కాంగ్రెస్ పార్టీలో అసమ్మతివాదిగా అప్పుడప్పుడు కస్సుబుస్సులాడే కోమటి రెడ్డి వెంకటరెడ్డి(MP) తాజాగా స్వరం మార్చారు.అధిష్టానంనుంచి ఏం సంకేతాలు అందాయో ఏమో ఒక్కసారిగా కూల్ అయిపోయారు. సామాజిక సమీకరణాలలో భాగంగా అవసరమైతే తన నియోజక వర్గం మార్చుకోడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. అవసరమైతే నల్లగొండ కాకుండా మరెక్కడినుంచైనా పోటీకి తాను సిద్ధమని కోమటిరెడ్డి ప్రకటించారు. తనపై సోషల్ మీడియాలో ఎవరెవరో ఏవేవో రాస్తున్నారని వాటితో తనకెలాంటి సంబంధమూ లేదని తేల్చేశారు. ఎవరేమనుకున్నా తనకు సంబంధం లేదని ఒకస్టార్ కాంపెయినర్ గా తన పని తాను చేసుకుపోతానని వెంకటరెడ్డి ప్రకటించారు.
సొంత పార్టీపై కోపం లేదు (MP)
కాంగ్రెస్ లో అప్పుడప్పుడు అలకబూనే కోమటిరెడ్డి పార్టీపై తనకెలాంటికోపం లేదన్నారు.. తన కోపమంతా కేసీఆర్ మీదనేనని ఆ నియంత పాలనకు తెర దించినప్పుడే తనకు మనశ్శాంతి అని ప్రకటించారు. హోం గార్డు రవీందర్ మరణించడం చాలా దురదృష్టకరమని ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్య అని కామెంట్ చేశారు.
హరీష్ రావుకు కోమటిరెడ్డి సవాల్ (MP)
వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలపైనా కోమటిరెడ్డి మండి పడ్డారు.. సిద్దిపేట,సిరిసిల్ల, గజ్వేల్ ఎక్కడైనా సరే వ్యవసాయానికి 15 గంటల కరెంట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావుకి సవాల్ విసిరారు.కొంగర కలాన్ లో జరిగే మీటింగ్ కేసీఆర్ ను ఇంటికి సాగనంపడానికి జరిపేదేనన్నారు. గతంలో సోనియా గాంధీవల్లే తెలంగాణ వచ్చిందని ఒప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు తన వల్లే వచ్చిందని చెప్పుకుంటున్నారన్నారు.
సోనియా సభను సక్సెస్ చేయండి
ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని కోమటిరెడ్డి అన్నారు. ఈనెల17న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభను ప్రజలంతా సక్సెస్ చేయాలని కోరారు. తాము 4 వేలు రూపాయల పెన్షన్లు ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని అవి కాంగ్రెస్ హయాంలో 400 రూపాయల పెన్షన్ తో సమానమని అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎంపీ కోమటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
అలకకి కారణమిదే…
కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యుసితో పాటు ముఖ్య కమిటీలు వేటిలోనూ చోటు కల్పించకపోవడం పట్ల కోమటిరెడ్డి(MP) కొన్ని రోజుల క్రితం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.తాను సీఎం అభ్యర్ధిని కానని,పార్టీకి సేవ చేస్తానని గతంలోనే కోమటి రెడ్డి క్లారిటీ ఇచ్చారు.తీరా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల్లో కూడా తనకు చోటు కల్పించకపోవడం ఆయనకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కోమటి రెడ్డి అలకను గమనించిన అధిష్టానం దిద్దబాటు చర్యలకు పూనుకుంది. రెండు రోజుల క్రితం ఆయన్ను ఏఐసీసీ కార్యదర్శి సంపత్, టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఇంటికెళ్లి కలిశారు. ఆయన అసంతృప్తిని హై కమాండ్ కు తెలియచేస్తామని ఓపిక వహించాలని కోరారు.అయినా కోమటి రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో సీనియర్ కార్యదర్శి కే.సి. వేణుగోపాల్ తో ఫోన్ లో మాట్లాడించారు. అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని, అంతేతప్ప అది సీనియర్ నేత పట్ల నిర్లక్ష్యంకాదని భరోసా ఇచ్చారు.దాంతో వెంకటరెడ్డి దిగొచ్చారు. త్వరలోనే కోమటిరెడ్డికి ఏదైనా పదవి లేదా హోదాని హై కమాండ్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.