నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనంలో ఈ నెల 20వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆయన ఒక ట్వీట్్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలను వెల్లడించారు. ఈ ఏడాది మే 28వ తేదీన నూతనంగా నిర్మించిన పార్లమెంటును ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త పార్లమెంటులో తొలిసారి సభ సమావేశం కానుంది.
ఈ నెల 20 నుంచి…
ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 11వ తేదీ వరకూ జరగనున్నాయి. ఈ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ఇంకా నెలలు మాత్రమే గడువు ఉండటంతో అధికార, విపక్షాలు వర్షాకాల సమావేశాల్లో పైచేయి కోసం ప్రయత్నాలు చేస్తాయి. అనేక అంశాలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు విపక్షాలు, ప్రజలలో ప్రభుత్వం పట్ల ఎలాంటి అపోహలు లేకుండా ఉండేలా అధికార పార్టీ ప్రయత్నిస్తుంది. దీంతో సమావేశాలు ఈసారైనా సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదన్నది విశ్లేషకుల భావన.
కీలక బిల్లులను…
దీంతో పాటు ఈ సమావేశాలకు మరో ప్రాధాన్యం ఉంది. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టాలని అధికార బీజేపీ యోచిస్తుంది. దీనిపై కసరత్తులు కూడా చేసింది. దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనాలని విపక్షాలన్నీ ఉమ్మడి పోరాటానికి దిగుతాయన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఢిల్లీ ప్రభుత్వ ఆర్డినెన్స్ సవరణను కూడా చట్ట రూపం ఇచ్చేందుకు అధికార పార్టీ ఈ సమావేశాలను ఉపయోగించుకునే అవకాశముంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు పలు రాజకీయ పార్టీలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడి వేడిగా సాగనున్నాయి.
Follow Us On : YouTube , Google News