బీఆర్ ఎస్ లో టిక్కెట్ ఆశించి భంగపడిన నేతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. బీఆర్ ఎస్ సీనియర్ నేత మోత్కుపల్లి (Motkupalli) నర్సింహులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావులకు బీఆర్ ఎస్ అధినేత మొండిచేయి చూపడంతో వారు తీవ్ర నిరాశా నిస్ప్రుహలలో ఉన్నారు. ఆలేరు నుంచి ఆరుసార్లు గెలుపొందిన మోత్కుపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ కేటాయిస్తారనే ధీమాలోనే ఉన్నారు.. ఇండిపెండెంట్ అభ్యర్ధిగా తన కెరీర్ ప్రారంభించిన మోత్కుపల్లి తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంతో ఎన్టీఆర్ వెంట నడిచారు.ఎన్టీఆర్ అనుచరుడిగా పేరుపడ్డారు. టీడీపీ పగ్గాలు చంద్రబాబు తీసుకున్నటైమ్ లోనూ మోత్కుపల్లి ఎన్టీఆర్ వెంటే నిలిచారు.
ఆ తర్వాత టీడీపీలోనే కొనసాగారు. విభజన తర్వాత టీడీపీ తెలంగాణలో కుప్పకూలడం తుమ్మల, ఎల్. వి. రమణ లాంటి నేతలంతా టీఆర్ ఎస్ లో చేరిపోవడంతో మోత్కుపల్లి (Motkupalli) ఒంటరిగా ఉండిపోయారు. ఉనికిలేని టీడీపీలో కొనసాగలేక, టీఆర్ ఎస్ నుంచి పిలుపు రాక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి పోయారు.అక్కడా ఆయనకు సరైన గుర్తింపు లేకపోవడంతో అక్కడ నుంచి బీజేపీకి మారారు.. బీజేపీలోనూ మోత్కు పల్లికి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు స్కీమ్ పట్ల ఆకర్షితుడై 2021 అక్టోబర్ లో ఆయన బీఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.
దళిత సంక్షేమం కేసీఆర్ తోనే సాధ్యమని పొగడుతూ ఆకాశానికెత్తేశారు..దళిత బంధుపై కేసీఆర్ మోత్కుపల్లి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. కానీ ఆ తర్వాతే ఏమైందో కేసీఆర్ ఆయన్ను పట్టించుకోవడం మానేశారు..గత ఆరునెలలుగా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఆయన అవమానంగా ఫీలవుతున్నారు.. పార్టీలో చేరిన కొత్తలోఎమ్మెల్సీ లేదా కనీసం కేబినెట్ పదవి ఇస్తారని ఆశపడ్డారు.. కానీ రెండేళ్లు గడుస్తున్నా కేసీఆర్ పదవి ఇవ్వకపోగా.. కనీసం పిలిచి ఊరడింపు మాటలు కూడా మాట్లాడకపోవడం ఇప్పుడు టిక్కెట్ కూడా కేటాయించకపోవడం మోత్కుపల్లిని తీవ్ర నిరాశకు గురి చేసింది. కేసీఆర్ తనను పిలిచి ఏదో ఒక హామీ అయినా ఇవ్వక పోవడం కనీసం ఊరడింపు మాటలు మాట్లాడక పోవడంపై మోత్కుపల్లి అసహనంతో ఉన్నారు. పైగా మంత్రివర్గాన్ని విస్తరించి పట్నం మహేందర్ రెడ్డికి చోటు కల్పించడం, దళితుడైనా తనకు ఎలాంటి అవకాశం కల్పించకపోవడంతో ఆయన నిరాశలో ఉన్నారు.
పార్టీ మారతారా? (Motkupalli)
బీఆర్ ఎస్ కు రాష్ట్రంలో ఎదురుగాలి వీస్తోందన్న సంకేతాలు రావడం, కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా ఉందన్న వార్తల నేపధ్యంలో మోత్కుపల్లి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.ఈ సారి ఎలాగైనా బరిలో నిలవా లన్న పట్టుదలతో ఉన్న ఆయన తొందరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తన సొంత నియోజక వర్గమైన ఆలేరు నుంచే అవసరమైతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలనే పట్టుదలతో ఉన్నారు.. తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను నిర్ణయించుకోవడం కోసం ఆయన యాదగిరి గుట్టలో తన అనుచరులతో సమావేశ మవుతున్నారు. గత కొన్ని రోజులుగా తన నియోజక వర్గంలో అనుచరులతో తరచుగా సమావేశాలు నిర్వహించడం చూస్తుంటే ఆయన బీఆర్ఎస్ లో కొనసాగుతారా అన్న సందేహాలు వ్యక్తమ వుతున్నాయి.