కేరళలో నిఫా వైరస్(Nipha virus) కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరిని బలితీసుకున్న ఈ వైరస్ మరింత మందికి వ్యాపించే అవకాశం ఉండటంతో కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కేరళలోసోకింది బంగ్లాదేశ్ వేరియంట్ అయిన నిఫా వైరస్ అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వైరస్ కు ఇప్పటికే ఇద్దరు బలికావడం, మరో ముగ్గురు దాని బారిన పడి చికిత్స పొందుతుండటంతో నిఫా వైరస్ ను నియంత్రించేందుకు అధికారులు యాక్షన్ మొదలు పెట్టారు.కోజికోడ్ జిల్లాలోని అటాన్ చేరి, మారుతోంకర, తిరువళ్లూరు,కాయక్కోడి, కవిలుంపర గ్రామాలతో పాటు మరో రెండు గ్రామాలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఆఫీసులు, స్కూళ్లు మూసివేశారు. కంటైన్మెంట్ జోన్ కు ఆనుకుని ఉన్న గ్రామాల వారినీ అప్రమత్తం చేశారు.
వేగంగా వ్యాపించే వైరస్ (Nipha virus)
కరోనాతో పోలిస్తే నిఫా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. మనిషిలో చాలా వేగంగా ప్రతిచర్యలు జరుపుతుంది. దాంతో మరణాల శాతం ఎక్కువ. అందుకని వైరస్ నియంత్రణకు ప్రత్యేక రక్షణ చర్యలు అవసరమవుతాయి. అందుకే పుణేలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిపుణుల బృందం ఒకటి కేరళ బయల్దేరింది. కోజీకోడ్ లోని మెడికల్ కాలేజీని మొబైల్ క్యాంప్ గా ఉంచి అక్కడనుంచే అదరికీ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వ్యాధి మరింత ప్రబలే ఆస్కారముంది కాబట్టి ముందుగానే ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బుధవారం మరో హెల్త్ వర్కర్ కు కూడా నిఫా వైరస్ సోకడంతో అతడిని ఐసోలేట్ చేశారు. అతనితో అంతకుముందు సన్నిహితంగామెలిగిన వారందరినీ ఐసోలేషన్ లోఉండాలని ఆదేశించారు.
నిఫా వైరస్ బాధితులు 706 మంది?
ఇప్పటి వరకూ నిఫా వైరస్ ప్రబలేందుకు ఆస్కారమున్న 706 మందిని గుర్తించారు. వీరిలో 77 మందిని హై రిస్క్ కేటగిరీగా గుర్తించారు. అయితే వారెవరికీ ఇప్పటి వరకూ లక్షణాలు కనిపించడం లేదు. 13 మందికి ఆస్పత్రిలో పరీక్షలు జరపగా వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నయని, తలనొప్పి ఎక్కువగా ఉందని చెప్పారని తెలుస్తోంది.
మరో 153 మందిని ఆరోగ్య శాఖ వర్కర్లను కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి నిఫా విజృంభణను నిర్ధారించారు.
పరిస్థితిని సమీక్షించిన కేరళ ప్రభుత్వం 19 కోర్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఐసోలేషన్ లో ఉన్న వారు బయటకు రాకుండా ఉండేలా చూడటమే కాదు.. వారికి అందాల్సిన నిత్యావసర సేవలను పర్యవేక్షించడానికి వాలంటీర్ బృందాలను నియమించారు.
మెదడును దెబ్బతీసే వైరస్
నిఫా వైరస్ సోకిన వారికి ముందు మెదడు దెబ్బతింటుంది. నిఫా వైరస్ ను నిర్ధారించేందుకు క్లినికల్ టెస్టులు జరపడం ఒక మార్గమే అయినా అంతకన్నా ముందే లక్షణాలు కనపడిన వారిని ఐసోలేట్ చేయడం ముఖ్యమని అందుకే ఆ చర్యలు చేపడుతున్నామని ఆరోగ్య మంత్రి వీణా జార్జి తెలిపారు. వైరస్ సోకిన వారిని కలిసిన వారందరినీ ఐసోలేషన్ లోకి స్వచ్ఛందంగా వెళ్లమని చెబుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు శెలవులు ప్రకటించినందున విద్యార్ధులకు ఆన్ లైన్ లోనే క్లాసులు చెప్పాలని విద్యామంత్రి వి.శివన్ కుట్టి ఆదేశించారు.
నిఫా ఇన్ క్యుబేషన్ పీరియడ్ 4-14 రోజులు (Nipha virus)
సాధారణంగా నిఫా వైరస్(Nipha virus) మనిషి శరీరంలో నాలుగు రోజులనుంచి 14రోజుల వరకూ ఉండే అవకాశాలున్నాయి.అయితే ఒక్కోసారి 45 రోజుల పాటూ మనిషి శరీరంలో ఉండే అవకాశాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. నిఫా వైరస్ బారిన పడి కోలుకున్న వారిని జీవితాంతం నరాల సంబంధిత సమస్యలు వేధించే ఆస్కారముంది. 20 శాతం మందిలో నరాల సంబంధిత సమస్యల వల్ల పర్సనాలిటీ డిజార్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. నిఫా వైరస్ ను సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోకపోతే మాత్రం మృతుల సంఖ్య 40శాతంనుంచి 75 శాతానికి పెరిగే ప్రమాదముంది.