Murder with Snake
ఒడిశాలోని గంజాం జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భార్యమీద కోపంతో ఒక వ్యక్తి అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. బుర్ర నిండా విషం నింపుకున్న ఆ వ్యక్తి తన భార్య నిద్రిస్తున్న గదిలోకి పాముని వదిలాడు. ఇదే సమయంలో ఆ గదిలో అతడి భార్యతో పాటు రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. దీంతో పాము ఇద్దరినీ కాటువేసింది. గదిలోకి పామును వదిలి భార్య, కుమార్తె హత్యకు కారకుడైన ఆ వ్యక్తి నెలన్నర పాటు ఏమీ ఎరుగనట్టు నాటకాలాడాడు.. అయితే ఇలాంటి నాటకాలు ఎంతో కాలం దాగోవు. అందుకే టైమ్ బ్యాడ్ అయ్యేసరికి పట్టుబడిపోయాడు.
హత్యకు దారి తీసిన అనుమానం Murder with Snake
గంజాం జిల్లా కబీ సూర్యనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధెర్బార్ గ్రామానికి చెందిన బి.ఖలీ పాత్ర…తన రెండో కుమార్తె బసంతి పాత్రను అదే గ్రామానికి చెందిన కె. గణేశ్ పాత్రకు ఇచ్చి 2020 లో వివాహం చేశారు. బసంతి, గణేశ్ లకు రెండేళ్ల కుమార్తె ఉంది. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న గణేశ్ ఆమెతో తరచూ గొడవలు పడేవాడు. దీంతో బార్య బసంతి తన భర్తపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు గణేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ పై విడుదలైన గణేశ్ తన భార్యతో కలిసి జీవించడం ప్రారంభించాడు అయితే తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని బసంతిపై ఒత్తిడి తెచ్చేవాడు. లేదంటే ఆమెను రెండేళ్ల కుమార్తెను చంపేస్తానని బెదిరించేవాడు.
విష సర్పాన్ని కొనుగోలు చేసి పధకం ప్రకారం హత్య……
ఈ క్రమంలోనే పూజలు చేస్తానని మాయ మాటలు చెప్పి పాములు పట్టే వ్యక్తి వద్ద నుంచి ఒక సర్పాన్ని కొన్నాడు గణేశ్. రాత్రి తన భార్య కుమార్తె నిద్రిస్తుండగా వారిపై విషసర్పాన్ని విడిచిపెట్టావడు. పాము కాటు వేయడం వల్ల వారిద్దరూ అపస్మారక స్ధతికి చేరుకున్నారు. తన పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన గణేశ్ ఏమీ తెలియనట్టుగా పడుకున్నాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో భార్యను, పిల్లను చూసి పెద్దగా కేకలు వేశాడు.ఆ అరుపులు విని చుట్టుపక్కల వారంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు. తన భార్య, కుమార్తెకు పాము కాటు వేసినట్లుగా అందరినీ నమ్మించడానికి ప్రయత్నించాడు.
పాముకాటుకు తల్లి కుమార్తె బలి…… Murder with Snake
ఆసమయంలోనే బసంతి తండ్రి ఇంటిలోకి వెళ్లి చూడగా ఆ సమయంలో పామును గణేశ్ కర్రతో కొడుతున్నట్లుగా కనిపించాడు. అతని పక్కనే కుమార్తె, మనవరాలు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారిద్దరినీ 108 అంబులెన్స్ సహాయంతో చికిత్స నిమిత్తం హింజిలికట్టు ఆసుపత్రిలో చేర్పించారు.అప్పటికే వారిద్దరూ చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు.ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం తరలించారు.
స్నేక్ హెల్ప్ లైన్ సహయం కోరిన పోలీసులు……
ఘటన జరిగిన 5 రోజుల తర్వాత పోలీసులకు మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తనకేం తెలియదన్నట్టు నటించిన నిందితుడు చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి నిజం ఒప్పుకున్నాడు.పాములు పట్టే వ్యక్తి వద్ద విషసర్పాన్ని కొనుగోలు చేసి భార్య, కుమార్తెలకు కాటు వేయించినట్లుగా నిందితుడు పోలీసులకు తెలిపాడు.ఐదుగురు సభ్యుల బృందం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా నిందితుడు గణేశ్ గా నిర్ధారించి అతనిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.