నెల్లూరు: టీడీపీ అధినేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర విజయవంతంగా 150 రోజులకు చేరుకుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ అల్లూరు చేరుకున్న లోకేష్కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో యువనాయకుడు పాల్గొన్నారు. అల్లూరులో లోకేష్ను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి చేరుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలు ఎక్కి లోకేష్కు స్వాగతం పలుకుతున్నారు. మహిళలు, యువకులు, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులను యువనేత కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. చెత్త ట్యాక్స్, బోర్డు ట్యాక్స్, వృత్తిపన్ను అంటూ వ్యాపారులను వైసీపీ ప్రభుత్వం వేధిస్తున్నదని, టీడీపీ ప్రభుత్వం రాగానే తమపై భారం తగ్గించాలని వ్యాపారులు లోకేష్ ను కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. జగన్ పెంచిన పన్నులన్నీ తగ్గిస్తామన్నారు. పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని కూడా తగ్గిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
జగనోరా వైరస్ పోవాలి..
150వ రోజు అల్లూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యాత్రకు స్థానిక ప్రజలు, టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అల్లూరులో టీడీపీ (TDP) శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ లోకేశ్ (Nara Lokesh) పాదయాత్ర ముందుకు సాగింది. యువగళం యాత్ర చేపట్టి 150 రోజులు పూర్తయిన సందర్భంగా లోకేశ్ తన సందేశాన్ని వెలువరించారు. నాలుగేళ్ల క్రితం జనం ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన జగనోరా వైరస్ సోకిందని విమర్శించారు. అభివృద్ధి లేదు, విధ్వంసం తీవ్రమైంది, ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం దోపిడీ దొంగల తీరుగా మారిందంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశారని అన్నారు. సైకో పాలకులపై ప్రజల్ని చైతన్యం చేయడానికి సరిగ్గా ఐదు నెలల క్రితం కుప్పంలో తొలి అడుగు వేశాను. నా యువగళం.. జనగళమైందని లోకేశ్ అన్నారు. యువత తమ భవితకోసం సైన్యమై నా వెంట నడుస్తున్నారు. ప్రజల కష్టాలు చూశాను. కన్నీళ్లు తుడిచానని అన్నారు. అడుగడుగునా అడ్డంకులు, సైకో సర్కారు వేధింపులను అధిగమించి యువగళం పాదయాత్రని జనం జైత్రయాత్ర చేశారని ప్రజలకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.