విజయనగరంలో విషాదం !!! (Mystery)
విజయనగరం జిల్లా శృంగవరపుకోట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు నూతిలో పడి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన సోమవారం అర్థ రాత్రి జరుగగా ఇవాళ వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లా చింతలపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బావిలో పడి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. మృతులు విశాఖ జిల్లా మర్రిపాలెంకు చెందిన మహముద్దీన్, షరీష నిషా, ఫాతిమా జహారగా గుర్తించారు. కొత్తవలస మండలం చింతలపాలెం అనే గ్రామంలో వ్యవసాయ బావిలో వీరు దూకినట్లు తెలుస్తోంది.
మృతులు మర్రిపాలెంలో నివాసం
ఎం.డీ మొహినుద్దీన్ తన కుటుంబంతో కలిసి విశాఖలోని మర్రిపాలెం పరిధిలోని ఎఫ్సీఐ నగర్లో నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం భార్య సంషినిషా, కుమార్తె ఫాతిమా జహీదా, కుమారుడు అలీతో కలిసి కొత్తవలస సమీపంలోని చింతపాలెం వెళ్లారు. అక్కడ వారు ఒక స్థలం చూసినట్లు తెలుస్తోంది. అది కొనేందుకు వెళ్లారా లేక మరేఇతర కారణాలతో వెళ్లారన్నది తెలియరాలేదు.
ఎవరి హస్తం? (Mystery)
ఈ ఘటనలో మొహినుద్దీన్, అతడి భార్య సంషినిషా, కుమార్తె జహీదా చనిపోగా.. కుమారుడు అలీ ఘటనా స్థలంలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడినట్లయ్యింది. కుటుంబం మొత్తం ఒకేసారి బావిలో ఎందుకు దూకారు? లేదా ఎవరైనా వీరిని హత్య చేసి బావిలో పడేశారా? లేక మరేదైనా కుట్ర కోణం ఉందా అన్నది అర్ధం కావడం లేదు.
కుమారుడు వచ్చే లోపే ఆత్మహత్య
కొత్త వలసలో లో స్థలం చూసేందుకు వెళ్లిన కుటుంబం అక్కడనుంచే కుమారుడు ఆలీకి లొకేషన్ ఎందుకు షేర్ చేసింది? కొత్త వలస వరకూ ఈ కుటుంబం క్యాబ్ లో వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే ఏం జరిగిందో ఏమో వారంతా కుమారుడికి ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. కుమారుడు ఇక్కడకి చేరేలోపే వారంతా నూతిలోకి దూకినట్లు సమాచారం. దీనిలో భార్య, భర్త మృతదేహాలు బయటకు తేలగా, కుమార్తె మృతదేహం ఇంకా బయటకు రాలేదు.
నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం
సంఘటన జరిగిన ప్రాంతం శృంగవరపు కోట, కొత్తవలస మండలం, చింతలపాలెం గ్రామ పొలాల్లో ఉన్న వ్యవసాయ బావి కావడం .. అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో అసలేం జరిగిందో అర్ధం కాని పరిస్థితి.. భార్య, భర్త మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు కుమార్తె మృత దేహం కోసం గాలిస్తున్నారు. కుటుంబంలో మిగిలిన ఒకే ఒక్కడు ఆలీ నోరు తెరిస్తే తప్ప అసలేం జరిగిందో తెలిసే ఆస్కారం లేదు. తాను వచ్చే లోపే తనకు ఫోన్ లో మెస్సేజ్ పెట్టి వారంతా ఆత్మహత్య చేసుకున్నారని ఆలీ చెబుతున్నాడు. సంఘటనపై సీఐ చంద్రశేఖర్ వివరాలు సేకరిస్తున్నారు. మృతుల మరణానికి అసలు కారణం తెలిస్తే తప్ప ఈ మిస్టరీ వీడే ఆస్కారం కనిపించడం లేదు. మొత్తానికి ఊరుకాని ఊరు వచ్చి ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.