హైదరాబాద్ లో పాతబస్తీకి ఎప్పటినుంచో అందరూ ఎదురు చూస్తున్న మెట్రో (Metro) రైల్ అలైన్మెంట్ పై అడుగులు ముందుకు కదిలాయి. ఆదివారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పాతబస్తీలో డ్రోన్ సర్వే చేపట్టింది. ఇమ్లిబన్ లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఫలక్ నామా మధ్య 5.5 కిలోమీటర్ల దూరం మధ్య మెట్రో లైన్ అలైనమెంట్ వేసే విషయంపై ఈ సర్వే చేశారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు ఐదు మెట్రో స్టేషన్ల ఏర్పాటుకు తాత్కాలికంగా నిర్ణయించారు..ఈ మధ్య దూరంలో దాదాపు 103 మతపరంగా సున్నితమైన ప్రాంతాలు ఉండటం తో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రార్ధనా మందిరాలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా మెట్రోలైన్ ఎలా వేయాలన్న దానిపైనే చర్చలు సాగుతున్నాయి. మెట్రో ఫేజ్-1 పనులు పూర్తయి, ఆపరేషన్స్ కూడా పూర్తయినా పాతబస్తీ మెట్రోకి మాత్రం మోక్షం కలగలేదు. పాతబస్తీలో మెట్రో నిర్మాణానికి పనులు వేగం పుంజుకున్నాయని నెల్లాళ్లలో భూ సేకరణకోసం దాదాపు వెయ్యి నిర్మాణాలు, ఆస్తుల ఓనర్లకు నోటీసులు పంపుతామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
ఎంజీబీఎస్, ఫలక్ నమా మధ్య 5 స్టేషన్లు..
ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా మధ్య వయా దారుల్ షిఫా జంక్షన్, పురానా హవేలీ, ఎట్టెబార్ చౌక్, అలీజా కొట్లా, మీర్ మొమిన్ దైరా, హరీబౌలీ, శాలిబండ, షంషేర్ గంజ్, ఆలియాబాద్ ల మీదుగా ఫలక్ నుమాకు చేరుకునేలా రూట్ ప్లాన్ చేశారు. ఈరూట్ లో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషేర్ గంజ్, ఫలక్ నుమా మధ్య అయిదు స్టేషన్లను నిర్మిస్తారు. దీనితో మెట్రో కారిడార్ -2 ప్రాజెక్ట్ లో భాగంగా జేబీఎస్ ను ఫలక్ నుమాను లింక్ చేయడం పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ కారిడార్ లో జెబీఎస్, ఎంజీబీఎస్ మధ్య మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. రోజుకు కనీసం పాతిక వేలమందికి పైగా ఈ రైళ్లలో ప్రయాణిస్తున్నారు.
చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం దాటాక 500మీటర్ల దూరంలో రెండు మెట్రో స్టేషన్లు నిర్మిస్తామని, ఆప్రాంతానికున్న చారిత్రక ప్రాముఖ్యత, ప్రాధాన్యత , నగరంలో ఆ కట్టడాలకున్న విశిష్టత రీత్యా అక్కడ రెండు స్టేషన్ల ఏర్పాటు జరగుతోందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఎంజీబీఎస్ దగ్గర పాతబస్తీలో మెట్రో ఫేజ్ వన్ నిర్మాణం పనులు రకరకాల కారణాలతో గతంలో ఆగిపోయాయి. భూసేకరణ, అత్యధిక నష్టపరిహారం కోరడం తో పాటు, మెట్రో రూట్ మార్చాలనే అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ ప్రాంతంలో చారిత్రక సంపద నిర్మాణాలు, మసీదులు ఉండటం వల్లకూడా ఇక్కడ మెట్రో ప్లానింగ్ జరగలేదు.
ప్రార్ధనా మందిరాలతోనే సమస్య (Metro)
హైదరబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ లెక్క ప్రకారం ఆ రూట్ లో 21 మసీదులు, 12 ఆలయాలు, 12అషూర్ఖానాలు, 33 దర్గాలు, ఏడు స్మశానాలు, ఆరు చిల్లాలతో కూడిన 103 మతపరమైన కట్టడాలు ఉన్నాయి. ఈ కారణంగా రైలు రూట్ ను వంపులు తిప్పి వయాడక్ట్ లను అమరుస్తూ డిజైన్ చేయాల్సి ఉంటుంది. మెట్రో పిల్లర్ లొకేషన్ల మార్పులు, ఎత్తులను అక్కడి పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. వీటిలో ఒక నాలుగు మతపరమైన నిర్మాణలను మినహాయించి మిగతా వాటన్నింటినీ సురక్షితంగా కాపాడగలిగారు.అయితే ఈ నాలుగు ప్రార్దనాలయాలను కూడా రక్షించే విధంగా డిజైనింగ్ మార్చాలని ఏ ఒక్క ప్రార్ధనాలయానికి నష్టం కలగకుండా చూడాలని సీఎం కేసీఆర్, అర్బన్ డెవలప్ మెంట్ మంత్రి కేటీఆర్ మెట్రో అధికారులను ఆదేశించారు.
ఆ ప్రార్ధనాలయాలను కాపాడాలంటే రోడ్డు వెడల్పును 80 అడుగులకు మాత్రమే కుదించాల్సి ఉంటుంది. కేవలం స్టేషన్ లొకేషన్లలో మాత్రమే120 అడుగుల మేరకు రోడ్లను వెడల్పు చేయాల్సి ఉంటుంది. ఇక మరో వెయ్యి ప్రైవేటు ఆస్తులను తొలగించి భూ సేకరణ చేయాల్సి ఉండగా అందుకు సంబంధించిన భూ సేకరణ నోటీసులు కూడా మరోనెలలో ఇవ్వనున్నారు. పాతబస్తీలో మెట్రో (Metro) కారిడార్ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్, మెట్రో అథార్టీని ఆదేశించారని కేటీఆర్ జులై9నే ట్వీట్ చేశారు.పాతబస్తీలో చేసిన డ్రోన్ సర్వే వ్లల రియల్ టైమ్ డాటా దొరుకుతుందని, 3డి మోడలింగ్ తో మెట్రో లైన్ నిర్మాణం సులభమవుతుందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.మెట్రో రైల్ నిర్మాణం పూర్తయితే పాతబస్తీకి, హైదరాబాద్ నగరానికి లింక్ ఏర్పడినట్లే..ఈ రూట్ లోనూ ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశముంది.