ భాషకు చెందిన పాత బైబిల్ నిబంధన ప్రకారం, ఈ పెట్టెలో దేవుడితో జీసెస్ చేసుకున్న ఒడంబడికలు రాసి ఉన్నాయట. దాన్ని జెరూసలేంలోని పురాతన ఆలయంలో కింగ్ సోలోమన్ దాచాడట. క్రీస్తుపూర్వం 587లో బాబిలోన్ రాజు నెబూకుడ్ నెజా టూ ఆ పురాతన ఆలయాన్ని నాశనం చేవాడట. అయితే ఇప్పటి దాకా అది నిజమా, కాదా అన్నది తేలలేదు. కనీసం ఆ పెట్టె ఆచూకీ లభించలేదు.
ఫ్లోరంటేస్ డైమండ్..
ఫ్లోరంటేస్ డైమండ్…. 137 క్యారెట్ల పసుపు రంగు వజ్రం. మన దేశానికి చెందిన ఈ వజ్రం విలువ ఇప్పటి లెక్కల ప్రకారం అయితే, దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక పోర్చుగీస్ పాలనలో గోవా ఉన్నప్పుడు ఓ నిందితుడు ఓ విచారణ అధికారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ వజ్రం పోర్చుగీస్ అధికారి ద్వారా యూరప్ దేశాలకు వెళ్లింది. ఆ సమయంలో దాన్ని ఆస్ట్రియా, హంగేరి రాజు కొన్నాడట. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి భయంతో ఆ వజ్రంతో పాటు స్విజ్టర్లాండ్ పారిపోయిన ఆ రాజు, తన వెంట ఫ్లోరంటేన్ డైమండ్ కూడా తీసుకెళ్లాడు. స్విస్ బ్యాంకులో ఆ వజ్రాన్ని భద్రం చేసిన రాజు, తన నగలతో పాటు వజ్రాన్నీ కూడా అమ్మిపెట్టాలని బ్రూనో స్టెయినర్ అనే ఆస్ట్రేలియన్ న్యాయవాదిని కోరాడు. అయితే ఆ తర్వాత ప్లోరెంటేన్ డైమండ్ ఏమైందో ఇప్పటి దాకా తెలియలేదు. కాకపోతే 1924లో మోసం చేశాడన్న ఆరోపణలతో బ్రూనో అరెస్ట్ అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఏ విషయంలో అరెస్ట్ అయిందీ, ఆ వజ్రం ఏమైంది అన్నది ఇప్పటి దాకా ప్రపంచానికి తెలియలేదు.
నాజీ గోల్డ్…
రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో తాము ఓడిపోవడం ఖాయమని నాజీలు డిసైడైన రోజులవి. దీంతో అప్పటి దాకా తాము దోచుకున్న బంగారం, వజ్రాలపై నాజీలకు భయం పట్టుకుందట. ఈ విషయంలో ముందుగా జాగ్రత్త పడిన నాజీ అధికారి కాట్ బర్నర్, తన దగ్గరున్న మొత్తం నగదును ఓ పడవలో పెట్టి సీల్ చేశాడు. తర్వాత ఆ పడవను ఆస్ట్రియాలోని టోప్లెజ్ సరస్సులో ముంచేశాడు. అప్పటి నుంచీ ఆ నిధి కోసం చాలా మంది టోప్లెజ్ సరస్సులో వెతికారే కానీ, ఏం దొరకలేదు. కనీసం ఆనవాళ్లు కూడా దొరకలేదు. నిధి కోసం వెళ్లిన చాలా మంది చనిపోయారు కూడా. ఆ నిధి దొకరడం జరిగే పని కాదని నిపుణులు చెబుతున్న మాట. ఎందుకంటే, టోప్లెజ్ సరస్సు చాలా లోతుగా ఉండటమే కాదు, దాని గర్భంలో పెద్దపెద్ద కొండలు, లోయలు ఉన్నాయి. నిధితో ఉన్న పడవ ఏ ప్రాంతంలో ఉందో తెల్సుకోవడం అందుకే కష్టమని చెబుతున్నారు.
ఆరు కిలోల మేలిమి బంగారం…
ఇక జూల్స్ రైమెట్ ట్రోఫీ. ప్రపంచ సాకర్ కప్ టోర్నీలో గెలిచిన జట్టుకు ఇచ్చేందుకు, ఆరు కిలోల మేలిమి బంగారం, విలువైన రాళ్లతో ఫ్రెంచ్ శిల్పి అబెల్ లాలెర్ తయారు చేశాడు. ప్రతి నాలుగేళ్లకు జరిగే ఈ టోర్నోలో ఎవరైతే మూడు సార్లు విజేతగా నిలుస్తారో వారికి పర్మినెంటుగా ఈ ట్రోఫీ ఇచ్చేస్తారు. తర్వాత కొత్తది తయారు చేస్తారు. సాకర్ టోర్నీ ప్రారంభం అయినప్పటి నుంచీ రెండుసార్లు ట్రోఫీ గెలిచిన బ్రెజిల్, 1970లో మూడోసారి విజయం సాధించింది. దీంతో జూల్స్ రైమెట్ ట్రోఫీని పర్మినెంటుగా బ్రెజిల్ జట్టుకు ఇచ్చేశారు. దీన్ని రాజధాని రియో డి జెనెరోలో భద్రపరిచారు. అయితే 1983లో ఈ ట్రోఫీని దొంగలు ఎత్తుకుపోయారు. ఇప్పటి దాకా దాని ఆచూకీ దొరకలేదు. ఆరు కిలోల ట్రోఫీని ఒకేసారి అమ్మడం కష్టమని భావించిన దొంగలు, దాన్ని కరిగించి ఉంటారని బ్రెజిల్ దేశం చెబుతోంది. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న సామెత వింటే ఇలాంటి సంఘటనలే గుర్తుకొస్తాయి.
Follow Us On : YouTube , Google News