నేపాల్ ను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదైన భూకంపం ధాటికి అనేక చోట్ల బిల్డింగులు బీటలు వారాయి. నేపాల్ లో వచ్చిన ప్రకంపనలు ఇటు మన ఉత్తర భారతాన్ని బలంగా తాకాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్ పరిసర ప్రాంతాలు స్వల్ప భూ కంపంతో వణికిపోయాయి. జాతీయ సిస్మాలజీ కేంద్రం సమాచారం ప్రకారం నేపాల్ లో కాసేపటి క్రితం అంటే 2.51 నిమిషాలకు భూమిలో ఐదు కిలోమీటర్ల అడుగున భూమి కంపించింది.
మొదట నేపాల్ లో 2.25 నిమిషాలకు భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేల్ పై అది 6.2 గా నమోదైంది. ఆవెంటనే కొన్ని నిమిషాల తర్వాత అంటే 2.51నిమిషాలకు భూమికి ఐదు కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్ పై 6.2గా మరోసారి భూప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ప్రకంపనలు ఢిల్లీ,నోయిడా, ఉత్తరాఖండ్ లలోకూడా కనిపించాయి.
హర్యానాలోని గురుగావ్, యూపీలోని లక్నో, రాజస్థాన్లోని జయపూర్, చండీగఢ్ లలో భూ ప్రకంపనలు కనిపించాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్, నోయిడాలలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉత్తర భారంతో పలుచోట్ల భూకంపం ప్రభావం బాగా కనిపించింది.
భయంతో వణికిన ఢిల్లీ… 6.2
ఢిల్లీలో భూ కంపం ప్రభావం బాగా కనిపించింది. అసలే ఆ ప్రాంతం హై రిస్క్ జోన్ లో ఉంది. జియాలజిస్టుల కథనం ప్రకారం ఢిల్లీ పరిసరాలు తీవ్ర భూకంప కేంద్రాలుగా నమోదయ్యాయి. భూకంపాల ప్రభావం, తీవ్రత ఆధారంగా మన దేశానికి భూకంప రిస్క్ ను నాలుగు జోన్లుగా డివైడ్ చేశారు. దాని ప్రకారం ఢిల్లీ, పరిసరాలున్న సిస్మిక్ జోన్ 4 చాలా ప్రమాదకరమైన ప్రాంతం. దీనిని హై రిస్క్ జోన్ గా పరిగణిస్తారు.
భయంతో బయటకు పరుగులు
అసలే వీకెండ్ ఎంజాయ్ మెంట్ పూర్తి చేసుకుని విధులకు హాజరైన ఉద్యోగులు భూకంపానికి వణికిపోయారు. ఢిల్లీ, ఎన్ సీఆర్ పరిసర ప్రాంతాల్లో ఆఫీసులనుంచి మిట్ట మధ్యాహ్నం ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. పైగా నిమిషాల వ్యవధిలో రెండు, మూడు సార్లు కంపించడంతో మరింత బెంబేలెత్తిపోయారు. మొదటిసారి వచ్చిన ప్రకంపనల భూ కంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్ లో ఉండగా, రెండోసారి వచ్చిన ప్రకంపనల కేంద్రం నేపాల్ లో ఉంది.
మొదటిసారి 2.28నిమిషాలకు ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదవగా, రెండోసారి 2.51 నిమిషాలకు ప్రకంపనల తీవ్రత 6.2గా నమోదైంది. తమ భవనాలు, కార్యాలయాలు కంపించడంతో బయటకు పరుగులు తీసిన జనం ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో బంధించారు. ఫ్యానులు, లైట్లు కదులుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్ట్ అవుతున్నాయి. చాలా ఆఫీసుల్లో సైరన్లు మోగించి మరీ ఉద్యోగులను బయటకు పంపారు. చాలా మంది సిబ్బంది భవనాలను ఖాళీ చేసేశారు. ఢిల్లీకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నో లో కూడా ప్రకంపనలు కనిపించాయి. ఢిల్లీ పోలీసులు అలెర్ట్ సైరన్ మోగించడమే కాక సోషల్ మీడియాలో కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలు గుప్పించారు. డియర్ ఢిల్లీ పీపుల్ బీ కేర్ ఫుల్ అంటూ సంక్షిప్త సందేశాలు పంపారు.