Nepal
నేపాల్ ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై 6.4గా నమోదైన ఆ భూకంపం అనేక భవనాలను నేలమట్టం చేసేసింది. శుక్రవారం రాత్రి 11 -12 గంటల మధ్య ప్రకంపనలు రేగాయి. ఈ ప్రకంపనల ప్రభావం ఇటు ఢిల్లీపై కూడా పడింది. నేపాల్ లో భూకంపం కారణంగా 139 మంది చనిపోగా, కనీసం వంద మంది గాయపడ్డారు.
నేపాల్ లోని జజర్ కోట్ ప్రాంతంలోని రామీ దందా దగ్గర భూ కంపం కేంద్రం ఉన్ట్నట్లుగా గుర్తించారు. వాయవ్య నేపాల్ మారుమూల పర్వత ప్రాంతాల్లో ఈ భూ కంపం చోటు చేసుకుంది. జజర్ కోట్, రుకుమ్ ప్రాంతాలు భూ కంపం ధాటికి నామరూపాలు లేకుండా నేలమట్టమైపోయాయి. జజర్ కోట్ లో 92 మంది చనిపోగా, రుకుమ్ ఏరియాలో 40 మంది చనిపోయారని నేపాల్ హోం శాఖ ప్రకటించింది. నేపాల్ ఆర్మీ అధికారులు, పోలీసు అధికారులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. భూ కంప ప్రభావిత ప్రాంతాలు చాలా దూరంగా ఉండటం, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అధికారులు అక్కడకు చేరడం ఆలస్యమవుతోంది. భవనాలు కుప్పకూలి రోడ్లు మూసుకుపోవడంతో సిబ్బంది అక్కడకు చేరడం కష్టమవుతోంది.
బీహార్ లోనూ ప్రభావం
నేపాల్ లో భూకంప ప్రభావం ఇటు బీహార్ లోనూ కనిపించింది. బీహార్ లోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. పాట్నా, కథియార్, మోతీహరిలతో పాటు మరికొన్ని జిల్లల్లో భారత, నేపాల్ సరిహద్దుల్లోనూ ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తినష్టం పెద్దగా లేవని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది.
ప్రధాని సంతాపం…
నేపాల్ లో భారీ భూకంపం రావడం పట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. నేపాల్ ప్రజలకు తోడుగా ఉంటామని, సహాయ చర్యలకు సహకరిస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నాం.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
నేపాల్ ప్రధాని పర్యటన Nepal
భూ కంప ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు నేపాల్ ప్రధని పుష్పకమాల్ దహల్ ప్రచండ బయల్దేరారు. వైద్య సిబ్బంది, బృందాలు కూడా ఆయన వెంట వెళ్లాయి. సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. నేపాల్ ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి.
ఢిల్లీలో భయంతో వణికిన జనం
నేపాల్ లో భూ కంప కేంద్రానికి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీలోనూ ఆ ప్రకంపనల ప్రభావం తీవ్రంగానే కనిపించింది. ప్రజలందరూ పడుకునే వేళ ఇంటి పరిసరాలు, ఫ్యాన్లు కదిలిపోవడం, వస్తువులు కింద పడిపోవడంతో ఏం జరుగుతోందో తెలీక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అనేక మంది ఇళ్లు వదలి రోడ్లపైకి వచ్చేశారు.సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాత్రివేళ పడుకునే సమయంలో రావడంతో అనేక మంది నిద్రాహారాలు కరువై భయపడ్డారు. అసలే వాయు నాణ్యత అత్యంత ఘోరంగా ఉన్న కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అలంటి టైమ్ లో భూ కంపం ప్రభావం కనిపించడంతో దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. నేపాల్ కు భూ కంపాలు సర్వ సాధారణం. కారణం అక్కడి హిమాలయా పర్వతాల కింద టెక్టోనిక్ ప్లేట్స్ ఉండటమే. భూమి పొరల్లో ఉండే ఈ ఫలకాలు అటూ ఇటూ జరిగినప్పుడు ఈ భూకంపాలు ఏర్పడతాయి.