(MOON)
జాబిల్లిపై చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రయాన్ 3 ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో, ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఇస్రో శాస్త్రవేత్త కృషి ఫలించింది. ఉద్విగ్న క్షణాల మధ్య సేఫ్ గా ల్యాండ్ కావడంతో దేశం ఊపిరి పీల్చుకుంది. ఈ క్షణాల కోసం యావత్ భారతావని మాత్రమేకాదు, ప్రపంచంలోని శాస్ర్తవేత్తలు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ విజయంతో మన ఇస్రో శాస్ర్తవేత్తల ఘనత ప్రపంచవ్యాప్తమైంది. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాల్లో ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి. ఇప్పుడు భారత్ నాలుగో దేశంగా రికార్డు సాధించింది. మరోవైపు చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో ల్యాండర్ ను సక్సెస్ ఫుల్ గా దించిన మొదటి దేశంగా భారత్ కీర్తి పతాకను ఎగురవేసింది.
41 రోజుల ప్రయాణం…
చంద్రయాన్ 3 వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం అందులో పంపిన విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడి ఉపరితలాన్ని విజయవంతంగా ముద్దాడింది. మరో 4 గంటల తర్వాత ల్యాండర్ తలుపులు తెరుచుకొని అందులోంచి రోవర్ బయటకు వస్తుంది. 14 రోజులపాటు చంద్రుని ఉపరితలంపై ల్యాండర్, రోవర్ పరిశోధనలు జరపనున్నాయి. ఎంతో క్లిష్టమైన ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో రిస్క్ తీసుకున్న ఇస్రో శాస్ర్తవేత్తల కృషిని ప్రధాని మోడీ, రాష్ర్టపతి ద్రౌపదిముర్ముసహా పలువురు ప్రముఖులు అభినందించారు.
చివరి ఘట్టం కూడా… (MOON)
చంద్రయాన్ 3 ప్రయోగం చివరి ఘట్టం కూడా విజయవంతమయింది. వ్యోమనౌక నుంచి ఈ నెల 17న విడిపోయిన ల్యాండర్ కొద్దిసేపటి క్రితం ల్యాండ్ కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేవు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ అనేది ఎంతో క్లిష్టమైంది. దాంతో, ఏ దేశం కూడా అక్కడ ప్రయోగాలు జరిపేందుకు ఆసక్తి చూపలేదు. ఇస్రో శాస్ర్తవేత్తలు 2019లో మొదటి ప్రయత్నంగా చంద్రయాన్ 2 పేరుతో వ్యోమనౌకను పంపించారు. ఆ ప్రయోగం ద్వారా చంద్రుని కక్ష్యలోకి ఆర్బిటర్ ను చేర్చడంలో మన శాస్ర్తవేత్తలు సక్సెస్ అయ్యారు. కానీ, రోవర్ తో కూడిన ల్యాండర్ ను చంద్రుని ఉపరితలంపైకి చేర్చడంలో విఫలమయ్యారు. ఆ వైఫల్యానికి కారణాలను గుర్తించిన ఇస్రో ఈసారి ల్యాండర్ ను ల్యాండ్ చేయించడంలో పలు జాగ్రత్తలు తీసుకుంది.
