డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ Navdeep కు హైకోర్ట్ షాకిచ్చింది. నార్కోటిక్స్ సెక్షన్ 41 (A) కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.చట్టానికి దొరక్కుండా తప్పించుకు తిరగడం పట్ల కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు సహకరించకపోతే నోటీసులిచ్చి అరెస్టు చేయవచ్చునంటూ ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు నవదీప్ సహకరించకపోతే అరెస్టు తప్పదని నార్కోటిక్ పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు వినిపించిన దగ్గర నుంచి ఈ హీరో అజ్నాతంలోకి వెళ్లిపోయాడు. తనకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్నాడు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు వినిపించినప్పటినుంచి పరారీలోకి వెళ్లిన నవదీప్ హై కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. దాంతో కోర్టు ఈనెల 19 వరకూ అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయితే 19వ తేదీ దాటిపోయినా విచారణకు రాకుండా, పోలీసులకు సహకరించకుండా నవదీప్ అజ్నాతంలోకి వెళ్లిపోవడం పై కోర్టు సీరియస్ అయ్యింది. ఈ కేసులో నవదీప్ ను ఏ 29వ నిందితుడుగా నమోదు చేశారు. మరో వైపు మాదాపూర్ డ్రగ్స్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
చౌదరి కాల్ లిస్ట్ లో సెలబ్రిటీల పేర్లు
ఈ వ్యవహారంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, బడా బాబులకు డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియా వ్యక్తులతో సంబంధాలున్నట్లు విచారణలో వెల్లడైంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్టయిన ముగ్గురు నైజీరియన్లు, సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు. వీరిని విచారించగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. సినీ నిర్మాత కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో బిగ్ బాస్ ఫేమ్ ఆంషు రెడ్డితో పాటు, నటి జ్యోతి, సురేఖా వాణి లాంటి నటీమణులతో కేపీ చౌదరి సన్నిహితంగా ఉన్న ఫోటోలు దొరికాయి. అయితే సెలబ్రిటీలకు తాను డ్రగ్స్ అమ్మలేదంటున్నారు కే.పీ. చౌదరి. ఫోన్ నెంబర్లు ఉన్నంత మాత్రాన డ్రగ్స్ అమ్మినట్లు కాదని ఆయన వాదిస్తున్నారు. మొత్తం 12 మంది పేర్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.రఘుతేజా, బెజవాడ భరత్, శ్వేత, సనా మిశ్ర ఇలా చాలామంది పేర్లు కేపీ చౌదరి కాల్ లిస్టులో ఉండగా వాటితో తమకెలాంటి సంబంధం లేదంటున్నారు ఆ సెలబ్రిటీలు.
తీగ లాగితే కదిలిన డొంక Navdeep
కె.పీ చౌదరి ఇటీవల గోవానుంచి డ్రగ్స్ తీసుకొస్తూ పట్టుబడ్డాడు.గోవా నుంచి 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకు రాగా అందులో 90 ప్యాకెట్లు పోలీసులు సీజ్ చేశారు.మిగిలిన పది ప్యాకెట్లు ఎవరికి అమ్మారన్న దానిపై ఆరా తీయగా టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే వారెవరూ తమకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. మరోవైపు నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి రేవ్ పార్టీలకు, సినీ రాజకీయ మిత్రులను ఆహ్వానించడం, మత్తు పదార్ధాలు ఎరవేసి బీటెక్ స్టూడెంట్లు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, కాలేజీ విద్యార్ధులను టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ ఊబిలోకి అరెస్టయిన నిందితులు లాగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రముఖుల పరిచయాలను అడ్డు పెట్టుకుని సినీ నిర్మాతలుగా అవతారమెత్తి చాపకింద నీరులా డ్రగ్స్ అమ్ముకుంటున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. బాలాజీ, రాం కిశర్, కల్హర్ రెడ్డి ఫోన్ డేటాలలో కూడా అనేక మంది సినీరంగ ప్రముఖుల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయని పోలీసులు అంటున్నారు. మాదాపూర్, గచ్చిబౌలిలో అపార్టుమెంట్లు తీసుకుని రేవ్ పార్టీలు నిర్వహించడం, డ్రగ్స్ మత్తులో ఉన్న అమ్మాయిలను సరఫరా చేయడం లాంటి అసాంఘీక కార్యకలాపాలకు నిందితులు పాల్పడుతున్నారు. మాదాపూర్ కేసులో నవదీప్ సన్నిహితుడు రాం చంద్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు అడుగు ముందుకేశారు.