“ఇండియా” కూటమి ఏర్పడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వరసగా ఆ కూటమిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ నరేంద్ర మోదీ “ఇండియా” కూటమిపై మండి పడ్డారు. అవిశ్వాసం చర్చ సందర్భంగా బీజేపీ పార్లమెంటు సభ్యులు అనుసరించాల్సిన వ్యూహాన్ని ప్రధాని మోదీ వారికి దిశా నిర్దేశం చేశారు. బీజేపీ పార్లమెంటు ఆవరణలో జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ దానిని అహంకారుల కూటమిగా అభివర్ణించారు.
అహంకారులను…
అహంకారులను ఐక్యంగా ఎలలా ఎదుర్కొనాలో ఆయన పార్లమెంటు సభ్యులకు తెలిపారు. విపక్ష కూటమి లేని పోని విషయాలపై రాద్ధాంతం చేస్తుందన్నారు. రాజ్యసభలోనూ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందడంపై మోదీ బీజేపీ ఎంపీలను అభినందిస్తూనే విపక్ష కూటమి మీద మాత్రం మండి పడ్డారు. కూటమి అవిశ్వాసం ఎందుకు పెట్టిందో తెలపాలని ఆయన ప్రశ్నించారు. తమలో ఉన్న అనైక్యతను కప్పిపుచ్చుకునేందుకే “ఇండియా” కూటమి అవిశ్వాసాన్ని ముందుకు తీసుకు వచ్చిందన్నారు.
ప్రయోజనం లేదని తెలిసినా…
అవిశ్వాసం వల్ల ప్రయోజనం లేదని తెలిసినా దానిని సభ ముందుకు తీసుకొచ్చారంటే ఎలాంటి వ్యూహంతో వారున్నారో ప్రజలకు అర్థమవుతుందన్నారు. దాని వల్ల వారికి ఒరిగే ప్రయోజనం లేదన్నారు. ఈ అవిశ్వాసంతో వారిలోని ఐక్యతకు పరీక్ష అని ప్రధాని మోదీ అన్నారు. వారి అంతర్గత విశ్వాసానికి పరీక్ష మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం కాదని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీలందరూ సమర్థవంతంగా విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని ఆయన సమావేశంలో పిలుపు నిచ్చారు.