ఆ దేశాల సరసన…
ఇప్పటికే అమెరికాకు చెందిన నాసా, రష్యా, చైనా కూడా చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ విషయంలో సక్సెస్ అయ్యాయి. కానీ, ఆ దేశాలకు చెందిన ల్యాండర్లు ల్యాండ్ అయింది వేరే ప్రాంతాల్లో.. అంటే.. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో సాఫ్ట్ ల్యాండింగ్ విషయంలో భారత్ స్థానం నాలుగోది అయింది. అంతేగాక దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా భారత్ మరో రికార్డును సొంతం చేసుకుంది. చంద్రయాన్ 2 ప్రయోగంలో ఎదురైన వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకున్న మన శాస్ర్తవేత్తలు ఈసారి పలు జాగ్రత్తలు తీసుకున్నారు. గత ప్రయోగంకన్నా విస్తృతమైన ల్యాండింగ్ స్థలాన్ని ఎంచుకున్నారు. ప్రమాదం జరగకుండా ఉంటుందని నిర్ధారించుకున్న 4 కిలోమీటర్ల పొడవు, 2.4 కిలోమీటర్ల వెడల్పైన స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ఈ నెల 17న విడిపోయిన ల్యాండర్ ను చంద్రుని ఉపరితలంపైకి దించే తాజా ప్రక్రియ ప్రారంభమయిన దగ్గర నుంచి కంటికి రెప్పలా దానిని సేఫ్ ల్యాండిగ్ అయ్యే వరకూ మన ఇస్రో శాస్త్రవేత్తలు చూశారు.
ఈసారి అలా… (MOON)
ఆ 17 నిమిషాల్లో విక్రమ్ ల్యాండర్ ను సాఫ్ట్ గా ల్యాండింగ్ చేయించడం కోసం ఇస్రో శాస్ర్తవేత్తలు ఈసారి దానికి కృత్రిక మేధ అంటే ఏఐతో కూడిన సాఫ్ట్ వేర్ ను అమర్చారు. దాని సహాయంతో చంద్రునిపై దిగాల్సిన నిర్దేశిత స్థలంలో అనుకూల ప్రాంతాన్ని ల్యాండర్ స్వయంగా వెతుకుంది. ఆ సమయంలో భూమిపై నుంచి సిగ్నల్స్ పంపడం వీలు కాదు. ఎందుకంటే.. ల్యాండర్ వేగాన్ని క్షణ, క్షణానికీ మార్చాల్సి ఉంటుంది. అంత వేగంగా భూమిపై నుంచి సిగ్నల్స్ పంపడం సాధ్యం కాదు. అందుకే ఈసారి ఏఐ సాఫ్ట్ వేర్ ను ల్యాండర్ లో సెట్ చేశారు. ఏఐ సాయంతో రాళ్లు, గుంటలులేని అనుకూల ప్రాంతాన్ని ఎంచుకొని ల్యాండర్ దిగేలా సెట్ చేశారు.
దశల వారీగా…
చంద్రునికి 25 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ కక్ష్యలో తిరిగే ల్యాండర్ చంద్రుని ఉపరితలం దిశగా 1.68 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ సమయంలో తనకుతానుగా రెండు ఇంజిన్లను ఆపివేసి, మరో రెండు ఇంజిన్లను మాత్రమే మండించుకుంటూ వేగాన్ని తగ్గించుకుంటుంది. దీనిని రఫ్ బ్రేకింగ్ దశ అంటారు. ఈ దశలో ల్యాండర్ హారిజంటల్ గా ఉంటుంది. ఈ ప్రక్రియ 11 నిమిషాలపాటు సాగుతుంది. తర్వాత కొన్ని విన్యాసాల అనంతరం ల్యాండర్ తన ప్రయాణాన్ని నిలువుగా అంటే 90 డిగ్రీల వంపులోకి మార్చుకుంటుంది. దీంతో, ఫైన్ బ్రేకింగ్ దశ ప్రారంభమవుతుంది. ఈ దశలోనే చంద్రయాన్ 2 ద్వారా పంపిన విక్రమ్ ల్యాండర్ అదుపు తప్పి కూలిపోయింది. అందుకే దీనిని కీలక దశగా ఇస్రో శాస్ర్తవేత్తలు గుర్తించారు. మొత్తం మీద సేఫ్ ల్యాండింగ్ కావడంతో దేశం ప్రపంచ దేశాల ఎదుట రొమ్ము విరుచుకునేలా నిలబడగలిగింది. మన శాస్త్రవేత్తలను అభినందించి తీరాల్సిందే. దేశం మొత్తం ఇస్రో సైంటిస్ట్ లకు సలామ్ కొట్టాల్సిందే. జయహో… ఇస్రో.(MOON)