మెగాస్టార్ చిరంజీవి వెండి తెరపై ఏలుతున్న హీరో. అరవై పదులు దాటినా ఇంకా చిరు మూవీల కోసం జనం క్యూ కడుతున్నారంటే ఆయన పవర్ ఏంటో చెప్పాల్సిన పనిలేదు. స్వయంకృషితో మెగా హీరోగా ఎదిగిన చిరంజీవికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కుల, మతాలతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉన్నారు. వీరికి వయసుతో కూడా సంబంధం లేదు. అరవై ఏళ్ల వయసున్న వారి నుంచి కుర్రకారు వరకూ చిరు అంటేనే ఉర్రూతలూగిపోతారు. ఇక చిరు మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు మెగా ఫ్యాన్స్కు పండగే పండగ. థియేటర్లలో కూడా పూనకాలతో ఊగిపోతుంటారు.
నెంబర్ వన్ స్థానాన్ని…
అయితే సిల్కర్ స్క్రీన్పై ఇప్పటికీ నెంబర్ 1 హీరో స్థానాన్ని పదిలం చేసుకున్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. 2009లో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి చేతులు కాల్చుకున్నారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కేవలం 18 అసెంబ్లీ స్థానాల్లోనే గెలిచింది. దీంతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి కాగలిగారు. అంతే రాష్ట్ర విభజన జరగడంతో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
జనసేన పెట్టినా…?
తన తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినా 2019 ఎన్నికల్లో బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. ఆయన తన మానాన తాను పనిచేసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్తోనూ చిరంజీవికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన సినిమా సైరా రిలీజ్ సమయంలో చిరంజీవి దంపతులు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. తర్వాత చిత్రపరిశ్రమకు సంబంధించిన టిక్కెట్ల వివాదం వంటి సమస్యలపై కూడా జగన్ ను కలిసిన సినిమా పరిశ్రమకు చెందిన వారిలో చిరంజీవి ఒకరు. అలాంటి చిరంజీవి వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు పవన్ కల్యాణ్కు మద్దతు పలుకుతున్నట్లు సంకేతాలను ఇచ్చారు. ఆయన నేరుగా చెప్పకపోయినా ప్రస్తుత ప్రభుత్వం మీద విమర్శలు చేయడంతో రాజకీయాలు కొంత తెలిసిన వారు కూడా పవన్ కు మద్దతు తెలిపే అవకాశముందని చెబుతున్నారు. రాజకీయంగా పవన్ కొంత కష్టాల్లో ఉండటం, ఈ ఎన్నికలు కీలకం కావడంతో ఆయనక మద్దతు తెలిపేందుకు చిరు ముందుకొస్తాడన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
అధికార పార్టీకి చురకలు…
వాల్తేరు వీరియ్య 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. నిజానికి వాల్తేరు వీరయ్య ఫంక్షన్కు రాజకీయాలకు సంబంధం లేకపోయినా చిరు తన మనసులో మాటను బయటపెట్టినట్లయింది. సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుతూనే ఒక్కసారిగా పొలిటికల్ టాపిక్ వైపు టర్న్ అయ్యారు. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలని, పేదవారి కడుపు నింపు దిశగా ఆలోచించాలని, అలాగయితేనే ప్రజలు ఆదరిస్తారని, అందరూ తలవంచి నమస్కరిస్తారని చిరంజీవి అనడం జగన్ ఉద్దేశించిందేనంటూ టీడీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. జనసేన నేతలు కూడా రానున్న ఎన్నికల్లో అన్నయ్య తమ పార్టీ అధినేతకు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తారంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. చిరంజీవి నేరుగా తమ్ముడికి వత్తాసుగా ముందుకు వస్తారా? లేదా ఎప్పటిలాగే తన సినిమాలకు పరిమితమవుతారా? అన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద సోషల్ మీడియాలో చిరంజీవి కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి.